ETV Bharat / state

దంచికొట్టిన వర్షం.. ఉక్కిరిబిక్కిరైన భాగ్యనగరం..

author img

By

Published : Sep 26, 2022, 6:54 PM IST

Updated : Sep 27, 2022, 6:31 AM IST

దంచికొట్టిన వర్షం.. ఉక్కిరిబిక్కిరైన భాగ్యనగరం..
దంచికొట్టిన వర్షం.. ఉక్కిరిబిక్కిరైన భాగ్యనగరం..

Hyderabad Rains: భారీగా వర్షంతో హైదరాబాద్ వణికింది. మూడు గంటల పాటు వరుణుడు విరుచుకుపడటంతో భాగ్యనగరం అతలాకుతలమైంది. వరద నీరు చేరడంతో.. రహదారులన్ని చెరువులను తలపించాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన.. రాత్రి 8 గంటల వరకూ కురుస్తూనే ఉంది. కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ స్తంభించిపోయింది.

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. వరద నీటిలో వాహనదారుల అవస్థలు

Hyderabad Rains: భారీ వర్షంతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరైంది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో.. జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం మూడు గంటల పాటు వరుణుడు ప్రతాపం చూపించాడు. కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో గత పదేళ్లలో సెప్టెంబర్​లో ఎన్నడూ లేనంత అధిక వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి 12 గంటలకు అత్యధికంగా నగర శివారులోని నందనం వద్ద 16.7, మెహిదీపట్నంలో 11.25, నాంపల్లిలో 10.33 సెంటీమీటర్లు కురిసింది. గతంలో 2017 సెప్టెంబరు 6న 24 గంటల వ్యవధిలో 9 సెంటీమీటర్ల రికార్డు వర్షం పడింది. సోమవారం 3 గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో అధిక వర్షం పడటంతో కొత్త రికార్డు నమోదైంది.

కోఠిలోని ఈఎన్​టీ ఆస్పత్రిలో వర్షంతో రోగులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఆస్పత్రి పాత భవనంలోని ఐసీయూలో పెచ్చులు ఊడిపోవడంతో రోగులపై నీళ్లు పడ్డాయి. గోడలకు ఆనుకొని ఉన్న విద్యుత్ తీగల వెంట నీరు కారుతుండటంతో రోగులను కొత్త భవనానికి తరలించారు. ఉస్మాన్​గంజ్​లో రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో.. ఎవరూ బయటకు రాలేదు. బేగంబజార్​లోని పలు దుకాణాల్లోని సెల్లార్లలోకి వర్షం నీరు చేరి సామగ్రి నీట మునిగింది. ఆసిఫాబాద్, గుడి మల్కాపూర్, వివేకానంద నగర్, మలక్​పేట, ముషీరాబాద్ తదితర చోట్ల ఆవాసాలు జలమయమయ్యాయి. గుడిమల్కాపూర్​ పూల మార్కెట్, సంతల్లోని దుకాణాలు కొట్టుకుపోయాయి. సరూర్​నగర్​ చెరువు దిగువ ప్రాంతాలు.. కవాడిగూడ, అశోక్​నగర్, అంబర్​పేట, బేగంపేటలో నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. వర్షం ధాటికి విద్యుత్​ సరఫరా నిలిచిపోయి.. పలుచోట్ల అంధకారం అలుముకుంది. కాంగ్రెస్ సీనియర్​ నేత వి.హనుమంతురావు కాసేపు ట్రాఫిక్​ విధులు నిర్వర్తించి వాహనాలు క్రమబద్దీకరించారు.

గంటల తరబడి ట్రాఫిక్​ జామ్​..: ఎడతెరిపి లేకుండా కురవడంతో వాగులు, వంకలు, నాలాలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల రహదారులు చెరువులను తలపించాయి. ఉస్మాన్​గంజ్​ ప్రాంతంలో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్​జాం ఏర్పడింది. సహాయ చర్యల కోసం జీహెచ్ఎంసీ, డీఆర్​ఎఫ్​ బృందాలను రంగంలోకి దించారు.

పిడుగుపాటుకు ముగ్గురు బలి.. వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడిగుండాల పంచాయతీ బోటిగుంపునకు చెందిన రైతు కమటం శ్రీను పిడుగుపాటుతో మృతి చెందారు. తన భార్య శోభతో పొలానికి వెళ్లి ఇంటికి వస్తుండగా పిడుగుపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో పిడుగుపడి షేక్​ జాన్​బీ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టిన ఆమె.. ఇంటి ఆవరణలో పిడుగు పడటంతో మంచంలోనే మృతి చెందింది. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం వంగపహాడ్​లోని బావుల చెరువు సమీపంలో చెట్టు కింద నిలబడ్డ సిద్ధాపురానికి చెందిన ముసుకు నాగరాజు పిడుగు బారినపడి అక్కడికక్కడే కన్నుమూశారు.

నేడు, రేపు వర్షాలు..: మూడు రోజులుగా పొడి వాతావరణం ఏర్పడటం.. ఉరుములు, మెరుపులు అధికంగా రావడం వల్ల కొన్ని గంటల వ్యవధిలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.

ఇవీ చదవండి: తొక్కలో జాబ్.. సముద్రంలోకి వెళ్లిపోయాడు.. 23 ఏళ్లుగా అక్కడే!

అమ్మకు గోల్డ్​.. కూతురికి బ్రాంజ్​.. పనిమనిషి కుటుంబానికి పతకాల పంట

Last Updated :Sep 27, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.