మిత్రమా రూ.5వేలతో మూడు గంటల్లో రూ.లక్ష వస్తాయ్.. కావాలంటే..

author img

By

Published : Nov 21, 2022, 10:04 AM IST

Cyber frauds in Telangana

Cyber frauds in Telangana : సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటూ నేరాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఓ మహిళ ఇన్​స్టాగ్రామ్​ ఖాతాను హ్యాక్​ చేసి.. పెట్టుబడులు పెట్టాలని ఆమె ఫాలోవర్లకు సంక్షిప్త సందేశం పెట్టారు. నకిలీ స్క్రీన్​షాట్లతో ఆశచూపి ఓ వ్యక్తి నుంచి రూ.30 లక్షలు దోచుకున్నారు.

Cyber frauds in Telangana : 'మిత్రమా నా దగ్గరున్న డబ్బుతో ఒక అద్భుతం జరిగింది. బిట్​ కాయిన్​లో రూ.5 వేలు పెట్టుబడి పెడితే మూడు గంటల్లోనే రూ.లక్ష అయ్యింది. కావాలంటే కింద ఉన్న స్క్రీన్​షాట్లు చూడండి. ఈ లింకు తెరిచి పెట్టుబడి పెట్టండి' అని మీకు తెలిసిన వారి నుంచి సందేశం వస్తే.. ఏంటని అడగకుండా లింకు తెరిచి పెట్టుబడి పెడితే అంతే సంగతులు. ఎందుకంటే మోసం చేయడంలో సైబర్​ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్న ఇన్​స్టాగ్రామ్​ ఖాతా హ్యాక్​కు గురైతే పోతే పోయింది.. కొత్తది ప్రారంభించవచ్చని తేలిగ్గా వదిలేశారో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోంది.

హ్యాక్​కు గురయ్యే ఖాతాల్లో ఎక్కువగా మహిళలు, యువతులకు సంబంధించినవే ఉంటున్నాయి. సైబర్​ నేరగాళ్లు వ్యూహాత్మకంగానే మహిళల ఖాతాలను ఎంచుకుంటున్నారు. యువతులు, మహిళలు రీల్స్​ ఎక్కువగా పోస్టు చేస్తుంటారు. వీరి ఖాతాను అనుసరించే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వారి ఖాతాలను తేలిగ్గా హ్యాక్​ చేస్తున్నారు. వాళ్ల ఫొటోలు, వీడియోలు సేకరించడంతోనే ఆగడం లేదు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ వారి ఖాతా నుంచి ఫాలోవర్లకు నకిలీ లింకులు పంపిస్తున్నారు. పెట్టుబడులు పెట్టాలంటూ, క్రిప్టో కరెన్సీలో మదుపు చేస్తే లాభాలంటూ స్నేహితులకు సందేశం పంపిస్తారు.

మోసపోయాక గుర్తిస్తున్నారు..: నమ్మించేందుకు లాభాలు వచ్చినట్లు కొన్ని ఫొటోలు చూపిస్తారు. కొందరు ఆ సందేశాలు చూసి లింకు ద్వారా రూ.లక్షల్లో నగదు పెడుతున్నారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించే నిందితుడు.. భారీగా సొమ్ము పెట్టాక డబ్బు తిరిగి తీసుకునేందుకు వీలు లేకుండా చేస్తాడు. ఖాతా నిర్వహించే అసలు వ్యక్తికి ఫోన్​ చేసినప్పుడు మోసపోయామని బాధితులు గుర్తిస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఇలా రూ.30 లక్షలు మోసపోయారు. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు నమ్మొద్దని సైబర్​ నిపుణలు చెబుతున్నారు.

అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య తగ్గట్లేదు..: గత కొన్ని నెలలుగా ఇన్స్​స్టాగ్రామ్​ ఖాతా హ్యాక్​ చేస్తున్న కేసులు హైదరాబాద్​లో గణనీయంగా పెరుగుతున్నట్లు సైబర్​ క్రైమ్​ నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు పోలీసులు ఎంత అవగాహన కల్పించినా మోసాల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి..

ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో కిలేడి వలపు వల.. ఆ తర్వాత నగ్న వీడియోలతో బెదిరిస్తూ..

సైబర్​ క్రైమ్​లో డబ్బు పోగొట్టుకున్నారా, అవి తిరిగి పొందొచ్చు తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.