ETV Bharat / state

Hyderabad Police Arrested Cyber Gang : సైబర్‌ మోసాల్లో 'ఉగ్ర' లింకుల కలకలం

author img

By

Published : Jul 23, 2023, 8:07 AM IST

Cyber
Cyber

Cyber Gang Arrested in Hyderabad : పెట్టుబడుల ముసుగులో చైనా కేటుగాళ్లు సాగిస్తోన్న సైబర్‌ మోసాల వెనుక ఉగ్రలింకులు బయటపడ్డాయి. దేశంలో నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి.. భారత్‌ కరెన్సీని క్రిప్టోగా మార్చి హవాలా మార్గంలో దుబాయి నుంచి చైనాకు చేరవేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15 వేల మంది బాధితుల నుంచి రూ.712 కోట్లు కాజేశారు. ఈ వంచనకు పాల్పడ్డ 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సైబర్‌ మోసాల్లో ఉగ్ర లింకుల కలకలం.. ఛేదించిన పోలీసులు

Hyderabad Police Arrested Cyber Criminals : పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్‌ పోలీసులు. సైబర్‌ మోసగాళ్లు.. కంపెనీల పేర్లతో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరిట టెలీగ్రామ్‌, వాట్సాప్‌లకు సందేశాలు పంపుతారు. తాము ఇచ్చే టాస్క్‌లను పూర్తి చేస్తూ.. రోజూ రూ.900 నుంచి రూ.1500 వరకూ సంపాదించొచ్చంటూ ఆశ చూపుతారు. పెద్దఎత్తున నగదు రాగానే మాయగాళ్లు ఖాతా రద్దు చేస్తారు. చిక్కడపల్లికి చెందిన శివకుమార్‌ రూ.28 లక్షలు పోగొట్టుకొని సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాస్క్‌ల పేరిట.. 6 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో బాధితుడు జమ చేశాడు. ఆ ఖాతాల నుంచి నిందితులు.. మరో 48 ఖాతాలకు మళ్లించారు. ఈ విధంగా వేల మంది నుంచి ఆ బ్యాంకు ఖాతాల్లో రూ.584 కోట్లు జమ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. రాధికా మర్చంట్స్‌ అనే నకిలీ కంపెనీ పేరుతో.. మహ్మద్‌ మున్వర్‌ బ్యాంకు ఖాతాలు ప్రారంభించి.. నగదు లావాదేవీలు నిర్వహించినట్లు నిర్ధారించారు. బ్యాంకు ఖాతాకు లింక్‌ చేసిన సెల్‌ఫోన్‌ నంబరు ఆధారంతో కూపీ లాగటంతో బోగస్‌ కంపెనీల బాగోతం బయటపడింది.

చైనాతో లింకులు..: లఖ్‌నవూకు చెందిన దళారులు వికాస్‌, మనీష్‌, రాజేష్‌ ఆదేశాలతో.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ మున్వర్‌, అరుల్‌ దాస్‌, షమీర్‌ ఖాన్‌, ఎస్‌.సుమేయర్.. వారి వద్దకు చేరారు. 3 నెలల పాటు అక్కడే ఉండి 33 బోగస్‌ కంపెనీల పేరిట వేర్వేరు బ్యాంకుల్లో 65 ఖాతాలు తెరిచారు. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్‌ మోసాల్లో కొట్టేసిన రూ.128 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. రెండు బ్యాంకు ఖాతాల ఆధారంగా చైనా లింకులు బయటపడ్డాయి. పలు బ్యాంకు ఖాతాల్లో రూ.పదిన్నర కోట్ల నగదు సీజ్‌ చేశారు. బంజారాహిల్స్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌.. సైబర్‌ మోసగాళ్ల వివరాలు వెల్లడించారు.

చైనాకు చెందిన కెవిన్‌ జూన్‌, లౌ లాంగ్జౌ, షాషా సైబర్‌ మోసాల సూత్రధారులు. వీరు భారత్‌లోని ఏజెంట్లు, దళారులను.. వాట్సాప్‌, టెలీగ్రామ్‌ల ద్వారా చేర్చుకున్నారు. అహ్మదాబాద్‌ చెందిన కుమార్‌ ప్రజాపతి, ప్రకాశ్‌ ప్రజాపతి సోదరుల ద్వారా.. చైనా మాయగాళ్లు పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట మోసాలకు అవసరమైన సహకారం తీసుకున్నారు. వీరి ద్వారానే బోగస్‌ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నారు. భారత్‌లోని వివిధ బ్యాంకులకు చెందిన 113 బ్యాంకు ఖాతాల లావాదేవీలను ఇక్కడే నిర్వహిస్తే ఐపీ అడ్రస్‌ ద్వారా పట్టుబడే అవకాశం ఉండటంతో కొత్త ఎత్తువేశారు. ఈ బ్యాంకు ఖాతాలకు లింక్‌ చేసిన సిమ్‌కార్డులను దుబాయ్‌ చేర వేశారు. ఖాతాల్లోని భారతీయ కరెన్సీని క్రిప్టోగాా మార్చేందుకు కుమార్‌ ప్రజాపతి సహకారం తీసుకున్నారు. వాలెట్ల ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చిన సొమ్ముతో కొంత భాగం హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు చేరినట్లు నిర్ధారించారు. సమాచారం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి అందజేసినట్టు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

"బాధితులు రూ.50 వేలు పెట్టుబడి పెడితే రూ.లక్ష వచ్చినట్టు చూపిస్తారు. విత్​ డ్రా చేసుకోవచ్చా అంటే లేదు అన్ని టాస్కులు పూర్తి చేస్తేనే మీకు ఆ డబ్బు వస్తుందని చెబుతారు. ఆ గ్రూప్​లో ఉండే వారే ఒత్తిడి తీసుకొచ్చి.. ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టేలాగా చేస్తారు. అలా ఎక్కువ సొమ్మును అకౌంట్లో జమ చేయిస్తారు. తర్వాత ఆ అకౌంట్​ను మూసేస్తారు. ఇలా మోసాలకు పాల్పడుతున్నారు." - సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ సీపీ

కేసులో చైనా, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, దుబాయ్‌కు చెందిన 15 మంది ఉన్నట్టు తేల్చారు. వీరిలో క్రిప్టో కరెన్సీగా మార్చటంలో సహకరించిన ప్రకాశ్‌ ప్రజాపతి, కుమార్‌ ప్రజాపతి, నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించిన నయీముద్దీన్‌, వహీయుద్దీన్‌ షేక్‌, గగన్‌ కుమార్‌ సోని, పర్వేజ్‌ అలియాస్‌ గుడ్డు సహా మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 17 మొబైల్‌ ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు 22 సిమ్‌కార్డులు, 4 డెబిట్‌ కార్డులు, 33 కంపెనీల పత్రాలు, 3 బ్యాంకు చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.