ETV Bharat / state

Private Medical Colleges Fee : ప్రైవేట్​ మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు..

author img

By

Published : Feb 12, 2022, 8:12 AM IST

Private Medical Colleges Fee : ప్రైవేట్​లో మెడిసిన్ అభ్యసించాలనుకునే వారికి మరింత భారమయ్యేలా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కొన్నింటిలో పలు కోర్సుల రుసుములు పెంచుతూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Private
Private

Private Medical Colleges Fee : ప్రైవేటులో వైద్యవిద్య మరింత భారం కానుంది. రాష్ట్రంలో 23 ప్రైవేటు వైద్యకళాశాలలుండగా.. ఏడింటిలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో యాజమాన్య(బి), ప్రవాస భారతీయ(సి) కేటగిరీల్లో రుసుములు పెంచుతూ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. పెంచిన రుసుములు 2021-22 వైద్యవిద్య సంవత్సరం నుంచే అమలవుతాయి. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్యకళాశాలల్లో బి, సి కేటగిరీల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన జారీచేయడంతో.. తదనుగుణంగా తాజాగా ఉత్తర్వులిచ్చినట్లు తెలిసింది.

నో క్యాపిటేషన్‌..

Fee Hike in Private Medical Colleges : అయితే కన్వీనర్‌ కోటాలో ప్రైవేటులో చేరిన వారికి రుసుము పెంచలేదు. ఇది ఇప్పటి వరకూ ఏడాదికి రూ.60 వేలు ఉండగా..యథాతథంగా కొనసాగించారు. యాజమాన్య కోటాకు ఏడాదికి రూ.11.55 లక్షలు, ప్రవాస భారతీయ కోటాకు ఏడాదికి 23.10 లక్షల వరకూ వసూలు చేస్తుండగా.. దీన్ని 7 కళాశాలలకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వైద్యకళాశాలలు తమ జమాఖర్చుల సమాచారాన్ని ఏఎఫ్‌ఆర్‌సీకి సమర్పించడంతో.. వాటి ప్రాతిపదికన ఈ కొన్నింటికి రుసుములు పెంచుతూ సిఫార్సు చేసినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. ప్రైవేటు వైద్య, దంత కళాశాలలు క్యాపిటేషన్‌ రుసుమును వసూలు చేయొద్దని వైద్యశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వేర్వేరు రూపాల్లో అదనపు వసూళ్లు చేయొద్దంది. ఈ ఏడాది నిర్ణయించిన రుసుములు ఈ సంవత్సరం విద్యార్థులకే వర్తిస్తుందని, వీరికి నాలుగున్నరేళ్లకేనిర్దేశించిన రుసుమును వసూలు చేయాలని స్పష్టీకరించింది. ఏటా యాజమాన్యాలు బ్యాంకు పూచీకత్తును తీసుకోవచ్చంది.

రుసుము పెరిగిన కళాశాలలివి..

  • Telangana Private Medical Colleges : కరీంనగర్‌ జిల్లాలోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాల, ఎల్‌బీనగర్‌లోని కామినేని అకాడమి, నార్కట్‌పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, మహబూబ్‌నగర్‌లోని ఎంఎన్‌ఆర్‌ వైద్యకళాశాలలో బి కేటగిరీ రుసుమును రూ.13 లక్షలకు పెంచారు.వీటిలో సీ కేటగిరీ కింద రూ.26 లక్షల వరకు చెల్లించాలి.
  • అపోలో, మల్లారెడ్డి, ఎస్వీఎస్‌ వైద్యకళాశాలల్లో బి కేటగిరి రుసుమును రూ.12.50లక్షలకు పెంచారు. వీటిలో సి కేటగిరీకి ఏడాదికి రూ.25లక్షలు చెల్లించాలి.
  • బీడీఎస్‌ బి కేటగిరీ సీటు రూ.4.20లక్షలుండగా.. ఈ ఫీజును ఎంఎన్‌ఆర్‌ దంత వైద్యకళాశాల, పనానియా మహావిద్యాలయ కళాశాలల్లో రూ.5లక్షలు చేశారు. ఈ ఫీజుకు 1.25 రెట్లు దాటకుండా సి కేటగిరీకి రుసుమును వసూలు చేసుకోవచ్చు.


ఇదీ చూడండి : Lands auction in telangana: సర్కార్‌ స్థలాలకు మళ్లీ వేలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.