ETV Bharat / state

కరోనాకు వరద తోడై.. నిత్యావసరాల ధరలు నింగికి!

author img

By

Published : Nov 26, 2020, 8:12 AM IST

నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒకవైపు కరోనా.. మరోవైపు వరదల ప్రభావం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. వంటింటి సరకులన్నీ ప్రియం అయ్యాయి. పేద, మధ్య తరగతి వారికి ఈ ధరలు పెనుభారంగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే నూనెల ధరలు 25 శాతానికి పైగా పెరిగాయి. ఇక పప్పుల సంగతి సరేసరి.

RATE HIKES
కరోనాకు వరద తోడై.. నిత్యావసరాల ధరలు నింగికి!

పనుల్లేక పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం పడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. ఏడాది కిందటితో పోలిస్తే నూనెల ధరలు 25% పైగా పెరిగాయి. వేరుసెనగ నూనె ధర మూడేళ్ల కిందటితో చూస్తే ఏకంగా 50 శాతం పెరిగింది. కిలో రూ.100కు పైగా చేరడంతో పప్పులూ ఉడకడం లేదు. చింతపండు కిలో రూ.250 వరకు చేరింది. కరోనా లాక్‌డౌన్‌తో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకుల నిల్వలు నిండుకోగా.. ఇటీవలి వానలకు స్థానికంగానూ కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్‌లో అన్నింటికీ కొరత ఏర్పడి ధరలపై ప్రభావం పడింది. లాక్‌డౌన్‌ తర్వాత సామాన్యుల కొనుగోలు శక్తి పడిపోయిన తరుణంలో వంటింటి సరకులు ప్రియం కావడం ఇంటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

rate hikes
వివరాలిలా..

వానలు కురిసి.. నూనెలు ఎగిసి..

వంట నూనెలకు చైనా, పాకిస్థాన్‌, యూరోపియన్‌ దేశాల్లో డిమాండ్‌ అధికం. మన దేశం నుంచే డిసెంబరులోగా 90 వేల టన్నుల వేరుసెనగ నూనె చైనాకు ఎగుమతి చేయాల్సి ఉంది. దీంతో దేశీయంగా ధరలు పెరిగాయి. 20 టన్నుల ట్యాంకర్‌ కొంటే సగటున లీటరుకు రూ.147 వరకు అవుతోంది. ఇది చిల్లర మార్కెట్‌కు వచ్చేసరికి మరింత పెరుగుతోంది. భారీవర్షాలతో ఈసారి దిగుబడి తగ్గడంతో వేరుసెనగ కాయలకూ కొరత ఏర్పడింది. అయినా రాష్ట్రం నుంచి గుజరాత్‌, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. ఆముదం ధరలు కూడా ఎగిశాయి. ప్రస్తుతం వేరుసెనగ నూనె కిలో రూ.160, పొద్దుతిరుగుడు రూ.120, పామోలిన్‌ రూ.100 ధర పలుకుతున్నాయి.
చింతపండు గతేడాదితో పోలిస్తే కిలోకు రూ.60 వరకు హెచ్చింది. కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో కిలో రూ.250గా ఉంది. గతేడాది పంట ఉత్పత్తి తగ్గడం, తాజా డిమాండ్‌ దృష్ట్యా శీతల గిడ్డంగుల్లోని పండును రవాణా చేస్తున్నారు. కరిపులి రకం క్వింటాలు రూ.1,800-రూ.2వేల వరకు లభిస్తోంది. హిందూపురం ప్రాంతంలో 5వేల టన్నుల వరకు నిల్వ ఉంది.

rate hikes
వివరాలిలా...

సంతలోనే కూరలు కుతకుత!

  • హోల్‌సేల్‌ మార్కెట్లో మినపగుళ్లు కిలో రూ.110 నుంచి రూ.120 వరకు లభిస్తుండగా.. చిల్లర మార్కెట్‌లో రూ.140 వరకు అమ్ముతున్నారు. గతంతో పోలిస్తే రవాణా, హమాలీ తదితర ఖర్చులు పెరిగాయన్నది వ్యాపారుల వాదన. కొంతకాలంగా విదేశాల నుంచి దిగుమతులు నిలిచిపోవడం, దేశీయంగా ఉత్పత్తి తగ్గడంతో పప్పుల ధరలు ఎగిశాయి. మరో పక్షం రోజుల్లో కొంత తగ్గవచ్చని చెబుతున్నారు. అన్ని రకాల బియ్యం ధరలు గతేడాదితో పోలిస్తే కిలోకు రూ.1.50 నుంచి రూ.2 వరకు పెరిగాయి.
  • కరోనా సమయంలో రవాణా ఇబ్బందులతో నష్టపోయిన రైతులు గత ఖరీఫ్‌లో కొత్తగా కూరగాయల పంటలు వేయలేదు. వేసిన ప్రాంతాల్లోనూ అతివృష్టి వల్ల పంటలు కుళ్లిపోయి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం టమాటా మినహా.. అన్ని కూరగాయల ధరలు గత నెలతో పోల్చితే ప్రియమయ్యాయి. బంగాళదుంప ఏకంగా కిలో రూ.45కు చేరింది.
  • ఉల్లిగడ్డ అక్టోబరులో కిలోకు రూ.100 నుంచి రూ.120 మధ్య ధర పలికింది. క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.65-రూ.75 మధ్య ఉంది. కేంద్రం విదేశాల నుంచి 30 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవడంతో మార్కెట్‌లో లభ్యత పెరిగింది. కొత్త పంట వచ్చేదాకా ఈ భారం తప్పదు.

ఇదీ చూడండి : 41 డివిజన్లలో.. 49 మంది నేరచరితులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.