ETV Bharat / state

అమిత్‌ షాను కలవనున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

author img

By

Published : Aug 21, 2022, 12:43 PM IST

Updated : Aug 21, 2022, 3:36 PM IST

సాయంత్రం అమిత్‌ షాను కలవనున్న జూనియర్‌ ఎన్టీఆర్‌
సాయంత్రం అమిత్‌ షాను కలవనున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

12:39 August 21

అమిత్‌షాను కలవనున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

Junior NTR to meet Amit Shah: మునుగోడు సమరభేరి పేరిట భాజపా నిర్వహిస్తున్న సభ నేపథ్యంలో నేడు హైదరాబాద్​కు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ కానున్నారు. మునుగోడు సభ అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి అమిత్‌ షా చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్‌ హోటల్‌లో రాత్రి 8.30 గంటలకు అమిత్​ షాతో ఎన్టీఆర్‌ సమావేశం కానున్నారు. అమిత్‌షా - ఎన్టీఆర్‌ భేటీని భాజపా వర్గాలు ధ్రువీకరించాయి. ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకుంటారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా నేడు ‘మునుగోడు సమరభేరి’ పేరుతో భాజపా సభ నిర్వహిస్తోంది. దీనికి ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ శాసనసభ స్థానాలను ఉప ఎన్నికల్లో కైవసం చేసుకున్న కమలదళం.. మునుగోడులోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సభకు కమలనాథులు భారీగా జనసమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు పలువురు మునుగోడులోనే మకాం వేసి జనసమీకరణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

షెడ్యూల్​లో మార్పులు..: మునుగోడు సభ కోసం రాష్ట్రానికి వస్తున్న అమిత్‌షా మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్ల నుంచి వచ్చే భాజపా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ సభామూర్తినగర్‌లో పార్టీ దళిత కార్యకర్త ఎన్‌.సత్యనారాయణను కలుసుకొని అరగంట పాటు గడుపుతారు. సత్యనారాయణ గత మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పార్టీ కోసం పనిచేస్తున్నారని భాజపా సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌ తెలిపారు.

సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ వద్దకు..: అమిత్‌షా మధ్యాహ్నం 3.20కి రమదా మనోహర్‌ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు రైతు నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 4.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 4.30 గంటలకు మనుగోడు చేరుకుంటారు. సాయంత్రం 4.40 గంటల నుంచి 4.55 గంటల వరకు సీఆర్‌పీఎఫ్‌ అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో రాజగోపాల్‌రెడ్డికి అమిత్‌షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. సభ అనంతరం అమిత్‌షా శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో రాత్రి 8 నుంచి 9.00 వరకు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ఇవీ చూడండి..

మునుగోడు సమరభేరి పేరిట నేడు భాజపా సభ, అమిత్​ షా షెడ్యూల్​ ఇదే

నగరంలో మరోసారి ఫ్లెక్సీ వార్‌, అమిత్​షా రాక ముందు కాక

మద్యం స్కాంలో సిసోదియాకు లుక్​ఔట్​ నోటీసులు, సవాల్​ విసిరిన మంత్రి

Last Updated :Aug 21, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.