'బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్లచూసి పార్టీని బతికించుకోవాలని కేసీఆర్‌ చూస్తున్నారు'

author img

By

Published : Nov 19, 2022, 4:21 PM IST

Updated : Nov 19, 2022, 4:36 PM IST

Etala Rajender and Vijayashanthi attacked TRS Party

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఇంటిపై జరిగిన దాడిని భాజపా నేతలు ఈటల రాజేందర్‌, విజయశాంతి ఖండించారు. కేసీఆర్​ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఈటల విమర్శించగా.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలిగానీ.. దాడులు ఏంటని విజయశాంతి ప్రశ్నించారు.

కేసీఆర్​ సర్కారు ప్రజల విశ్వాసం కోల్పోయిందని హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్​ నివాసానికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం అర్వింద్​ ఇంటిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏ ప్రభుత్వమూ ఇలాంటి నీచమైన పనులు చేయలేదని టీఆర్​ఎస్​పై మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్​పై సైతం ఇదే విధంగా దాడికి పాల్పడ్డారని ఈటల ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్​ ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ ​షాకు లేఖ రాస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని టీఆర్​ఎస్​ చూస్తోంది. సీఎం తన కుటుంబం కోసం మాత్రమే ఉన్నారు తప్పితే ప్రజల కోసం లేరని ఇప్పటికే టీఆర్​ఎస్​ కార్యకర్తలకు అర్థమైంది. బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్ల చూసి తన పార్టీని బతికించుకోవాలని కేసీఆర్​ చూస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలపైనే దాడులు చేస్తారా.. ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. దీనికి టీఆర్​ఎస్​ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది. పోలీసులు కేసీఆర్​కు బానిసలుగా పని చేస్తున్నారు. - ఈటల రాజేందర్​, బీజేపీ ఎమ్మెల్యే

కేసీఆర్​పై మండిపడ్డ విజయశాంతి: ధర్మపురి అర్వింద్​ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్​కు ఎలాగూ బుద్ధి వంకర.. కనీసం తన కూతురుకైనా దేవుడు మంచి బుద్ధి ఇచ్చి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత వీధి రౌడీలాగా మాట్లాడుతోందని మండిపడ్డారు. బంజారాహిల్స్​లోని అర్వింద్​ నివాసానికి వెళ్లిన విజయశాంతి.. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అర్వింద్‌ను అడిగి తెలుసుకున్నారు.

నువ్వు, నీ కుటుంబం ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి కేసీఆర్​. మీరు ఏ భాష వాడారో, బీజేపీ అదే భాషనే మాట్లాడుతుంది. ఇలాంటి దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా.. ఈ దాడులను ఎప్పటికీ సహించం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాలి కానీ దాడులు చేయడం ఏంటి? కొట్టి చంపుతామని మాట్లాడడం ఏంటి? - విజయశాంతి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు

ఎంపీ అర్వింద్​ ఇంటిపై దాడిని ఖండించిన ఈటల, విజయశాంతి

ఇవీ చదవండి:

Last Updated :Nov 19, 2022, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.