ETV Bharat / state

రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు.. జరభద్రం

author img

By

Published : Jan 28, 2022, 4:05 AM IST

రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు.. జరభద్రం
రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు.. జరభద్రం

Covid Cases in Telangana: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య మార్పు కనిపిస్తున్నా పాజిటివిటీ రేటు మాత్రం పైపైకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 1వ తేదీ నాటికి ఒకశాతం దాటని పాజిటివిటీ రేటు క్రమంగా 4 శాతానికి మించటం గమనార్హం. ఇక జీహెచ్ఎంసీ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న కేసుల్లో ఈ మూడు ప్రాంతాల్లోనే 50శాతానికి పైగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ తాజా పరిస్థితులను ఓ సారి చూద్దాం.

Covid Cases in Telangana: రాష్ట్రవ్యాప్తంగా నిత్యం మూడు నుంచి నాలుగు వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఫీవర్ సర్వే ద్వారా లక్షణాలున్న లక్షల మందికి సర్కారు ఎక్కడికక్కడ కొవిడ్ హోం ఐసోలేషన్ మందుల కిట్లను పంపిణీ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా... కరోనా పాజిటివిటీ రేటు మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. జనవరి 1వ తేదీన రాష్ట్రంలో 1.09 శాతం ఉన్న పాజిటివిటీ రేటు నేటికి ఏకంగా 4.27 శాతానికి పెరిగింది. మరీ ముఖ్యంగా సంక్రాంతి తర్వాత పాజిటివిటీ రేటులో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఈ నెల 10వ తేదీ వరకు 2.5 శాతాన్ని మించని పాజిటివిటీ రేటు 17వ తేదీ నాటికి ఏకంగా 3.05 శాతానికి పెరిగింది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను సైతం ప్రభుత్వం భారీగా పెంచింది.

పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. జరభద్రం

జనవరి మొదటి రెండు వారాల్లో 60వేలు దాటని నిర్ధారణ పరీక్షలను సంక్రాంతి తర్వాత లక్షకు పైగా పెంచింది. ఇక ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు వరుసగా నాలుగు వేలకు పైగా నమోదైన కేసులు 23,24 తేదీల్లో మాత్రం 3నుంచి 4వేల మధ్యలోనే నమోదయ్యాయి. ఇక ఈ నెల 25న అత్యధికంగా 8 నెలల గరిష్ఠానికి కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 4559 మంది మహమ్మారి బారినపడినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక పాజిటివిటీ రేటు కూడా గత రెండు రోజులుగా నాలుగు శాతానికి పైగా ఉండటం గమనార్హం. బుధవారం రాష్ట్రంలో 3801 కరోనా కేసులు నమోదైనప్పటికీ పాజిటివిటీ రేటు మాత్రం అత్యధికంగా 4.27 శాతంగా నమోదైంది. అంటే కేసులు తక్కువగానే ఉన్నా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో గతంతో పోలిస్తే ఎక్కువ మందే కొవిడ్ బారిన పడుతున్నట్టు తేలటం ఆందోళన కలిగిస్తున్న విషయం.

జీహెచ్​ఎంసీలోనే అత్యధికం

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక శాతం జీహెచ్​ఎంసీ, దాని పరిసర జిల్లాల్లోవే కావటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం తెలంగాణలో వస్తున్న పాజిటివ్ కేసుల్లో 55 శాతానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనివే అని వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండటం గమనార్హం. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3801 మందికి కరోనా సోకగా.. అందులో 1570 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే కాగా.. మేడ్చల్ 254, రంగారెడ్డిలో 284 మంది ఉన్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 55.45 శాతం మందిమూడు జిల్లాల పరిధిలోనే ఉన్నారు.

జీహెచ్​ఎంసీ పరిధిలోనే 39.10 శాతం

ఈ నెల పదో తేదీ తర్వాత జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నెల 20న అత్యధికంగా 1645 మంది వైరస్ బారినపడగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 39.10 శాతం మంది జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గడచిన వారం రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 10838 మందికి మహమ్మారి సోకినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంటే రోజుకి సరాసరి 1550 మంది వరకు వైరస్ బారినపడుతున్నారు. జీహెచ్ఎంసీ సహా పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్​లతోపాటు.. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, హన్మకొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లోనూ కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

మరో వారం రోజుల్లో పీక్​ దశకు మూడో వేవ్​..

కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతోపాటు.. మరో వారం రోజుల్లో కొవిడ్ మూడో వేవ్ పీక్​కి చేరే అవకాశం ఉందన్న నిపుణుల అంచనాల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏ మాత్రం కొవిడ్ లక్షణాలు ఉన్నా అశ్రద్ధ చేయకుండా టెస్టులు చేయించుకుని వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.