KRMB MEETING ON GAZETTE: 14 నుంచి అమల్లోకి గెజిట్​.. విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాల అప్పగింతకు అంగీకరించని తెలంగాణ

author img

By

Published : Oct 12, 2021, 7:27 PM IST

KRMB MEETING
KRMB MEETING ()

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నేరుగా నీరు తీసుకునే అన్ని ఔట్​లెట్లను అప్పగించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (krishna river management board) నిర్ణయించింది. గెజిట్ (KRMB MEETING ON GAZETTE)నోటిఫికేషన్ అమలుపై జరిగిన బోర్డు ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోకుంటే ఫలితం లేదని ఆంధ్రప్రదేశ్ అభిప్రాయపడింది. ఈ వాదనతో విభేదించిన తెలంగాణ... కృష్ణాలో నీటివాటా కేటాయించే వరకు నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరింది.

కేంద్ర జల్​శక్తి శాఖ జారీచేసిన గెజిట్​ నోటిఫికేషన్ అమలు విషయమై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (krishna river management board) ప్రత్యేకంగా సమావేశమైంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

బోర్టు ఆధీనంలోకి ఇవ్వబోం..

ఈనెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆర్కే పిళ్లై నేతృత్వంలోని ఉపసంఘం ఇచ్చిన నివేదికపై బోర్డు (KRMB MEETING ON GAZETTE)భేటీలో చర్చించారు. కృష్ణాపై ఉన్న 30 కేంద్రాలను బోర్డు ఆధీనంలోకి తీసుకునేలా ఉపసంఘం నివేదిక ఇచ్చింది. తెలంగాణకు ఇంకా నీటి కేటాయింపులు జరగనందున గెజిట్ నోటిఫికేషన్ అమలు కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని తెలంగాణ అధికారులు కోరారు. తెలంగాణ అవసరాల దృష్ట్యా జలవిద్యుత్ ఉత్పత్తి చాలా కీలకమని.. తాము నిబంధనల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని రజత్​కుమార్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు ఆధీనంలోకి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోదన్నారు. ప్రాజెక్టులను బోర్డు స్వాధీనం చేసుకోలేదని.. రాష్ట్రాలే అప్పగించాల్సి ఉందన్నారు. బోర్డు నుంచి ప్రతిపాదనలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేస్తుందని రజత్​కుమార్​ తెలిపారు.

అలా అయితే ప్రయోజనం ఏంటీ..?

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి రాకుంటే ఇక ప్రయోజనం ఏమిటని ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రశ్నించారు. సాగునీటి అవసరాలు లేకున్నా తెలంగాణ.. విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదిలినందువల్లే వివాదం తలెత్తి గెజిట్ వచ్చిందని ఏపీ అధికారుల అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్​కు సంబంధించి విద్యుత్​ సహా అన్ని ఔట్​లెట్లను (KRMB MEETING ON GAZETTE)బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరారు. అన్నింటినీ తీసుకోవాలన్న బోర్డు తీర్మానాన్ని తాము అంగీకరించామని.. ప్రతిపాదనలు అందిన వెంటనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు.

14 నుంచి అమల్లోకి గెజిట్​..

రాష్ట్రాలు ఇవ్వాల్సిన సీడ్​ మనీ విషయమై స్పష్టత ఇవ్వాలని రెండు రాష్ట్రాలు బోర్డును కోరాయి. ప్రత్యేక సమావేశంపై ప్రకటన విడుదల చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. 14 నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. గెజిట్​ నోటిఫికేషన్​లోని రెండో షెడ్యూల్​లో ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకుంటామని వెల్లడించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టుల నుంచి నేరుగా నీరు తీసుకునే అన్ని ఔట్​లెట్లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు కేఆర్ఎంబీ తెలిపింది.

అసలు గెజిట్​ నోటిఫికేషన్​లో ఏముంది..?

ప్రాజెక్టుల హెడ్‌వర్క్‌లు, బ్యారేజ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్‌ నిర్మాణాలు, కెనాల్‌ నెట్‌వర్క్స్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు కూడా కృష్ణాబోర్డు పరిధిలోకి వస్తాయని జల్‌శక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుంది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల అమలును చూస్తుంది. నోటిఫికేషన్‌లోని షెడ్యూల్‌ 2లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించే అధికారం కృష్ణాబోర్డుకు ఉంటుంది. అనుమతిలేని ప్రాజెక్టులను నోటిఫికేషన్‌లో పెట్టినంత మాత్రాన వాటికి అనుమతులు ఇచ్చినట్లు కాదని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను ఏపీ, తెలంగాణ రెండూ చూసుకోవాలని స్పష్టంచేసింది.

బోర్డు ఏమేమి చేస్తుంది..

  • కృష్ణాపై కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు చేస్తుంది. సాంకేతిక అనుమతులు ఇస్తుంది.
  • ప్రకృతి వైపరీత్యాలు, కరవులు, వరదల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలు ఎలా వ్యవహరించాలో బోర్డే నిర్దేశిస్తుంది.
  • విద్యుత్తు, సరఫరా, డిస్ట్రిబ్యూషన్‌ను రెండు రాష్ట్రాలు అమలు చేయాలి.
  • ఏదైనా ప్రాజెక్టును రెండు బోర్డులకు ప్రతిపాదించినప్పుడు.. పరిధిపై వివాదం తలెత్తితే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలి. ఈ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయం.

గోదావరి బోర్డుకూ ఇవే నిబంధనలు

  • కృష్ణా బోర్డుకు వర్తించే నిబంధనలే గోదావరి బోర్డుకూ వర్తిస్తాయి.
  • నోటిఫికేషన్‌ వెలువడిన ఆరునెలల్లోపు రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకు అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలి. ఆరు నెలల్లోపు అనుమతులు తీసుకోలేకపోతే నిర్మాణం పూర్తయినా అనుమతులు లేని ప్రాజెక్టులు బంద్‌ చేయాల్సిందే.

బోర్డు స్వరూపం నిర్ణయాధికారం వాటిదే

  • బోర్డుల స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించుకొనే అధికారం వాటికే ఉంటుంది.
  • రెండు బోర్డుల పరిధిలో షెడ్యూల్‌-2లో ఉన్న ఆపరేషనల్‌ ప్రాజెక్టులు, హెడ్‌వర్క్‌లు, కెనాల్‌, ట్రాన్సిమిషన్‌ లైన్లకు సంబంధించిన ఆఫీసు ప్రాంగణాలు, పరికరాలు, ఫర్నిచర్‌, వాహనాలు, డీపీఆర్‌లు, రికార్డులు, ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఉన్న డాక్యుమెంట్లు, ప్రాజెక్టులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కేఆర్‌ఎంబీ జ్యూరిస్‌డిక్షన్‌ పరిధిలోకి వస్తాయి.
  • విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం అనుమతి పొందని ప్రాజెక్టులను ఈ బోర్డులకు నివేదించకపోతే జల్‌శక్తి శాఖలోని టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ పరిగణనలోకి తీసుకోదు.
  • రోజువారీ ప్రాజెక్టుల నిర్వహణ, భద్రత విషయంలో రెండు బోర్డులకూ కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు సాయం అందిస్తాయి. బోర్డులు నిర్దేశించిన మేరకు ఇవి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన షరతులమేరకు ఇది అమలవుతుంది.

కేంద్ర బలగాల భద్రత

బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలూ భరించాలి. ఉమ్మడి ప్రాజెక్టులు, ఉమ్మడి కాలువల వద్ద కేంద్ర బలగాలను (సి.ఐ.ఎస్‌.ఎఫ్‌) నియమించాలన్నది నిర్ణయం. దీంతోపాటు బోర్డులకు 328 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా. టెలిమెట్రీ, ప్రాజెక్టుల నిర్వహణ.. ఇలా అన్నింటికి భారీ వ్యయమవుతుంది.

కృష్ణాలో ఏయే ప్రాజెక్టులు..

బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి చేరుతాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ.. సుంకేశుల, ముచ్చుమర్రి, కోయిల్‌సాగర్‌, భీమా, ఆర్డీఎస్‌, మూసీ, గాజులదిన్నె.. ఇలా మొత్తం 36 ప్రాజెక్టులు బోర్డు పాలనలోకి వస్తాయి. శ్రీశైలం హెడ్‌వర్క్స్‌ సహా ఆంధ్రప్రదేశ్‌ నీటిని తీసుకునే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, హంద్రీనీవా, ముచ్చుమర్రి, తెలంగాణలోని కల్వకుర్తి, రెండువైపులా విద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకే వస్తాయి. నాగార్జునసాగర్‌ హెడ్‌వర్క్స్‌, కుడి, ఎడమ కాలువలు, ఎడమ కాలువ కింద రెండు రాష్ట్రాలకు నీటిని అందించే బ్రాంచి కాలువలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కూడా బోర్డు పరిధిలోకి చేరాయి. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు-నగరి, వెలిగొండ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌.ఎల్‌.బి.సి) కూడా తమ పరిధిలోకి తెచ్చారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను కూడా ఇందులో చేర్చారు.

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.