ETV Bharat / state

తెలంగాణలో పర్యావరణ పర్యాటకం

author img

By

Published : Dec 30, 2020, 7:17 AM IST

తెలంగాణలో పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంటోంది. పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంసిద్ధమవుతోంది. విద్యుత్‌ బస్సులు, సోలార్‌ బోట్లు ఏర్పాటు చేయనుంది. కొండపోచమ్మ రిజర్వాయర్‌, వడ్డేపల్లిలో స్పీడ్‌ బోటింగ్ అందుబాటులోకి రానుంది. యాదాద్రి వద్ద 90 ఎకరాల్లో భారీ పర్యాటక ప్రాజెక్టు చేపట్టింది.

తెలంగాణలో పర్యావరణ పర్యాటకం
తెలంగాణలో పర్యావరణ పర్యాటకం

కరోనా దెబ్బకు కుదేలైన పర్యాటక రంగంలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. చేరువలోని ప్రాంతాలు, అంతర్రాష్ట్రాల మధ్య సందడి మొదలవుతోంది. పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త ఆకర్షణలతో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌తో పాటు ఇటు జిల్లాల్లోనూ ఏర్పాట్లపై దృష్టి సారించింది. పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యమిస్తూ విద్యుత్‌ బస్సులు, సౌరవిద్యుత్తుతో నడిచే బోట్లను అందుబాటులోకి తేబోతుంది. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న యాదాద్రి ఆలయ సమీపంలో 90 ఎకరాల విస్తీర్ణంలో భారీ పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.

12 సోలార్‌ బోట్లు

హుస్సేన్‌సాగర్‌, దుర్గంచెరువుతో పాటు సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌, వరంగల్‌లోని వడ్డేపల్లి చెరువులో బోటింగ్‌ కోసం మొత్తం 12 సోలార్‌ బోట్లు అందుబాటులో రానున్నాయి. ఇందులో 150 సీట్లతో ఒక క్రూజ్‌.. 80 సీట్లతో రెండు ఫ్లోటింగ్‌ రెస్టారెంట్లు, 25 సీట్లతో మరో బోట్‌, నాలుగేసి స్పీడ్‌, పెడల్‌బోట్లు రానున్నాయి. ఇవన్నీ సౌరవిద్యుత్తుతో నడిచేవని, టెండర్ల ప్రక్రియ మొదలైందని పర్యాటకశాఖ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులు

హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు చారిత్రక, పర్యాటక ప్రదేశాలు సందర్శించేందుకు వీలుగా రెండు విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేయాలని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్‌ నుంచి షిర్డీ, తిరుపతికి యాత్రల కోసం నాలుగు స్లీపర్‌ బస్సులు ప్రవేశపెట్టేందుకూ సిద్ధం అవుతోంది.

యాదాద్రి చెంత ఆధ్యాత్మిక పర్యాటకం

యాదాద్రి ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఆధ్మాత్మిక పర్యాటకానికి అనువుగానూ తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. దగ్గరలో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కూడా ఉండటంతో.. దీనికి చేరువలో 90 ఎకరాల భూమిని పర్యాటకాభివృద్ధికి కేటాయించారు. ఇక్కడ అందుబాటు ధరల్లో వసతికి హోటల్‌ నిర్మాణం, రిసార్ట్‌, జలక్రీడల అభివృద్ధికి పర్యాటకశాఖ కసరత్తు చేస్తోంది. మంచిర్యాల, ఖమ్మంలో రెండు కొత్త హోటళ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రామోజీ ఫిలిం సిటీకి బస్సు

- ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌

హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి చారిత్రక, పర్యాటక ప్రదేశాలతో పాటు రామోజీ ఫిలింసిటీని సందర్శించేందుకు ఎక్కువ మక్కువ చూపుతుంటారు. ఈ నేపథ్యంలో రెండు ఎలక్ట్రిక్‌ బస్సులు కొనుగోలు చేయబోతున్నాం. ప్రత్యేక ప్యాకేజీ రూపొందించి ఒక బస్సును నిత్యం ఫిలింసిటీకి నడుపుతాం. మరొకటి నగరంలో పర్యాటక ప్రదేశాలు చూపించేందుకు వినియోగిస్తాం. భువనగిరి కోటను రూ.77 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం. రూ.20కోట్ల అంచనా వ్యయంతో రోప్‌వే ఏర్పాటుచేయబోతున్నాం. ఇది 8 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. యాదాద్రిలో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక ప్రాజెక్టు చేపడతాం.తెలంగాణను పర్యాటక హబ్‌గా మారుస్తాం.

- ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.