ETV Bharat / state

సంకల్ప్‌సిద్ధి కుంభకోణం.. వెలుగులోకి కీలక విషయాలు..!

author img

By

Published : Nov 28, 2022, 12:12 PM IST

Sankalp siddhi Scam Case Updates
Sankalp siddhi Scam Case Updates

Sankalp siddhi Scam Case Updates : ఏపీలో వెలుగుచూసిన సంకల్ప్‌సిద్ధి కుంభకోణంలో కొత్త నిజాలు బయటకొస్తున్నాయి. సంస్థ నిర్వహిస్తున్న స్కీమ్​లను.. మరో మూడు నెలల్లో నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు.. సంకల్ప్‌సిద్ధి నిర్వాహకుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

సంకల్ప్‌సిద్ధి కుంభకోణం.. వెలుగులోకి వాస్తవాలు

Sankalpasiddhi Scam Case Updates : మరో మూడు నెలల్లో స్కీమ్​లన్నింటినీ నిలుపుదల చేసేందుకు సిద్ధమైనట్లు.. సంకల్ప్‌సిద్ధి సంస్థ నిర్వాహకుడు వేణుగోపాలకృష్ణ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే పలు రకాల స్కీమ్​లు అమలు చేస్తున్న ఆ సంస్థ.. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఏర్పాటు చేసిన సంకల్ప్‌సిద్ధి ఈ-కార్ట్ మాల్‌కు అనుసంధానం చేసింది. స్కీమ్​లో సభ్యులుగా చేరిన వారికి.. ఈ మాల్‌ నుంచి రూ.1,500 విలువ గల సరకులు ఇస్తోంది. విజయవాడ సంస్థ ద్వారానే.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. కర్ణాటకలోని బళ్లారిలో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గుత్తా కిరణ్‌ కొన్నాళ్లుగా బళ్లారిలో మకాం వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును.. ప్రకాశం జిల్లా కనిగిరి కేంద్రంగా నడుస్తున్న ఆగ్రో సంస్థల్లో వేణుగోపాలకృష్ణ పెట్టుబడిగా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కనిగిరిలో కొనుగోలు చేసిన 150 ఎకరాల్లో ఎర్ర చందనం, శ్రీగంధం మొక్కలు పెంచేలా.. ఆగ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. వీరి మధ్య 60:40 నిష్పత్తి ప్రకారం ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. కనిగిరికి వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు.. అక్కడి మార్కెట్ విలువ ప్రకారం.. భూమి విలువ రూ.కోట్లలో ఉంటుందని లెక్కగట్టారు. ఇంకో 50 ఎకరాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

సంకల్ప్‌లో చేరిన సభ్యులందరికీ కనిగిరిలో ఎర్రచందనం మొక్కలు చూపించి.. వారికి కొన్ని పత్రాలు రాసి ఇచ్చినట్లు సమాచారం. అయితే.. సంకల్ప్‌సిద్ధి సేకరించిన రూ.కోట్లకు లెక్కలు తేలడం లేదు. ఖాతాలు కూడా సరిగా లేవు. కొంతమందికి క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఆదాయం వచ్చినట్లు చెబుతుండగా.. దీనికి సొమ్ములు ఎక్కడి నుంచి చెల్లించారో వివరాల్లేవు. కనిగిరిలో కొనుగోలు చేసినట్లు చెబుతున్న భూమి మినహా.. ఇతర స్థిర, చరాస్తుల జాడ తెలియడం లేదు. అయితే.. పోలీసుల దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ మల్టీలెవల్‌ మార్కెటింగ్ సంస్థకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే సూత్రధారులని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మేలో ప్రారంభించిన సంకల్ప్‌సిద్ధి సంస్థ.. సుమారు రూ.250 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనధికార అంచనా ప్రకారం ఇది దాదాపుగా రూ.1,100 కోట్ల వరకు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫార్సులతో భారీగా డిపాజిట్లు సేకరించినట్లు స్పష్టమైంది.

ఇవీ చదవండి..:

ఇద్దరు నేతలకే ‘సంకల్ప్ ​సిద్ధి’.. రూ.1100 కోట్ల వసూళ్లలో వాళ్లదే కీలకపాత్ర

పోలీసుల కస్టడీలో నందకుమార్​.. ఆ కేసులపై విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.