ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఇక రంగంలోకి సీబీఐ

author img

By

Published : Dec 29, 2022, 7:00 AM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పజెప్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రతులు సైతం వెలువడ్డాయి. ఇక ఈ ప్రతులు దిల్లీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న తర్వాత, సంచాలకులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. దర్యాప్తు అధికారిని నియమిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ సంచాలకులు జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా విచారణ ప్రారంభం కానుంది.

ఎమ్మెల్యేలకు ఎర కేసు
ఎమ్మెల్యేలకు ఎర కేసు

ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి బదిలీ చేసిన హైకోర్టు

మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 26వ తేదీన నమోదైన ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి బదిలీ కానుంది. 455/2022ను కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని మొయినాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేయగా బుధవారం తీర్పు ప్రతులు వెలువడ్డాయి. దీని ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేయనుంది. హైకోర్టు తీర్పు ప్రతులు దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత.. దానికి అనుగుణంగా ఆ సంస్థ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

దర్యాప్తు అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగానే సదరు దర్యాప్తు అధికారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు. ఇప్పటికే మెయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్​ఐఆర్​ను ఆధారం చేసుకొని సీబీఐ అధికారులు తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లో ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు. రాంచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను అరెస్ట్ చేసి అక్టోబర్ 28న రిమాండ్‌కు తరలించారు.

సిట్​ దర్యాప్తు కొట్టివేత: నెల రోజులకు పైగా జైల్లో ఉన్న ముగ్గురు నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్‌కు అప్పజెప్తూ ప్రభుత్వం నవంబర్ 9న జీవో జారీ చేసింది. ఆ వెంటనే సిట్ అధికారులు వేగంగా దర్యాప్తును కొనసాగించారు. అందులో భాగంగా నిందితుల సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించారు. వాటిలో నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పలువురికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే సిట్ దర్యాప్తు మొత్తాన్ని హైకోర్టు కొట్టేయడంతో సీబీఐ అధికారులు దీన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సైతం హైకోర్టు రద్దు చేసినందున సీబీఐ దర్యాప్తు మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానుంది.
సీబీఐ విచారణ మొదట ఎవరితో ప్రారంభం అవుతుంది: ఈ కేసులో ఒకట్రెండు రోజుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదట ఎవరిని పిలిచి ప్రశ్నిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే ఫిర్యాదుతో నమోదైన కేసును ఆధారంగా చేసుకొని సీబీఐ అధికారులు మరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేయనున్నారు. అయితే ఇందులో ఎమ్మెల్యేలను మొదట పిలుస్తారా లేకపోతే నిందితులుగా ఉన్న రాంచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను పిలుస్తారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.