Lal Darwaza Bonalu 2023 : లాల్దర్వాజ బోనాల్లో రాజకీయ ప్రముఖులు
Lal Darwaza Bonalu Hyderabad 2023 : భాగ్యనగరంలో బోనాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఆషాఢమాసం చివరివారం నిర్వహించే బోనాలతో పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని ఆలయం భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు.. అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు, టీమ్ ఇండియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య.. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అక్కాచెల్లెళ్లు.. పిల్లా పాపలు అంతా ఒక్కటిగా పసుపు లోగిళ్లు.. పచ్చని తోరణాలు.. వేపాకుల గుబాళింపులతో బోనాల పండుగ భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకువచ్చింది. ఏటా ఆషాఢమాసంలో చేసుకునే ఈ సంబురాలు ఈ సంవత్సరం అంబరాన్నంటుతున్నాయి. గోల్కొండలో తొలి బోనంతో ప్రారంభమైన ఉత్సవాలు.. ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి. లాల్ దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు, 17న ఘటాల ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో పండుగ ముగియనుంది.