Husband Killed Wife in Hyderabad : క్షణికావేశం.. పది రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు
Published: May 21, 2023, 7:53 PM


Husband Killed Wife in Hyderabad : క్షణికావేశం.. పది రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు
Published: May 21, 2023, 7:53 PM
Husband Killed Wife in Hyderabad : జీవితాంతం తోడుంటానని, కంటికి రెప్పలా చూసుకుంటానని చేసిన ప్రమాణాలు మరిచి.. అనుమానంతో భార్యలను హతమారుస్తున్నారు భర్తలు. ఇందులో ఆర్ధిక సమస్యల వల్ల కొన్ని హత్యలు జరుగుతుంటే.. భార్య వివాహేతర సంబంధాలు, మద్యం మత్తు మరో కారణం. హైదరాబాద్లో ఈ ఘటనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. పది రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిలో ఉన్నత చదువులు చదివిన వారు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు ఉండటం గమనార్హం.
Husband Killed Wife in Hyderabad : హైదరాబాద్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. క్షణికావేశంలో భార్యలను హత్య చేస్తున్న భర్తల కేసులే ఎక్కువ ఉన్నాయి. ఈ నెల 12న వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని గౌతమినగర్లో దారుణం చోటుచేసుకొంది. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా రాజ్కుమార్ అనే కానిస్టేబుల్ హతమార్చాడు. తొలుత కత్తితో ఆమె గొంతుకోసి భవనం మొదటి అంతస్తుపైకి లాక్కెళ్లి కిందకు నెట్టేశాడు.
తీవ్ర రక్త స్రావంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. వివాహేతర సంబంధం దంపతుల మధ్య చిచ్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అర్ధాంగిపై పగ పెంచుకున్న రాజ్కుమార్ ఘటన ముందు రోజు రాత్రి భార్య ఫోన్ ధ్వంసం చేశాడు. మరుసటిరోజు మరోసారి గొడవపడి క్షణికావేశంలో హత్య చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడిని పక్కకు నెట్టగా.. బాలుడు చేతులకు గాయాలయ్యాయి.
మద్యం మత్తులో దారుణాలు : ఈనెల15న కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఫోరం మాల్ ఫ్లైఓవర్ కింద భార్య మున్నీ బేగంను.. భర్త సాదిక్ అలీ రాళ్లతో కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఆమెను చంపినట్లు పోలీసులు గుర్తించారు. కూలీ పనులు చేసుకుంటూ రాత్రుళ్లు ఫ్లైఓవర్ కింద నిద్రిస్తుంటారని తెలిపారు. రాత్రి మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో సాదిక్ ఈ హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ నెల 16న ఎస్సార్నగర్లో దంపతుల మృతి కలకలం రేపింది. ఎల్లారెడ్డిగూడలో మద్యం మత్తులో భార్యను ఇనుపరాడుతో కొట్టి చంపిన భర్త జనార్ధన్.. ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో భార్యను చంపినట్లు పోలీసుల ప్రాథమికదర్యాప్తులో తేలింది.
కరెంట్ షాక్ ఇచ్చి భార్యను చంపిన భర్త : ఈ నెల 16న రంగారెడ్డి జిల్లా కొందుర్గుకి చెందిన యాదయ్య.. తన భార్య కవితకు కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీశాడు. తర్వాత పోలీస్స్టేషస్కి వెళ్లి.. తన భార్య విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు పోలీసులకు తెలిపాడు. కానీ ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూసి అనుమానంతో మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. యాదయ్యను పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆతడిని పోలీసులు అరెస్ట్ చేశారు
భార్యను చంపి ఆపై భర్త ఆత్మహత్య : తాజాగా రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు భార్య సుధను కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. కోపంలో నాగరాజు.. కత్తితో భార్య సుధ గొంతుకోసి హతమార్చాడు. ఇది గమనించిన పెద్ద కుమారుడు దీక్షిత్.. తల్లిని చంపుతుండగా అడ్డురాగా ఆ బాలుడిని చంపేందుకు అతడు ప్రయత్నించాడు.
దీంతో భయపడ్డ ఆచిన్నారి తమ్ముడిని తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. భార్యను హత్య చేసిన అనంతరం విషం తాగి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. దీక్షిత్ సమాచారంతో నాగరాజు ఇంటికి వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యభర్తల మధ్య ఘర్షణకు దారితీస్తున్న కేసులపై కౌన్సిలింగ్ ఇస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉన్నవారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి : Doctor killed Wife in Shankarpally : భార్యను చంపి 'డాక్టర్ బాబు' ఆత్మహత్య.. పిల్లలనూ చంపేందుకు..
కశ్మీర్లో జీ20 సమావేశాలు.. భద్రత కట్టుదిట్టం.. దాల్ సరస్సులో మాక్డ్రిల్
