ETV Bharat / state

పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అనుమతుల్లో అలసత్వం

author img

By

Published : Feb 6, 2023, 10:23 AM IST

Machilipatnam Municipal Corporation: ప్రజా ప్రయోజనాల కంటే అధికార పార్టీకి మేలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్​లోని మచిలీపట్నం నగరపాలక సంస్థ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ జిల్లా కార్యాలయ స్థలానికి, నిర్మాణానికి వెనువెంటనే చర్యలు తీసుకున్న అధికారులు.. ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ విషయంలో ఆలసత్వం చూపడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

construction of Pattabhi Sitaramaiah memorial building
ఏపీలో పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి పాలక సంస్థ అనుమతుల్లో జాప్యం

Machilipatnam Municipal Corporation: ఆంధ్రప్రదేశ్​లోని మచిలీపట్నం నడిబొడ్డున దాదాపు రూ.50కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ జిల్లా కార్యాలయానికి నగరపాలక సంస్థ అప్పగించింది. నిర్మాణానికి సైతం వెనువెంటనే అనుమతులు ఇచ్చేసింది. మరోవైపు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్​ బోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ విషయంలో మాత్రం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీలో పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి పాలక సంస్థ అనుమతుల్లో జాప్యం

ఆంధ్రబ్యాంకు, యూనియన్‌ బ్యాంక్​లో విలీనం కావడంతో.. పట్టాభి సీతారామయ్య పేరిట 40 కోట్లతో మ్యూజియం, ఆడిటోరియం, నైపుణ్య శిక్షణా కేంద్రంతో పాటు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ముందుకు వచ్చింది. స్థానిక ఎంపీ బాల శౌరి ఈడేపల్లిలోని పోలీసు శాఖకు చెందిన స్థలంలో 2 ఎకరాలు యూనియన్ బ్యాంకుకు అప్పగించేలా చొరవ చూపారు. దాదాపు 7నెలలుగా పట్టాభి స్మారక భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా నగరపాలక సంస్థ పాలకవర్గం ఆలసత్వం చూపుతోంది.

ఎంపీ బాలశౌరి నగర కమీషనర్‌ను స్మారక భవనం అనుమతులపై గట్టిగా నిలదీయగా.. 10రోజుల్లో ఏజెండాలో పెడతామని వివరణ ఇచ్చారు. అనంతరం 15 రోజులు సెలవులు పెట్టి కమీషనర్‌ వెళ్లిపోయారు. మరోవైపు వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు. దేశ సేవలో పాలుపంచుకున్న పట్టాభి సీతారామయ్యకి ఇచ్చే విలువ ఇదేనా అని విపక్షాలు, పౌర సంఘాలు, రాష్ట్ర బ్రహ్మణ నాయకులు మండిపడుతున్నారు.

ఇప్పటికైనా నగరపాలకసంస్థ పాలకవర్గం, అధికారులు వెంటనే స్పందించి పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

"ఆంధ్రబ్యాంక్​ స్థాపకులు పట్టాభి సీతారామయ్య పేరు మీద 2 ఎకరాలు కేటాయించారు. అదే ప్రదేశంలో ఆంధ్రబ్యాంక్​ యూనియన్​ బ్యాంక్​లో విలీనం అయినందున.. యూనియన్​ బ్యాంక్ రూ.5కోట్లు ఖర్చు పెట్టి సీతారామయ్య మెమోరియల్​ ట్రస్ట్ నిర్మించడానికి నిర్ణయించింది. దీని కోసం అనుమతుల కోసం గత కొన్ని నెలలుగా నగరపాలక సంస్థ నిలిపివేస్తుంది. వైసీపీకి సంబంధించిన కార్యాలయ నిర్మాణానికి మాత్రం అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించారు. ఈ వివక్షత చూపడం చాలా బాధాకరం." -నాగరామ్, తెదేపా కార్పోరేటర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.