ETV Bharat / state

హోమియో వైద్యంలో శిఖర సమానుడు డాక్టర్​ పావులూరి కన్నుమూత

author img

By

Published : Jan 13, 2023, 9:42 AM IST

Dr Pavuluri Krishna Chowdary Passed Away: మొండి రోగాల రోగం కుదిర్చిన సుప్రసిద్ధ హోమియోపతి వైద్యులు పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూశారు. 95ఏళ్ల కృష్ణ చౌదరి వృద్ధాప్య సమస్యలతో కొద్దిరోజులుగా ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించి.. రాత్రి11 గంటల 20నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. పావులూరి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం అమీర్ పేటలోని స్వగృహంలో ఉంచనున్నారు. ఆమెరికా నుంచి కుమారుడు డాక్టర్ నరేంద్రనాథ్ వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామని.. కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గురించి కొన్ని విషయాలు..

పావులూరి కృష్ణ చౌదరి
పావులూరి కృష్ణ చౌదరి

Dr Pavuluri Krishna Chowdary Passed Away: తెలుగునాట హోమియో వైద్యంలో శిఖర సమానుడు.. దాన్ని ప్రతి ఇంటికీ చేర్చడంలో అవిరళ కృషి చేసిన డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి జీవితమంతా ఆ వైద్య విధానాల విస్తృతికి, అభివృద్ధికే వెచ్చించారు. శరీర-మనః-ఇంద్రియ-బుద్ధి స్థాయుల్లో వ్యాధి ఎక్కడి నుంచి.. ఏ క్రమంలో తప్పి, ప్రాణశక్తి అపమార్గం పట్టిందో గుర్తించి, దాన్ని తిరిగి సరైన దారిలోకి మళ్లిస్తే వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడనేది ఆయన తెలుసుకున్న విధానం.

ఇదే పద్ధతిలో వైద్యం చేస్తూ మొండివ్యాధులనూ దారికి తెచ్చిన ఘనాపాఠి ఆయన. ఎంబీబీఎస్‌ చదివిన పావులూరికి స్వానుభవంలో జరిగిన ఓ సంఘటన ఆయనను హోమియోపతి వైపు మళ్లించింది. ఖరీదైన, సంక్లిష్టమైన రసాయనాలతో కూడిన ఇంగ్లిషు మందుల కంటే.. సహజసిద్ధమైన ఔషధాలు అందించే హోమియోనే మేలని నిర్ధారణకు వచ్చారు. ఆ సంకల్పంతోనే లండన్‌ వెళ్లి హోమియో వైద్యంలో పట్టభద్రుడయ్యారు.

స్వదేశానికి తిరిగివచ్చి పూర్తిగా ఆ వైద్యసేవలకే అంకితమయ్యారు. హోమియో వైద్యంలో ఛాంపియన్‌గా కొనసాగారు. దాదాపు అర్ధ శతాబ్దం కిందట హోమియో గురించి జనబాహుళ్యంలో అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఆ చికిత్స విధానాలను అందరి చెంతకూ తీసుకెళ్లేందుకు నడుం కట్టారు.

స్వీయానుభవం మలుపు తిప్పింది: డాక్టర్‌ పావులూరి మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాలలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలతో డిగ్రీ చదివారు. తర్వాత విశాఖపట్నం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తన స్నేహితుడి తండ్రి ఎంబీబీఎస్‌ చదివి.. గుంటూరు జిల్లా వైద్యాధికారిగా పనిచేస్తూ.. హోమియోపతి వైద్యం చేస్తుండడాన్ని చూసిన పావులూరికి ఆ విషయంపై ఆసక్తి పెరిగింది. తన ‘ఇస్నోఫీలియా’ సమస్యకు ఆయన వద్ద చికిత్స పొంది ఉపశమనం పొందడంతో పావులూరికి హోమియో వైద్యంపై గురి కుదిరింది.

హోమియో వైద్యుడిగా విశేష ఖ్యాతి: క్రమేణా ఆసక్తి పెరిగి హోమియోపతి వైద్యవిద్య అభ్యసించేవరకు వెళ్లింది. ఎంబీబీఎస్‌ అనంతరం లండన్‌లో ‘మెంబర్‌ ఆఫ్‌ ఫ్యాకల్టీ ఇన్‌ హోమియోపతి (ఎమ్‌ఎఫ్‌.హోమ్‌)’లో చేరారు. ప్రఖ్యాత హోమియో వైద్యులు డాక్టర్‌ మార్గరీ బ్లాకీ, ఫూబిష్టర్‌, ఎలిజెబెత్‌ రైట్‌ హబ్బర్డ్‌ల వద్ద శిక్షణ తీసుకుని ప్రావీణ్యం గడించారు. మాస్టర్‌ ఆఫ్‌ హోమియో పట్టా పొందారు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చి హోమియో వైద్యుడిగా విశేష ఖ్యాతి పొందారు.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాల ప్రధానాచార్యుడిగా సేవలందించారు. వైద్యుడిగా, బోధకుడిగా ఆయనకు అయిదు దశాబ్దాల పైచిలుకు అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హోమియోపతి, డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ, కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌కు సభ్యుడిగా సేవలు అందించారు.

హోమియోలో లండన్‌ కోర్సు ఇక్కడే: పాతికేళ్ల కిందట పావులూరి చూపిన బాట ఎందరో వైద్యులకు ఆదర్శప్రాయమైంది. తనలాగే ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులు హోమియో పట్టా పొందడానికి వీలుగా.. 1994లో మొదటిసారిగా ఎమ్‌.ఎఫ్‌.హోమ్‌ కోర్సును ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత పావులూరిదే. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కోర్సుకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది. లండన్‌ వైద్యులు ఇక్కడికి వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి సుమారు 45 మంది ఎంబీబీఎస్‌ వైద్యులు హోమియోలో పట్టా పొందారు. దేశవ్యాప్తంగా ఆయన శిష్య పరంపర కొనసాగుతోంది. ‘జీయర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (జిమ్స్‌) స్థాపనలో పావులూరి కీలకపాత్ర పోషించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే హోమియో ఆసుపత్రి, వైద్య కళాశాలను కూడా ప్రారంభించి, అనతికాలంలోనే ఈ రెండు సంస్థలు దేశ విదేశాల్లో ఖ్యాతిని గడించే స్థాయికి తీసుకెళ్లడంలో పావులూరి ఎనలేని కృషి చేశారు. దివంగత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి వ్యక్తిగత వైద్యుడిగా కూడా వ్యవహరించారు.

అనుభవసారానికి అక్షర రూపం: ‘ఈనాడు’ దినపత్రికతో డాక్టర్‌ పావులూరికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఆయనకు ఆప్తమిత్రులు. పల్లెల్లో వైద్యసేవలు పూర్తిగా అందుబాటులో లేని సమయంలో మారుమూల ప్రాంతాలకు హోమియో వైద్యాన్ని తీసుకెళ్లాలన్న ఆయన ఆలోచనలకు రామోజీరావు ‘ఈనాడు’ పత్రికను వేదికగా అందించారు. ఎంతోకాలం ప్రాక్టీసు చేసి, గడించిన లోతైన తన అనుభవాల సారాన్ని పావులూరి వ్యాసాల రూపంలో సామాన్యులకు చేరువ చేశారు.

ఇంటింటా హోమియో వైద్యం’ గ్రంథం: జబ్బులు, మందులను పరిచయం చేస్తూ.. ఏ వ్యాధికి దేన్ని వాడవచ్చో వివరిస్తూ.. సాగిన ఆ రచనలు తెలుగు నాట విశేష ప్రాచుర్యం పొందాయి. అలా 1980ల్లో మొదలైన వ్యాసాల ధారావాహిక ప్రతి ఆదివారం దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు కొనసాగింది. వాటి సంకలనంగా వెలువడిందే ‘ఇంటింటా హోమియో వైద్యం’ గ్రంథం. అది ఎన్నో కుటుంబాలకు కరదీపికగా మారి.. తెలుగునాట హోమియో వైద్య వికాసానికి కారణమైంది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏయే రాష్ట్రాల్లో హోమియో వైద్యం అధిక ప్రాచుర్యంలో ఉందో తెలుసుకోవడానికి ఒక సర్వే నిర్వహించగా.. అందులో తెలుగు రాష్ట్రాలు రెండూ అగ్రస్థానంలో నిలవడం డాక్టర్‌ పావులూరి చేసిన కృషికి నిదర్శనం.

రోగి లక్షణాలే కీలకం: సహజ ఔషధాల వాడకంతో రోగులకు ఎంతో మేలు చేకూరుతుందని బలంగా విశ్వసించేవారు పావులూరి. రోగ లక్షణాలతో పాటు రోగి స్థితిగతులను కూడా గమనించి వైద్యం అందించాలనేది ఆయన ప్రధాన సూత్రం. కేవలం శారీరకంగా బయటకు కనిపించే లక్షణాలు మాత్రమే కాకుండా.. మానసిక సమస్యలు, వంశపారంపర్య జబ్బులు, ఆహార, విహారపు అలవాట్లు, అనుభూతులు, ఇష్టాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. కూలంకషంగా క్రోడీకరించి మందులను సూచించడం ఆయన వైద్యం ప్రత్యేకత.

ఇదీ కుటుంబ నేపథ్యం: డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి (96)

జననం: 30 జూన్‌ 1926

స్వస్థలం: గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ గ్రామం.

భార్య: సుందర రాజేశ్వరి.. 2010లో కన్నుమూశారు.

ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె: పెద్ద కుమారుడు మానవేంద్రనాథ్‌ 1980లో 18 ఏళ్ల ప్రాయంలోనే మృతిచెందారు. చిన్న కుమారుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌ (పిల్లల వైద్య నిపుణులు), కోడలు డాక్టర్‌ నాగమణి (మానసిక వైద్యనిపుణులు). మనవళ్లు.. రోహన్‌ (వ్యాపారం), చేతన్‌ (ఎంబీబీఎస్‌).. వీరంతా అమెరికాలో స్థిరపడ్డారు.

కుమార్తె: కొడాలి సుమతి (గృహిణి), అల్లుడు కొడాలి గంగాధరరావు. వీరి పిల్లలు అరుణ్‌కుమార్‌, డాక్టర్‌ అపర్ణ. అపర్ణ కూడా ఎంబీబీఎస్‌ పూర్తి చేసి హోమియోపతిలో పట్టా పుచ్చుకున్నారు. డాక్టర్‌ పావులూరి హోమియో వైద్య వారసత్వాన్ని ఇక్కడే హైదరాబాద్‌లో కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి:

సంక్రాంతికి ఊరికెళ్లేదెలా?.. కిక్కిరిసిపోతున్న రైల్వే, బస్‌ స్టేషన్లు

టేకాఫ్​కు సిద్ధమైన విమానానికి బాంబు బెదిరింపు.. ఫేక్ కాల్​గా గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.