ETV Bharat / state

BJP high command focused on Telangana : తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. అగ్రనేతల పర్యటనలు కలిసొచ్చేనా..!

author img

By

Published : Jun 17, 2023, 6:35 AM IST

Telangana BJP Latest News : కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ డీలా పడింది. ఊపు మీద ఉన్న కాషాయదళం ఒక్కసారిగా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. నేతల మధ్య విభేదాలు, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముంగిట కార్యక్రమాల నిర్వహణలేక పార్టీలో నెలకొన్న స్తబ్ధత తీవ్ర నష్టం చేస్తోందని గ్రహించిన జాతీయ నాయకత్వం అప్రమత్తమైంది. శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు 'మహా జన్‌ సంపర్క్‌ అభియాన్‌' పేరుతో నిర్వహించే సభలకు పార్టీ అగ్రనేతలైన నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా హాజరయ్యేలా ప్లాన్‌ చేసింది.

BJP
BJP

BJP focus on Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న కమలనాథులకు కన్నడ ఫలితాలు బ్రేక్‌ వేశాయి. కర్ణాటకలో బీజేపీ ఘోరపరాజయం చవిచూడటంతో ఆ ప్రభావం కాస్త తెలంగాణపై పడింది. అధికార బీఆర్​ఎస్​తో ఢీ అంటే ఢీ అంటూ బీజేపీ తలపడింది. ఒక వైపు కర్ణాటక ఫలితాల ప్రభావం.. మరోవైపు పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాషాయ గూటికి చేరినవారికి సముచిత స్థానం కల్పించడంలేదన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.

కొంతమంది నేతలు బహిరంగంగానే విమర్శలు చేసిన పరిస్థితి. హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించినప్పటికీ తన స్థాయికి ఇది సరిపోదని.. రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా ప్రచార కమిటీ ఛైర్మన్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో ఈటల, బండికి మధ్య గ్యాప్‌ ఏర్పడింది. ఇరువురు రెండు గ్రూపులుగా విడిపోవడంతో శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఈటలకు ప్రచార కమిటీ ఛైర్మన్‌ ఇస్తారన్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతం చేయడంపై బీజేపీ ముఖ్య నేతల్లో ఆగ్రహాం వ్యక్తమైంది.

ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినటువంటి ముఖ్యనేతలు సమావేశమై ఈటల తీరుపట్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీజేపీలో ప్రచార కమిటీ ఉండదని బాంబ్‌ పేల్చారు. బీజేపీలో పదవులపై లీక్‌లు ఇచ్చే సంప్రదాయంలేదని పరోక్షంగా ఈటలకు చురకలంటారు. తరుణ్‌ చుగ్‌ సైతం మరోసారి అధ్యక్ష మార్పు ఉండదనే సంకేతం ఇచ్చారు. బండి సంజయ్‌ సైతం తన మార్పు ఉండదనే సంకేతాన్ని ఇచ్చేందుకు 125 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరింపచేసుకున్నారు. మొన్నటి వరకు ఈటలతో దోస్తీ చేసిన ముఖ్య నేతలు సైతం దూరమవ్వడంతో ఒంటరయ్యాడనే ప్రచారం పార్టీలో జోరుగా నడుస్తోంది.

BJP strength in Telangana : శాసన సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడంతో పాటు ఎన్నికలకు సమాయత్తమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. కొత్తగా మరో 125 మంది కార్యవర్గ సభ్యులను నియమించింది. జంబో కార్యవర్గం ప్రకటనతో మరో తలనొప్పి వచ్చి పడింది. చాలా మంది నేతలు కార్యవర్గ సభ్యుడిగా ప్రకటించడం పట్ల ఆగ్రహాం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇతర పార్టీల్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదువుల్లో పనిచేసిన తమకు ప్రాధాన్యతలేని కార్యవర్గ సభ్య పదవి ఇవ్వడం పట్ల పెదవి విరిచారు.

అసంతృప్తిని చల్లార్చేందుకు, బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు రాష్ట్ర నాయకత్వం చేస్తున్న వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా పోరాటాల గడ్డ ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం వస్తోందని భావించినప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఆశలు ఆవిరయ్యాయి. బిఫోర్‌ జాయ్‌ తుఫాన్‌ కారణంగా అమిత్‌ షా ఖమ్మం పర్యటన రద్దయ్యింది. త్వరలోనే ఖమ్మం గడ్డపై అమిత్‌ షాతో సభ నిర్వహిస్తామని ప్రకటించింది.

TS Assembly Elections 2023 : సభ నాటికి బీఆర్​ఎస్​ బహిష్కృత నేతలైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీజేపీ వైపుకు తిప్పుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. కర్ణాటక ఫలితాలతో పాటు ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లతారనే ప్రచారంతో బీజేపీకి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. పార్టీలోకి చేరికలు జరగకపోగా ఉన్న నేతలు చేజారిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధించాలంటే ఈ కీలక నేతలను పార్టీలోకి రప్పించేందుకు జాతీయ నాయకత్వం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఈ ఇద్ధరు నేతలతో పలుమార్లు సమావేశమై పార్టీలోకి ఆహ్వానించినప్పటికి ఫలితం లేకుండాపోయింది. ఈటల ప్రతిపాదనను నేతలు తోసిపుచ్చారు. ఈటల ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వయంగా అమిత్‌ షా రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరే అంశంపై రెండు రోజల కిందటే ప్రకటిస్తానని చెప్పినప్పటికీ తన ప్రకటనను వాయిదా వేసుకున్నారు. అమిత్‌ షాతో జరగుతున్న సంప్రదింపుల వల్లే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరే విషయంపై యూటర్న్‌ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

త్వరలో ఖమ్మంలో నిర్వహించే సభలో ఈ ఇద్దరు నేతలతో పాటు మరికొంత మంది నేతలను పార్టీలో చేర్చుకుని శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడంతో పాటు బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనేననే సంకేతాన్ని ఇచ్చేందుకు జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. అమిత్‌ షా పర్యటనతో పాటు ఈనెల 25న నాగర్‌ కర్నూల్‌ సభకు జేపీ.నడ్డా, నెలాఖరుకు ప్రధాని పర్యటన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తాయని నాయకత్వం భావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.