ETV Bharat / state

కనీసం 40 లక్షల రూపాయలుంటేనే హైదరాబాద్​లో ఫ్లాటు!

author img

By

Published : Aug 24, 2021, 6:48 AM IST

హైదరాబాద్‌లో ఫ్లాటు కొనాలంటే కనీసం 40 లక్షల రూపాయలు వెచ్చించాల్సిందేనని చెబుతోంది నెట్​ఫ్రాంక్ అధ్యయనం. వెయ్యి చదరపు అడుగుల ఇంటి కనీస ధర 40 లక్షలు ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఇటీవల జరిగిన అమ్మకాల్లో 88 శాతం రూ.అరకోటి పైన పలికినవే ఉన్నట్లు పేర్కొంది.

flat-in-hyderabad-for-at-least-40-lakh-rupees
కనీసం 40 లక్షల రూపాయలుంటేనే హైదరాబాద్​లో ఫ్లాటు!

శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగరంలో మధ్యతరగతికి సొంతింటి కల సుదూర స్వప్నంగానే మిగులుతోంది. కొనుగోలు సామర్థ్యం, ఇళ్ల ధరల మధ్య అంతరం ఏటేటా పెరుగుతూనే ఉంది. దూసుకెళుతున్న స్థిరాస్తి ధరలకు తోడు పెరిగిన పన్నులు, రిజిస్ట్రేషన్లు, మౌలికవసతుల అదనపు బాదుడు.. వెరసి మహానగరపాలిక పరిధిలో ఎటు వెళ్లినా రూ.40 లక్షలలోపు ఫ్లాట్‌ దొరికే పరిస్థితి కనిపించటం లేదు. హైదరాబాద్‌ చుట్టూ 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కనీసం రూ.అరకోటి పెడితే తప్ప 1000 చదరపు అడుగుల ఫ్లాట్‌ కొనలేని పరిస్థితి. నగరంలో అద్దెలకే 25-30 శాతం చెల్లిస్తున్న మధ్యతరగతి ఉద్యోగులు.. సొంతగూడు అమర్చుకుందామనుకున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో రూ.50 లక్షలలోపు ఖరీదైన ఇళ్లు.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే హైదరాబాద్‌లోనే తక్కువ శాతం అమ్ముడైనట్లు లండన్‌కు చెందిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ నైట్‌ఫ్రాంక్‌ తాజా సర్వేలో వెల్లడైంది.

దేశంలోని పేరొందిన ప్రముఖ నగరాల్లో తాజా స్థితిగతులను అది వెలుగులోకి తెచ్చింది. 2014, 2015లో రూ.25 లక్షలలోపు ఫ్లాట్ల నిర్మాణం చేసేవారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లోనూ అవి దాదాపు 40 శాతం వరకూ రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలలోపు ఉండేవి. ప్రస్తుతం 750, 800 చ.అ. ఫ్లాట్ల నిర్మాణాన్ని బిల్డర్లు ఆపేశారు. తాజా అధ్యయనంలో అసలు రూ.35-40 లక్షల మధ్య పలికే ఫ్లాట్ల జోలికి నిర్మాణ సంస్థలు వెళ్లడంలేదని స్పష్టమైంది. మూడేళ్ల క్రితం రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్‌బీనగర్‌, నాచారం, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో సగటున చదరపు అడుగు ధర రూ.3,000 ఉండేది. కూకట్‌పల్లి, మదీనాగూడ ప్రాంతాల్లో రూ.3,500 నుంచి రూ.4,000 పలికేది. ఇప్పుడీ ధరలు హైదరాబాద్‌ నుంచి 10, 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేవు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కలా భూముల ధరలు దాదాపు ఒకేలా ఉండటం ఇందుకో కారణమని ప్రముఖ డెవలపర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు.

ఆదర్శంగా సింగపూర్‌
సింగపూర్‌ ప్రజల్లో 80 శాతం మంది ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో ఉంటున్నారు. వీరిలో 93 శాతం మంది సొంతదారులు. ప్రపంచంలో అందుబాటులో ఇంటి సౌకర్యం(అఫర్డబుల్‌ హౌసింగ్‌) కలిగిన దేశంగా సింగపూర్‌కి గుర్తింపు ఉంది. అక్కడ ప్రభుత్వానికి చెందిన హౌసింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు వివిధ ఆదాయ వర్గాలకు తగినట్లుగా వేర్వేరు సైజుల్లో ఇళ్ల నిర్మాణం చేస్తుంది. మొదటి ఇల్లు కొనేవారికి వడ్డీ రాయితీ, ప్రభుత్వ సబ్సిడీలు వర్తింపజేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే 9 లక్షల ఫ్లాట్‌లను నిర్మించి దేశవాసులకు అందజేసింది.

చైనాలో సబ్సిడీ రేట్లతో ప్రభుత్వ భూమి
ఆర్థిక సౌలభ్య గృహనిర్మాణ కార్యక్రమం కింద చైనా ప్రభుత్వం నిర్మాణ సంస్థలకు సబ్సిడీ రేట్లతో భూమిని సమకూరుస్తోంది. అవి మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు ఇళ్లు నిర్మించి రాయితీ ధరలకు విక్రయిస్తాయి. నిర్మాణ వ్యయం, లాభాల పరిమితిని ప్రభుత్వం నిర్దేశిస్తుంది.

రెండేళ్లుగా నెరవేరని ప్రయత్నం...
ఒక సంస్థలో రూ.52 వేల జీతం తీసుకుంటున్న ఉద్యోగి శరత్‌. హైదరాబాద్‌కి చుట్టుపక్కల ఇల్లు కొనేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఉప్పల్‌కు 10 కిలోమీటర్ల దూరంలో వరంగల్‌ ప్రధాన రహదారికి 3కి.మీ. లోపల 1000 చ.అ. ఫ్లాట్‌ తీసుకుందామనుకున్నా దాని ధర రిజిస్ట్రేషన్‌ తదితరాలతో రూ.35+8=43 లక్షలు అవుతోంది. బ్యాంకు రుణం తీసుకుందామని ప్రయత్నిస్తే జీతంలో సగం కంటే ఎక్కువ వాయిదాలకే చెల్లించాల్సి రావటంతో కొనుగోలు ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

హైదరాబాద్‌లో నైట్‌ఫ్రాంక్‌ సంస్థ అధ్యయనం ప్రకారం(2021 మొదటి ఆరునెలల నివేదిక).. సింహభాగం ఫ్లాట్ల ధర రూ.50 లక్షల పైనే

  • హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్నవాటిలో దాదాపు సగం ఫ్లాట్ల కనీస ధర రూ.75 లక్షలుగా ఉంది.
  • ఈ ఏడాది నగరంలో మొదటి ఆరునెలల్లో కొత్తగా చేపట్టిన స్థిరాస్తి ప్రాజెక్టుల్లో 47 శాతం ఫ్లాట్లు రూ.75 లక్షల నుంచి రూ.కోటి పలికేవే
  • మొత్తం అమ్మకం జరిగిన వాటిలో 88 శాతం రూ.50 లక్షల కంటే ఎక్కువ ధరవే.
  • సగటున 1,200 నుంచి 1,400 చదరపు అడుగుల ఫ్లాట్ల నిర్మాణాలు అత్యధికంగా ఉంటున్నాయి.
  • రూ.30-35 లక్షల మధ్య నిర్మాణాలను ఏ స్థిరాస్తి సంస్థా చేపట్టడంలేదు.
  • హైదరాబాద్‌కు ఎటువైపు వెళ్లినా రూ.40 లక్షలలోపు 1000 చ.అ. ఫ్లాట్‌ అందుబాటులో లేదు.
  • కొంపల్లి, శంషాబాద్‌, ఘట్‌కేసర్‌, ఇస్నాపూర్‌ ప్రాంతాల్లోనూ 1000 చ.అ. ఫ్లాట్‌ సగటు ధర రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు ఉంటోంది. దీనికి వసతులు, జీఎస్టీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపంలో మరో రూ. ఏడు లక్షల నుంచి రూ.9 లక్షల వరకు భారం అదనంగా పడుతోంది.
  • ఫ్లాట్ల సగటు ధర చదరపు అడుగు రూ.4,720
  • 25-50 లక్షలలోపు ఫ్లాట్లకు డిమాండ్‌ గతం కంటే 240 శాతం ఎక్కువ
  • రూ.కోటి నుంచి 2 కోట్ల మధ్య పలికే ఫ్లాట్లు గత ఏడాదికంటే 18 శాతం పెరిగాయి

ప్రభుత్వాలు సహకరించాలి..

- గుమ్మి రామిరెడ్డి, క్రెడాయ్‌, జాతీయ ఉపాధ్యక్షుడు

భూముల ధరలతో పాటు నిర్మాణ వ్యయమూ భారీగా పెరుగుతుండటంతోనే ధరలు పెంచాల్సి వస్తోంది. ప్రభుత్వాలు సహకరిస్తే తప్ప కొనుగోలుదారులపై భారం తగ్గదు. జీఎస్టీకి సంబంధించి ఇన్‌పుట్‌ట్యాక్స్‌ క్రెడిట్‌ రావడంలేదు. దీంతో ఇది బిల్డర్లకు, కొనుగోలుదారులకు అదనపు భారమైంది. కొనుగోలుదారులకు ఉపయోగపడేలా ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలి. కర్ణాటక ప్రభుత్వం రూ.45 లక్షలలోపు పలికే ఫ్లాట్లు లేదా ఇళ్లపై స్టాంపు డ్యూటీని 5 నుంచి 3 శాతానికి తగ్గించింది.

హైదరాబాద్​లో ఇళ్ల అమ్మకాల తీరు
ఆరు నెలల్లో 50 లక్షల లోపు అమ్మిన ఇల్లు

ఇదీ చూడండి: ACCIDENT: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.