ETV Bharat / state

JP Nadda Tour in Telangana: రాష్ట్ర బీజేపీలో స్తబ్ధత.. రేపు తెలంగాణకు జేపీ నడ్డా రాక

author img

By

Published : Jun 24, 2023, 12:45 PM IST

JP Nadda
JP Nadda

JP Nadda Telangana Tour Updates : రాష్ట్ర బీజేపీలో స్తబ్ధత నెలకొన్న వేళ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ఇవాళ చర్చలు జరపనుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అధినాయకులు ఈ ఇద్దరు నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల వేళ హైకమాండ్ రంగంలోకి దిగటంతో పరిస్థితి గాడిన పడేనా అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు.

JP Nadda Telangana Tour on Sunday : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కానీ పార్టీలోని అంతర్గత కలహాలు.. భారతీయ జనతా పార్టీని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి కాషాయ గూటికి చేరినవారికి సముచిత స్థానం కల్పించడంలేదన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిపై హైకమాండ్ దృష్టి సారించింది. ఓ వైపు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దుతూనే.. మరోవైపు అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతోంది.

ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రోజున తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న నడ్డా.. సంపర్క్ సే సంవర్ధన్​లో భాగంగా ఇద్దరు ప్రముఖులను వారి నివాసాలకు వెళ్లి కలవనున్నారు. ఈ క్రమంలోనే మహాజన్ సంపర్క్ అభియాన్​లో భాగంగా సాయంత్రం 5 గంటలకు నాగర్​కర్నూల్​లో నిర్వహించే సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

BJP focus on Telangana Assembly Elections 2023 : నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, సాహసోపేతమైన నిర్ణయాలు.. తెలంగాణకు ఇచ్చిన నిధులను వివరిస్తూనే.. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను జేపీ నడ్డా ఎండగట్టనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సభ అనంతరం హెలికాప్టర్​లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి 6:45 గంటలకు దిల్లీకి తిరుగు పయనం కానున్నారని చెప్పాయ. ఇప్పటికే ఆయన సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసింది. నడ్డా పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం వస్తోందని తెలంగాణ బీజేపీ భావిస్తోంది.

Internal disputes in Telangana BJP : మరోవైపు బీజేపీలో అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. పార్టీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్‌ షా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి వీరిద్దరితో భేటీ కానున్నారు. ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించిన హైకమాండ్.. అసంతృప్తి చల్లార్చే అంశంపై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డితో చర్చించనున్నారు. ఈ ఇరువురితో జరిగే అగ్రనేతల భేటీకి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం హాజరు కానున్నారు. అధిష్ఠానం నుంచి పిలుపు రావటంతో హైదరాబాద్‌లో ఇవాళ జరగాల్సిన కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిల్లీలోనే ఉండగా.. ఈటల రాష్ట్రం నుంచి వెళ్లనున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకోగా.. రేపటి నుంచి బీజేపీ జాతీయ నాయకులు వరుసగా పర్యటించనున్నారు.

BJP High Command focus on Telangana : ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం తీరు, పార్టీలో స్తబ్దత నెలకొన్న వేళ.. శ్రేణుల్లో జోష్‌ నింపేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ్టి భేటీ జరుగుతుండగా.. పార్టీలో అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాతే తెలంగాణలో పర్యటించాలని అగ్రనేతలు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.