ETV Bharat / state

రోజూ ఏదో ఒక సమావేశం పెట్టాలి.. ఎవరినో తిట్టాలి.. ఇదే పనా: తలసాని

author img

By

Published : Dec 28, 2022, 8:48 PM IST

Minister Talasani
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

Talasani is Fair with Central Minister Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర పోలీసులను కించపరిచేలా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆరోపించారు. ఫాంహౌజ్ ఫైల్స్​లో సీఎం కేసీఆర్ నవ్వుల పాలయ్యారని కిషన్ రెడ్డి హేళనగా మాట్లాడుతున్నారన్నారు. కోర్టు సీబీఐకి ఇచ్చింది తప్ప.. నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వలేదని తలసాని అన్నారు.

Talasani is Fair with Central Minister Kishan Reddy: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంబరాలు చేసుకోవడం ఏంటని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి బదిలీచేస్తే.. దిగజారి మాట్లాడుతున్నారని హైదరాబాద్‌లోని మంత్రి విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడారు.

కిషన్‌రెడ్డికి హైదరాబాద్‌ పోలీసులపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా ఉండి రాజకీయాలు తప్ప... నాలుగేళ్లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా చిల్లరరాజకీయాలు మాని.. రాష్ట్రప్రభుత్వంతో అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ప్రజలు ఎన్నుకున్నది రాజకీయాలు చేయడానికి కాదని హితవు పలికారు.

రాష్ట్రంలోని బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిగా ఉన్నవాళ్లు మరింత బాధ్యతగా మాట్లాడాలని కోరారు. హైదరాబాద్‌ ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. అసలు హైదరాబాద్‌కు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. సికింద్రాబాద్‌ ప్రజలు ఎన్నో ఆశలతో కిషన్‌రెడ్డికి ఓటేస్తే.. కేంద్ర నిధులు తెచ్చి హైదరాబాద్‌ అభివృద్ధికి సాయం చేశారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి బుద్ది చెప్పడానికి ఓటర్లు సిద్దంగా ఉన్నారన్నారు. ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలేనా.. మరేమీ లేవా అని ధ్వజమెత్తారు.

"హైకోర్టు కేసు ఏమీ లేదని చెప్పిందా.. సిట్‌ నుంచి కేసును సీబీఐకు అప్పగించారు. అంటే కేసు ఇంకా ఉంది అని అర్థం కదా. ఏజెన్సీల పట్ల బీజేపీ వాళ్లకు ఎందుకంత చిన్నచూపు ఉందో అర్థం కావడం లేదు. కేంద్రమంత్రిగా ఉన్న మీరు ఆ బాధ్యతలను మరిచి.. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను అపహేళన చేశారు. సిట్‌ పోలీసులను తీసేసి సీబీఐకు కేసు అప్పగిస్తే అపహేళన ఎందుకు. ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలు అరెస్టు అయినప్పుడు మొదట కోర్టుకు వెళ్లింది ఎవరు. ఒకవైపు మీకు సంబంధం లేకుండానే నిందితులను విడిపించడానికి వెళ్లారా. కేంద్రమంత్రి బాధ్యతగా మాట్లాడాలి. మీకు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి రండి తేల్చుకుందాము." - తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పశుసంవర్ధక శాఖ మంత్రి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.