ETV Bharat / state

ప్లాస్మా కొరత.. దానం చేయాలంటూ విస్తృత ప్రచారం

author img

By

Published : Jul 18, 2020, 9:17 PM IST

కరోనా అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఎదురు చూపులు తప్పడంలేదు. చికిత్సకు ప్రామాణిక విధానాలు లేకపోవడం వల్ల రోగులకు వివిధ రకరకాల మందులు వినియోగిస్తున్నారు. వీటితోపాటు ప్రత్యామ్నాయాలను ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటిలో ముందువరసలో నిలుస్తోంది ప్లాస్మా థెరపీ. అందుకే ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు ప్లాస్మా థెరపీను ఆశ్రయిస్తున్నాయి. కరోనాపై యుద్ధానికి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీ చేస్తున్నారు. ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ఆస్పత్రుల్లో ఈ విధానంలో చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. దానితో ఒక్కసారిగా ఈ థెరపీకి డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ప్లాస్మా కొరత కనిపిస్తోంది. ప్లాస్మా దానంపై అవగాహన లేక దాతలు ముందుకు రాకపోవడం.. మరికొందరు దీన్ని వ్యాపార కోణంలో చూస్తుండం వంటి వాటి వల్ల ప్లాస్మా కొరత కనిపిస్తోంది.

heavy-demand-for-plasma-therapy-in-india
ప్లాస్మా దానంపై విశేష ప్రచారం.. థెరపీకి సాయం చేయండంటూ విన్నపాలు

కరోనా చిక్కిత్సకు సరైన మందు లేదని ..వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రాదని ..ఆందోళన చెందుతున్న వారికి ప్లాస్మా చికిత్స ఆశాదీపంలా కనిపిస్తోంది. ప్రస్తుతం బాధితులకు వివిధ రకాల మందులను ఇచ్చి ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ .. మరో వైపు ప్లాస్మా థెరపీతోను ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా బారిన పడి కోలుకున్నవారిలో..పెద్ద సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇవి కరోనా సోకిన వ్యక్తి చికిత్సలో సహయపడతాయి. అందుకే ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు ప్లాస్మా థెరపీను ఆశ్రయిస్తున్నాయి. ఈవిధానంలో సత్ఫలితాలు లభిస్తుండటం వల్ల.. ఇటీవలి కాలంలో ప్లాస్మా థెరపీ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. అందుకే బాధితుల నుంచి డిమాండ్‌ ఎక్కువవుతోంది. డిమాండ్ ఎలా పెరుగుతోందో అదే స్థాయిలో కొరత కూడా కనిపిస్తోంది.

బలహీనతనూ సొమ్ము చేసుకుంటున్నారు!

ప్లాస్మా కొరతకు అనేక కారణాలున్నప్పటికీ .. ముఖ్యంగా దాతలు తగినంతగా లభించకపోవడం.. ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు పెద్దసంఖ్యలోనే ఉన్నా అవసరాలకు తగ్గట్లుగా ప్లాస్మా లభించడం లేదు. దీంతో దాతలు ముందుకు రావాలని కోరుతూ బాధితుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ వారిని బతికించుకోవడం కోసం దాతలకు ఎంతైనా చెల్లించడానికి బాధిత కుటుంబాలు ముందుకొస్తున్నాయి. ప్రాణదాతలుగా దాతృత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో.. బాధితుల బలహీనతను కూడా కొందరు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంవల్ల.. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. స్వల్ప మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్‌ ద్వారా చికిత్స అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పరిస్థితి విషమించినవారికి ఆసుపత్రిలో ఉంచి చికిత్స ఇవ్వాల్సి వస్తున్నందున ఇలాంటి వారికి ప్లాస్మాథెరపీని ప్రయోగాత్మక చికిత్సగా వైద్యులు అందిస్తున్నారు.

కొరతకు కారణం ఇదే

దేశవ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయినా ప్లాస్మా దాతలు పదుల సంఖ్యలోనే కనిపిస్తున్నారు. దీనికి రకరకాల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇందులో ప్రధానమైనవి..

మొత్తం కోలుకున్నవారిలో దాదాపు 50%మంది అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు, తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుంటారని అంచనా.

ప్రధానంగా 18-50 ఏళ్ల లోపు వారినుంచే ప్లాస్మాను సేకరిస్తారు. ఈ వయసు వారిలోనూ ఆరోగ్యవంతులు సుమారు 40 %మంది ఉంటారని ఒక విశ్లేషణ. వీరిలోనూ కరోనా యాంటీబాడీస్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందినవారి నుంచే ప్లాస్మాను తీసుకుంటారు. కొవిడ్‌ లక్షణాలు బయటకు కనిపించకుండా, కేవలం పరీక్షల్లో కరోనా అని నిర్ధారణ అయి, ఎటువంటి సమస్యలు లేకుండా తగ్గిపోయిన వారిలో ఇలా యాంటీబాడీస్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇలా లక్షణాలు లేనివారు కూడా దాదాపు 80% మంది ఉండటంవల్ల.. వీరిలో ఎందరిలో యాంటీబాడీస్‌ పూర్తిగా అభివృద్ధి చెందాయి? ఎందరిలో అభివృద్ధి చెందలేదనే స్పష్టత మాత్రం ఇప్పటివరకూ లేదు. వీరిలోనూ సుమారు 50% మందిలో ప్లాస్మా ఇవ్వడానికి అనుకూలత లేదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హీమోగ్లోబిన్‌ 12.5 % కంటే తక్కువగా ఉన్నా, 55 కిలోల బరువు కంటే తక్కువగా ఉన్నా కూడా ప్లాస్మా దానానికి అంగీకరించరు. ప్లాస్మా దానం చేసే సమయంలో ఎటువంటి వైరల్‌ వ్యాధుల బారిన పడి ఉండకూడదు. తెలంగాణ విషయానికి వస్తే సుమారు 5 వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా అతి స్వల్ప సంఖ్యలోనే ఇప్పటివరకు ప్లాస్మా దానానికి ముందుకు రావడం గమనార్హం.

కష్టకాలంలోనూ దళారుల దందా

ఇక దీన్ని కూడా వ్యాపార ధోరణిగా మార్చుకుంటున్నారు కొందరు. స్వతహాగా ప్లాస్మాను దానం చేద్దామని వచ్చిన వారికి కూడా ప్లాస్మాను అమ్ముకోవచ్చనే ఆలోచనలను దళారులు కలిపిస్తున్నట్టు తెలుస్తోంది . రక్తాదానం మాదిరిగానే ప్లాస్మాను ఇద్దామని వచ్చినవారికి డబ్బుల ఆశ చూపి ముందస్తుగానే వారి నుంచి ప్లాస్మాను స్వీకరిస్తున్నట్టు విమర్సలు వస్తున్నాయి. బాధితునికి అవసరమైన సందర్భంలో.. ముందే స్వీకరించిన ప్లాస్మాను మరింత ఎక్కువ ధరకు కొన్ని ఆసుపత్రి వర్గాలే విక్రయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో చాలామంది ప్లాస్మా దాతలకోసం సామాజిక మాధ్యమాల్లో వినతులు పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువయింది.


సాధారణ రక్తదానంపైనే ప్రజల్లో ఇప్పటికీ అపోహలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్లాస్మా అనేసరికి దీనివల్ల ఇంకా కొత్త సమస్యలేమైనా వస్తాయేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్మాదాతలు పెద్దఎత్తున ముందుకు వచ్చే విధంగా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసి, అర్హులైన వారందరిని అందులో చేర్చి, వారిని చైతన్యపర్చడం ద్వారా ప్లాస్మా కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

దాతల కోసం ఓ సంస్థ

ఈ నేపథ్యంలో ప్లాస్మాదానంపై అవగాహన కలిగించటంతో పాటు స్వయంగా దానం చేసేందుకు కొందరు మందుకు వస్తుండటం బాధితుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. తెలంగాణలో వరంగల్‌కు చెందిన న్యాయవాది ప్లాస్మా దానంపై ఎక్కువమందిని చేర్చడంలో భాగంగా ఒక గ్రూపు ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ నుంచి 50 మంది వరకు దాతలు ఉన్నారు. అలాగే తెలంగాణ ప్లాస్మా డోనర్స్‌ అసోసియేషన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసారు మరికొందరు. ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ సంస్థలో దాతలు తమపేరు నమోదు చేసుకోవచ్చు.

డొనేషన్ వెబ్​సైట్
ఇక దిల్లీకి చెందిన ఓ వ్యాపార వేత్త .. ధూండ్ అనే ప్లాస్మా డొనేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్లాస్మా కావాలసిన వారికి, ప్లాస్మా దానం చేసేవారి వివరాలు అందిస్తారు. అలాగే దిల్లీకి చెందిన ఓ విద్యార్ధిని ప్లాస్మా యాప్ రూపొందించింది. ప్లాస్మా బ్యాంక్‌ యాప్‌.. కొపాల్‌ 19 సాయంతో కరోనా బాధితులకు సరిపోయే ప్లాస్మా దాతను గుర్తించవచ్చు. రోగులకు, దాతలకు అనుసంధానంగా దీన్ని తీర్చిదిద్దాలనుకున్న యాప్ రూపకర్త..ప్లాస్మా దానంతో.. ఓ జీవితాన్ని కాపాడండి’ అనే క్యాప్షన్‌తో కొపాల్‌19 యాప్‌ను తయారు చేసింది.

తొలి ప్లాస్మా బ్యాంక్ కేరళలో

కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రాధాన్యత పెరుగుతుండటం వల్ల చాలా రాష్ట్రాలు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కోరుతున్నాయి. ఇందుకోసం దిల్లీలో అయితే ఏకంగా ప్లాస్మా బ్యాంకునే ఏర్పాటు చేసారు . ఇది దేశంలో తొలి ప్లాస్మా బ్యాంకు కావడం గమనార్హం .మొదటి ప్లాస్మా సెంటర్‌ విజయవంతం కావడంతో రెండో బ్యాంకును కూడా జులై 14న ప్రారంభించారు. కేరళలో తొలి ప్లాస్మా బ్యాంకును మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవలే ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకు ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 25మంది దాతలు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేసారు. మహారాష్ట్రలో అయితే "ప్రాజెక్ట్‌ ప్లాటినా" పేరుతో ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్లాస్మా థెరపీ పరీక్షలు , చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.