ETV Bharat / state

Indian Racing League in Hyderabad : హుస్సేన్‌సాగర్‌ తీరంలో కార్ రేసింగ్

author img

By

Published : Dec 10, 2022, 6:40 AM IST

indian  racing league
indian racing league

Indian Racing League in Hyderabad : హైదరాబాద్​ హుస్సేన్‌సాగర్ తీరంలో కార్ రేసింగ్​కు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 11 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

Indian Racing League in Hyderabad : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌ తీరం మరోసారి కార్‌ రేసింగ్‌కు సిద్ధమైంది. ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ సన్నద్దతలో భాగంగా.. ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించేందుకు ప్రయత్నించగా.. పలు ప్రమాదాలు, రేసర్లకు గాయాలు కావడంతో టెస్ట్ రైడ్స్ మాత్రమే నిర్వహించారు.

ఈరోజు నుంచి పెట్రోల్ కార్లతో జరిగే రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొననున్నాయి. ఇందులో స్వదేశీ, విదేశీ రేసర్లు ఉన్నారు. పెట్రోల్ కార్లు 240 స్పీడ్‌తో వెళ్తాయని.. ఎలక్ట్రిక్ కార్లయితే మాగ్జిమమ్ స్పీడ్ 320 వరకూ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. రేసింగ్‌ను 7,500 మంది వరకూ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. రేసింగ్‌ దృష్ట్యా హైదరాబాద్‌ ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 11 తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఈ మార్గాల్లో నో ఎంట్రీ..: ఐ-మ్యాక్స్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి.. ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్ మీదుగా రేసింగ్‌ ట్రాక్ తిరిగి ఐ-మ్యాక్స్ దగ్గర ఉన్న గ్యారేజీకి చేరుకుంటుంది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు. బుద్ధ భవన్-నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్-ట్యాంక్‌బండ్ వైపు మళ్లించారు. రసూల్‌పురా-మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగు తల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్-రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు.

ఇవీ చదవండి: ఫార్ములా-ఈ రేస్.. భారీగా భద్రత ఏర్పాట్లు: సీపీ సీవీ ఆనంద్

కాంగ్రెస్​కు కొత్త తలనొప్పి..​ 'హిమాచల్​ సీఎం' విషయంలో హైకమాండ్​దే ఫైనల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.