మునుగోడు సమరభేరి పేరిట నేడు భాజపా సభ, అమిత్​ షా షెడ్యూల్​ ఇదే

author img

By

Published : Aug 21, 2022, 7:13 AM IST

మునుగోడు సమరభేరి పేరిట నేడు భాజపా సభ, అమిత్​ షా షెడ్యూల్​ ఇదే

bjp munugode samarabheri sabha మునుగోడు ఉపపోరుకు భారతీయ జనతా పార్టీ నేడు సమరభేరి మోగించనుంది. దుబ్బాక, హుజూరాబాద్‌ మాదిరే ఈ నియోజకవర్గంలోనూ కాషాయ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. ఇవాళ నిర్వహించే బహిరంగ సభ వేదిక పైనుంచి ప్రచారపర్వానికి భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌ షా శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు నేతలు భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు.

bjp munugode samarabheri sabha: తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా నేడు ‘మునుగోడు సమరభేరి’ పేరుతో భాజపా సభ నిర్వహిస్తోంది. దీనికి ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ శాసనసభ స్థానాల్ని ఉప ఎన్నికల్లో కైవసం చేసుకున్న కమలదళం.. మునుగోడులోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సభకు కమలనాథులు భారీగా జనసమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం చండూరు రహదారిలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కేంద్ర నిఘావర్గాలు సభాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పార్టీ ముఖ్యనేతలు పలువురు మునుగోడులోనే మకాం వేసి జనసమీకరణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న అమిత్‌షా..: మునుగోడు సభ కోసం రాష్ట్రానికి వస్తున్న అమిత్‌షా షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు జరిగాయి. ముందుగా ప్రకటించిన సమయం కంటే ముందే హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్ల నుంచి వచ్చే భాజపా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ సభామూర్తినగర్‌లో పార్టీ దళిత కార్యకర్త ఎన్‌.సత్యనారాయణను కలుసుకొని అరగంట పాటు గడుపుతారు. సత్యనారాయణ గత మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పార్టీ కోసం పనిచేస్తున్నారని భాజపా సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌ తెలిపారు.

అమిత్‌షా మధ్యాహ్నం 3.20కి రమదా మనోహర్‌ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు రైతు నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 4.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 4.30 గంటలకు మనుగోడు చేరుకుంటారు. సాయంత్రం 4.40 గంటల నుంచి 4.55 గంటల వరకు సీఆర్‌పీఎఫ్‌ అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో రాజగోపాల్‌రెడ్డికి అమిత్‌షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. సభ అనంతరం అమిత్‌షా శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో రాత్రి 8 నుంచి 9.00 వరకు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

....

ఇవీ చూడండి..

Amith Sha Munugodu Schedule అమిత్​ షా మునుగోడు పర్యటన షెడ్యూల్ ఇదే

ఉద్యోగం లేదని మనస్తాపం, 11నెలల చిన్నారిని నదిలో విసిరేసిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.