ETV Bharat / state

EWS GUIDLINES: ఈ సారైనా ఈడబ్ల్యూఎస్‌ అమలయ్యేనా?

author img

By

Published : Aug 24, 2021, 9:21 AM IST

education-department-do-not-issued-on-ews-quota-guidlines
ఈ సారైనా ఈడబ్ల్యూఎస్‌ అమలయ్యేనా?

ఈసారి ఈసెట్‌ రాసిన 23వేల మందిలో దాదాపు 2వేల మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటా వర్తిస్తుందని దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజే కౌన్సిలింగ్ ప్రారంభమైనప్పటికీ... ఈడబ్ల్యూఎస్‌ మార్గదర్శకాలపై విద్యాశాఖ నుంచి జీవో రాకపోవడంతో అభ్యర్థులంతా అయోమయంలో పడ్డారు. ఈసారి కూడా ఈడబ్ల్యూఎస్‌ అమలయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని ఉన్నత విద్య సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటా ఈ విద్యా సంవత్సరమైనా అమలయ్యేనా?.. అధికారులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. మరోవంక.. మార్గదర్శకాలపై విద్యాశాఖ నుంచి జీవో రాకపోవడంతో ప్రవేశాల కమిటీ అధికారులు తాము సైతం దాని కోసమే ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. ఈసారి ఈసెట్‌ రాసిన 23వేల మందిలో దాదాపు 2వేల మంది తమకు ఈడబ్ల్యూఎస్‌ కోటా వర్తిస్తుందని దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు.

జనవరిలోనే నిర్ణయం తీసుకున్నా...

గత విద్యా సంవత్సరం(2020-21) కోటా అమలుకు వేలాది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూసినా ఆశ ఫలించలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కోటాను అమలుచేయాలి. అందుకే అధికారులు 2020 జూన్‌లోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దస్త్రాన్ని పంపించారు. దానిపై నిర్ణయం తీసుకోకపోవడంతో గతేడాది అమలు జరగలేదు. అనంతరం ఉన్నత విద్య సీట్ల భర్తీలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత జనవరి 21న ప్రకటించారు. ఆ మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఫిబ్రవరి 8న జీవో 33 జారీ చేసింది. అయితే కోటాను అమలు చేయాలంటూ విద్యాశాఖ మరో జీవో ఇస్తేనే సీట్ల భర్తీ సాధ్యమవుతుంది. అంటే 10 శాతం సీట్లను ఎలా భర్తీ చేయాలో అది మార్గదర్శకాలు జారీచేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి రెండు ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి, విద్యాశాఖకు అందజేసింది. దానిపై విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకొని తదనుగుణంగా జీవో ఇవ్వాలి.

జీవో వస్తేనే అమలుచేస్తాం...

తాము కూడా జీవో కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.‘జీవో రాకుండా ఈసెట్‌లో 10 శాతం కోటా అమలు చేయలేం’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ రెండో కౌన్సెలింగ్‌ నాటికి జీవో వస్తే అప్పటి నుంచి అమలుచేస్తామని మరో అధికారి చెబుతున్నారు. కోటా అమలుచేస్తామని దరఖాస్తు ఫారాల్లో ప్రకటించి ఇప్పుడు అమలుచేయకుంటే అభ్యర్థుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందోనన్న ఆందోళనలో ప్రవేశాల అధికారులు ఉన్నారు.

ఈసెట్‌కు లేనట్లేనా?

పాలిటెక్నిక్‌, బీఎస్‌సీ గణితం పూర్తయిన విద్యార్థులు ఈసెట్‌ ర్యాంకు ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందుతారు. ఈనెల 18న ఈసెట్‌ ర్యాంకులు వెలువడగా..వారికి మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. అయినా విద్యాశాఖ నుంచి జీవో వెలువడలేదు. ఈనెల 24, 25న ధ్రువపత్రాల పరిశీలనకు ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ ఉంటుంది. 26 నుంచి ధ్రువపత్రాల పరిశీలన మొదలవుతుంది. అంటే 26వ తేదీకి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో సీటు పొందేందుకు తాము అర్హులమని అభ్యర్థులు ధ్రువపత్రాలను సమర్పిస్తేనే వారికది వర్తిస్తుంది. ఈసెట్‌లో ఆ కోటా వర్తిస్తుందని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవంక ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సైతం వచ్చే 30వ తేదీ నుంచి మొదలు కానుంది. అందులోనూ దాదాపు 20వేల మంది అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్‌ కోటా పరిధికి రానున్నారు.. విద్యాశాఖ నుంచి సత్వరం జీవో వస్తేనే ఈ ఏడాదైనా వివిధ ‘సెట్‌’లు రాసిన వేలాది విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి: కనీసం 40 లక్షల రూపాయలుంటేనే హైదరాబాద్​లో ఫ్లాటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.