ETV Bharat / state

IT Internship: ప్రాంగణ నియామకాల్లో ఎంపికైతే ఇంటర్న్​షిప్ తప్పనిసరి!

author img

By

Published : Nov 28, 2021, 4:55 AM IST

IT Internship
IT Internship

ఐటీ కంపెనీలు ఒక్కసారిగా పంథా మార్చాయి. క్యాంపస్ ప్లేస్​మెంట్స్​లో కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌(అంతర్గత శిక్షణ)ను తప్పనిసరి చేస్తున్నాయి.

IT Internship: ఐటీ కంపెనీలు ఒక్కసారిగా పంథా మార్చాయి. ప్రాంగణ నియామకాల్లో కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌(అంతర్గత శిక్షణ)ను తప్పనిసరి చేస్తున్నాయి. బీటెక్‌ 7వ సెమిస్టర్‌లో ఉన్న వారిని ఎంపిక చేసుకుంటున్న కంపెనీలు 3-4 నెలల శిక్షణకు తీసుకుంటున్నాయని, దీనివల్ల పరస్పర ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా కొలువుకు ఎంపిక కాకముందే పరిశ్రమల్లో పనిచేసే అనుభవం కోసం కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ల(IT Internship)కు ఆహ్వానిస్తుంటాయి.

అంతర్గత శిక్షణ తప్పనిసరి...

ఈసారి అందుకు భిన్నంగా ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత అంతర్గత శిక్షణ ఇవ్వడాన్ని తప్పనిసరిచేశాయి. అందుకే ఇంటర్న్‌షిప్‌(IT Internship)లు భారీగా పెరిగాయని, శిక్షణ భృతి ఇచ్చే కంపెనీలు కూడా అధికమయ్యాయని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. ‘గత ఏడాది వరకు మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, గూగుల్‌ తదితర కంపెనీలే కొలువుల్లో చేరకముందు ఇంటర్న్‌షిప్‌లు అడిగేవి. ఈ ఏడాది సర్వీస్‌ కంపెనీలూ అదే పంథా అనుసరిస్తున్నాయని’ వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి కిశోర్‌ తెలిపారు.

శిక్షణ భృతి కూడా 20 శాతం పెంచాయని ఆయన చెప్పారు. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, డెలాయిట్‌, జేపీ మోర్గాన్‌, విప్రో తదితర పలు కంపెనీలు ఇంటర్న్‌షిప్‌(IT Internship)ను తప్పనిసరి చేసినట్లు కళాశాల వర్గాలు స్పష్టంచేశాయి. ఆయా కంపెనీలు నెలకు రూ.15-80 వేల వరకు శిక్షణ భృతి చెల్లిస్తున్నాయని, గూగుల్‌ అత్యధికంగా రూ.లక్ష వరకు ఇస్తోందని వివరించాయి. అమెజాన్‌ గతంలో రూ.60 వేలు ఇవ్వగా, ఈసారి గరిష్ఠంగా రూ.80 వేల వరకు అందజేస్తోందని వెల్లడించాయి.

ఐటీ

మానవ వనరుల అవసరం పెరగడమే కారణమా?

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ వినియోగం పెరిగింది. దాంతో భారత్‌లోని ఐటీ కంపెనీలకు భారీగా ప్రాజెక్టులు వస్తుండటంతో మానవ వనరుల అవసరం అత్యవసరంగా పెరిగింది. దాంతో కంపెనీలు కొలువుల్లో చేరకముందే ఇంటర్న్‌షిప్‌ల పేరిట శిక్షణ ఇస్తున్నాయని సన్‌టెక్‌ కార్ప్‌ సంస్థ సీఈఓ కాంచనపల్లి వెంకట్‌ చెప్పారు. దానివల్ల ఉద్యోగంలో చేరగానే ప్రాజెక్టులపై పనిచేయడానికి వారికి వీలవుతుందని తెలిపారు.

‘కరోనా కారణంగా విద్యార్థిగా ఉన్నప్పుడు ఇంటర్న్‌షిప్‌ ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. చదువు కూడా ఆన్‌లైన్‌లోనే సాగింది. అందుకే ఈసారి ఐటీ పరిశ్రమలు ఉద్యోగాలకు ఎంపిక చేసిన తర్వాత శిక్షణ ఇచ్చేలా వ్యూహం మార్చాయి’ అని ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి ప్రసన్నకుమార్‌ చెప్పారు.

నియామకాలూ పెరుగుతాయి

ప్రాంగణ నియామకాలు కూడా ఈసారి పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో లక్షల మంది ఉద్యోగాలు మానేయడం వల్ల భారత్‌కు ప్రాజెక్టులు పెరుగుతుండటం కూడా ఒక కారణమని విశ్లేషిస్తున్నారు. ఏఐసీటీఈ గణాంకాల ప్రకారం 2019-20లో రాష్ట్రం నుంచి 36,197 మంది ఎంపికకాగా...గత ఏడాది ఆ సంఖ్య 28,516కి తగ్గింది. ఈసారి 2019-20 కంటే మించవచ్చని ప్రాంగణ నియామకాల అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.