ETV Bharat / state

Space-Tech: అంతరిక్ష సేవల్లోనూ దూసుకుపోవడమే లక్ష్యం.. సిద్ధమైన తెలంగాణ 'స్పేస్‌-టెక్‌' విధానం

author img

By

Published : Apr 18, 2022, 5:19 AM IST

Space-Tech: అంతరిక్ష సేవల్లోనూ దూసుకుపోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ 'స్పేస్‌-టెక్‌' విధానాన్ని.. మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా విడుదల చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా మెటావర్స్ పద్ధతిన వినూత్నంగా జరగనున్న ఈ కార్యక్రమంలో భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు.

Space-Tech: తెలంగాణ 'స్పేస్‌-టెక్‌' విధానం.. నేడు విడుదల చేయనున్న కేటీఆర్​
Space-Tech: తెలంగాణ 'స్పేస్‌-టెక్‌' విధానం.. నేడు విడుదల చేయనున్న కేటీఆర్​

Space-Tech: రక్షణ రంగ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న తెలంగాణను.. అంతరిక్ష సంబంధిత ఉత్పత్తులు, సేవలకు దేశీయ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టంది. ఇప్పటికే రాష్ట్రంలో డీఆర్​డీవో, ఎన్​ఆర్​ఎస్​సీ, ఏడీఆర్​ఐఎన్​, డీఆర్​డీఎల్​,ఆర్​సీఐ, బీడీఎల్​, మిధాని, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, డీఎమ్​ఆర్​ఎల్​ వంటి జాతీయ సంస్థలు అంతరిక్ష సాంకేతిక రంగంలో సేవలందిస్తున్నాయి. కొత్తగా స్కైరూట్, ధ్రువ వంటి.. అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయి. మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు ముందుకొస్తున్నాయి. కేంద్రం సైతం అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహిస్తూ.. 'స్పేస్‌కామ్‌ పాలసీ-2020'ని తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం.. స్పేస్‌-టెక్‌ విధానాన్ని రూపొందించింది.

దృశ్య మాధ్యమ విధానంలో..

ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ పాలసీని దృశ్య మాధ్యమ విధానంలో విడుదల చేయనున్నారు. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్, ఇన్‌స్పేస్‌ సంస్థ ఛైర్మన్‌ పవన్‌ గోయంకాలు అందులో పాల్గొననున్నారు.

తొలిసారి ఇలా..

అయితే ఇది సాధారణ కార్యక్రమంగా కాకుండా.. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ కార్యక్రమం పూర్తిగా మెటావర్స్ పద్ధతిన వినూత్నంగా జరగనుంది. కేటీఆర్​ సహా అతిథులు, వక్తల రూపాలు తెరపై కనిపించేలా.. వర్చువల్ విధానంలో జరగనుంది. దేశంలోనే ఒక ప్రభుత్వ కార్యక్రమం మెటావర్స్ విధానంలో జరగడం ఇదే తొలిసారి. అంతరిక్ష సాంకేతికతకు కేంద్రస్థానంగా.. తెలంగాణను మార్చే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త విధానంలో భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించనుంది.

అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ ముద్ర చాటాలనే..!

అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణను.. అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ రాష్ట్ర ముద్రను చాటాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ల సంకల్పమని.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. అంతరిక్ష ఉత్పత్తులు.. సేవల రంగంలో పెట్టుబడుల సమీకరణ, ఆవిష్కరణలతో పాటు అన్ని రకాల అవకాశాలను చేజిక్కించుకొని.. ముందుకు సాగేలా కొత్త విధానం ఉంటుందని తెలిపారు. ఉపగ్రహ ఆధారిత.. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని జయేశ్‌రంజన్‌ వివరించారు.

ఇవీ చూడండి..

ఆర్టీసీపై షార్ట్ ఫిల్మ్ తీయండి... పదివేలు సొంతం చేసుకోండి..!

భారత సరిహద్దుల్లో చైనా మొబైల్​ టవర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.