ETV Bharat / state

FLOODS: హైదరాబాదీలకు ఇంకెన్నాళ్లీ 'వరద బాధలు'..!

author img

By

Published : Sep 4, 2021, 11:16 AM IST

Hyderabad rains
Hyderabad rains

హైదరాబాద్​ నగరంలో కొద్దిపాటి వర్షం కురిసినా ప్రధాన రహదారులు చెరువులను మరిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో.. కొన్నిచోట్ల వర్షం పడిన ప్రతిసారీ సమస్య తీవ్రత కనిపిస్తోంది. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్‌ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఖైరతాబాద్‌లోని మెట్రో స్టేషన్‌ వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఓ మోస్తరు వర్షం కురిసిందంటే ఖైరతాబాద్‌లోని రైల్వే గేటు సమీపంలోని జాతీయ రహదారిలో తరచూ రోడ్లపై నీరు నిలుస్తోంది. భారీ వర్షం వచ్చిందంటే ఆ మార్గం దాదాపు మూతపడినట్లే. మెట్రో స్టేషన్‌ ఏర్పాటుకు ముందు ఇంతగా నీరు నిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఎగువన లక్డీకాపూల్‌లోని నిరంకారీ భవన్, ఏసీగార్డ్స్, చింతల బస్తీ ప్రాంతాల నుంచి వర్షపునీరు దిగువన ఉన్న రైల్వే గేటు సమీపంలో రాజీవ్‌ కూడలికి చేరుతుంది. ఇక్కడి నుంచి దాదాపు వంద మీటర్ల దూరంలో ఉన్న బల్కాపూర్‌ నాలాకు పైపులైన్‌ అనుసంధానం ఉండేది. గతంలో నీటి వరద వచ్చింది వచ్చినట్లే పైపులైన్‌ మార్గంలో నాలాలో కలిసి వెళ్లేది.

మెట్రో స్టేషన్‌ నిర్మాణ సమయంలో ఈ మార్గంలో వెళ్లే పైపులైన్‌ దెబ్బతినడంతో నీరు సాఫీగా వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో ఓ సారి ఈ పైపు లైన్‌లో వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేయగా.. పెద్ద ఎత్తున సిమెంట్‌ బస్తాలు లభించాయి. ఇలాంటి వ్యర్థాలు పైపుల్లో ఇరుక్కోవడం, వాటిని తొలగించే సరైన సాంకేతికత లేని కారణంగానే నీరు ముందుకు పోవడం లేదు. ఫలితంగానే, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు మొత్తం పోవాలంటే వర్షం తగ్గాక కనీసం గంటకు పైగా సమయం పడుతోంది.

లక్డీకాపూల్‌ కూడలిలోనూ..

లక్డీకాపూల్‌ కూడలిలోనూ..
లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద(లక్కీ హోటల్‌ ఎదుట) సైతం ఇదే పరిస్థితి. ఒకవైపు ఎగువ ప్రాంతం కావడం.. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్‌ రైల్వే లైన్‌ ఉండటంతో ఎటూ వేగంగా వెళ్లలేని తీరు నెలకొంటోంది. రైల్వే ట్రాక్‌ మార్గంలో పైపులైన్‌ ఉన్నా.. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు మొత్తానికి అదొక్కటే దిక్కు కావడంతో కాసేపు ఈ సమస్యను ఎదుర్కోవడం తప్పనిసరిగా భావిస్తున్నారు. లేనిపక్షంలో రైల్వే ట్రాక్‌ మార్గంలో మరోపైపు లైన్‌ను కూడా వేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆలోచన చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వ్యర్థాలతో పూడుకుపోయిన పైపులైన్‌కు వెంటనే మరమ్మతులు చేయాలి. మరో పైపులైన్‌ మార్గాన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా రెండు లైన్ల ద్వారా నీరు ముందుకు వెళితే తప్పా సమస్యకు పరిష్కారం లభించదన్న అభిప్రాయం ఉంది. పెట్రోల్‌ బంక్‌ వైపు మార్గంలో రోడ్లు, భవనాల కార్యాలయం వైపు నుంచి పైపులైన్‌ వేసేందుకు నిర్ణయించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. దాదాపు రూ.28 లక్షల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. దీన్ని వెంటనే చేపట్టాల్సిన అవసరముంది.

ట్రాఫిక్‌ వారే ప్రత్యేక సిబ్బందిగా మారి..
వర్షాకాలంలో జీహెచ్‌ఎంసీ వర్షాల వేళ ప్రత్యేక సిబ్బందిని నియమిస్తుంది. నీరు నిలిచే అవకాశమున్న చోట ఉండి.. నీరు వెళ్లేలా చూసుకోవడం, మోటార్ల సదుపాయం ఉంటే వాటిని ఆన్‌ చేయడం వారి బాధ్యత. ఖైరతాబాద్‌లోని రాజీవ్‌ కూడలిలో మాత్రం ఎప్పుడూ ఈ సిబ్బంది కనిపించడం లేదు. భారీ వర్షం పడుతోందంటే, ఎక్కడ ట్రాఫిక్‌ ఆగి సమస్య తలెత్తుతుందోననే భయంలో ట్రాఫిక్‌ పోలీసులు ముందే అక్కడికి చేరుకుంటున్నారు. నీరు వెళ్లేందుకు ఆస్కారం ఉన్న మ్యాన్‌హోళ్ల మూతలు తీస్తున్నారు. అవసరమైతే అక్కడే ఉండి ఆ మార్గంలో వచ్చే వాహనదారులను అప్రమత్తం చేయడం, ఎవరూ రాకుండా వాహనాలను అడ్డుగా పెట్టడం లాంటి చర్యలు చేపడుతున్నారు. మెట్రో కింద నీరు చేరడంతో పంజాగుట్ట నుంచి లక్డీకాపూల్‌ మార్గం, లక్డీకాపూల్‌ నుంచి పంజాగుట్ట మార్గం రెండు వైపులా ఇబ్బంది తప్పడం లేదు.

ఇదీ చూడండి: Hyderabad Rains: లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇంకెన్నాళ్లీ హైదరా'బాధలు'!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.