ETV Bharat / state

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

author img

By

Published : Oct 18, 2020, 9:47 AM IST

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద
వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలంలోకి 7 లక్షల క్యూసెక్కులు దాటి ప్రవాహం వచ్చింది. అక్టోబరులో ఇంత భారీ వరద రావడం అరుదే. వారం రోజులుగా అన్ని రిజర్వాయర్లలోకి అత్యధిక ప్రవాహం ఉండగా, ఎందులోనూ నిల్వ చేయడానికి అవకాశం లేకుండా మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో కల్వకుర్తి పంపుహౌస్‌ కూడా నీటమునిగింది. నాగార్జునసాగర్‌, పులిచింతల కూడా పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. దీంతో మొత్తం నీరు సముద్రంలోకి వెళ్తోంది. ఏపీలోని కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చి నిండుగా ప్రవహిస్తోంది.

2009 అక్టోబరులో శ్రీశైలం చరిత్రలోనే అత్యధికంగా 17.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో ఏపీలోని కర్నూలు జిల్లాలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సుమారు 25 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి ఉండొచ్చని అప్పట్లో నీటిపారుదల శాఖ అంచనావేసింది. ఆ తర్వాత మళ్లీ అక్టోబరులో భారీ వరద రావడం ఇదే. గత ఏడాది అక్టోబరు 25న 6.52 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వరుసగా నాలుగురోజుల పాటు భారీ వరద ప్రవాహం కొనసాగింది. ఇప్పుడూ గత కొన్ని రోజులుగా భారీ వరద ఉండగా, శనివారం ఉదయం ఆరుగంటలకు నీటిపారుదల శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం 7.02 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కులకు మించి అనేకసార్లు వచ్చింది. విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడమే కాకుండా గేట్లు ఎత్తి ఎక్కువరోజులు నీటిని విడుదల చేశారు. ఆగస్టు రెండోవారం నుంచి ఇప్పటివరకు 50 రోజులకు పైగా స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రధాన నది కృష్ణాతో పాటు బీమా, తుంగభద్ర ఇలా అన్ని నదుల నుంచీ భారీ ప్రవాహం కొనసాగుతోంది. వారం రోజులుగా అన్ని రిజర్వాయర్లలోకి అత్యధిక ప్రవాహం ఉండగా, ఎందులోనూ నిల్వ చేయడానికి అవకాశం లేకుండా మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో కల్వకుర్తి పంపుహౌస్‌ కూడా నీటమునిగింది. నాగార్జునసాగర్‌, పులిచింతల కూడా పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. దీంతో మొత్తం నీరు సముద్రంలోకి వెళ్తోంది. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజి నుంచి 6.82 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ఇప్పటివరకు 910 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది. గోదావరిలో ఇప్పటివరకు 3500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది.

బీమాలో భారీ వర్షాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు కారణమైన తీవ్ర వాయుగుండం ప్రభావం కొంత బీమా పరీవాహక ప్రాంతానికి చేరిందని చెబుతున్నారు. తెలంగాణ మీదుగా బీమా పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం బీమా బేసిన్లో భారీవర్షాల వల్ల ఆ ఉపనది పొంగి ప్రవహిస్తోంది. కేంద్ర జలసంఘం శనివారం మధ్యాహ్నం రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా దియోన్‌గోన్‌ వంతెన వద్ద 407.75 మీటర్ల వద్ద ప్రమాదకరస్థితిలో ప్రవహిస్తోంది. ప్రవాహం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని షోలాపుర్‌ జిల్లా టక్లి వద్ద బీమాలోకి ప్రవాహాలు పెద్దఎత్తున వస్తున్నాయని తెలిపింది. ఆ నీరంతా జూరాలకు ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ ప్రవాహాలు కృష్ణాను తాకనున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి 4,94,634 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 10 రేడియల్‌ క్రస్టుగేట్లను 25 అడుగులు పైకెత్తి స్పిల్‌వే నుంచి 5,67,860 క్యూసెక్కులు, శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 22,,227 క్యూసెక్కులను నాగార్జునసాగô్కు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం శనివారం సాయంత్రం ఆరింటికి 884.40 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 211.95772 టీఎంసీలుగా నమోదైంది. నాగార్జునసాగర్‌ నుంచి 5.40 లక్షల క్యూసెక్కుల వరకు వదులుతున్నారు. పులిచింతల నుంచి 5,62,371 క్యూసెక్కులు వదులుతున్నారు.

గేట్లు ఎత్తి.. దించి.. మళ్లీ దించి!
శ్రీశైలం జలాశయంలో శుక్రవారం పలుమార్లు గేట్లు పైకెత్తి, మళ్లీ కిందకు దించి, తర్వాత ఇంకా కిందికి దించడం.. ఇలా కొన్ని గంటల తేడాలోనే చేశారని విశ్రాంత ఇంజినీర్లు ప్రస్తావిస్తున్నారు. వరద మాన్యువల్‌ను అనుసరించడం కన్నా 885 అడుగులగరిష్ఠ నీటిమట్టం ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు 10 గేట్లు 33 అడుగుల మేర ఎత్తి 6,91,780 క్యూసెక్కులు వదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ 25 అడుగుల ఎత్తుకు తగ్గించి 5,54,440 క్యూసెక్కులు వదిలారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంటకు 20 అడుగులకు తగ్గించి 4,67,000 క్యూసెక్కులు వదిలారు. ఎక్కడి నుంచి ఎంత వరద వస్తుందో తెలియకే ఇలా జరిగిందని, ఇది దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విమర్శలు రావడంతో శనివారం శ్రీశైలంలో స్థిరంగా గేట్ల నిర్వహణ కొనసాగుతోంది. స్థిరంగా 5,67,160 క్యూసెక్కులు వదులుతున్నారు.

ప్రమాదస్థాయిని దాటి..
కన్నడనాట వానపోటు తగ్గినా.. మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా ఒకవైపు బీమా, మరోవైపు కృష్ణా నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఆలమట్టి జలాశయం నుంచి 1,79,166 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపుర జలాశయం ఇప్పటికే నిండటంతో 2,01,487 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తుంగభద్ర నదికీ వరద రావడంతో 40,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అంచనా తప్పిందా ?

కృష్ణానదిపై చిట్టచివర ఉన్న ప్రకాశం బ్యారేజీకి శుక్రవారం రాత్రి ఏ సమయానికైనా 9 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని, అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు. పులిచింతల వద్ద శుక్రవారం మధ్యాహ్నం తర్వాత 8.52 లక్షల క్యూసెక్కుల వరద దాదాపు గంటన్నరసేపు వదిలిపెట్టారు. ఆ తర్వాత ప్రవాహాలు తగ్గించారు. అక్కడ వదిలిన ప్రవాహాలు, స్థానికంగా ఉండే మరో 40వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహాన్ని కలిపేసి 9 లక్షల క్యూసెక్కులు రావచ్చని అంచనా వేశారు. కానీ ప్రకాశం బ్యారేజీ వద్ద కనీసం 8 లక్షల క్యూసెక్కులు కూడా శుక్రవారం రాత్రి తర్వాత తాకలేదు. శనివారం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. జలవనరులశాఖ ఇంజినీర్లు కొందరిలో ఈ అంచనా ఎక్కడ తప్పిందని చర్చించుకుంటున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్న దూరం, దాన్ని చేరే సమయం, నది వెడల్పు తదితరాలను పరిగణనలోకి తీసుకుని లెక్కించాలని విశ్రాంత హైడ్రాలజీ నిపుణుడు ఒకరు చెప్పారు. అది లేకపోవడం వల్లే ఇలా లెక్క తప్పుతుందన్నారు.

ఇవీ చూడండి : హెచ్చరిక: రాగల 4 గంటలపాటు రాష్ట్రంలో వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.