TS Corona Cases: రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ.. వారం రోజుల్లో ఐదింతలు పెరిగిన కేసులు

author img

By

Published : Jan 6, 2022, 8:47 AM IST

Telangana Corona Cases

Corona Virus Cases: కరోనా వైరస్ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. వారంక్రితం 0.73 శాతం ఉన్న పాజిటివిటీ రేటు అయిదింతలు పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్య ఏర్పాట్లపై దృష్టి సారించింది. రెండో దశలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పడకల పెంపు, ఆక్సిజన్​ ఉత్పత్తి ప్లాంటును, మరో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Corona Virus Cases: రాష్ట్రంలో దాదాపు ఏడు నెలల పాటు స్థిరంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు మళ్లీ పడగ విప్పాయి. గత వారం రోజుల్లో కేసులు అయిదు రెట్లు కావడం ఆందోళన కలిగిస్తోంది. 84 శాతం పాజిటివ్‌లు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. అలాగే వారం క్రితం 0.73 శాతం ఉన్న పాజిటివిటీ రేటు కూడా అయిదింతలకు పైగా పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుత పరిణామాలు, నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

కొవిడ్ విజృంభణ

కొవిడ్ నిబంధనలు పాటించకుంటే..

ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అదనపు పడకలను సన్నద్ధం చేస్తోంది. రెండోదశలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ స్వీయ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పడంతోపాటు కొవిడ్‌ నిర్ధారణ కిట్లను సమకూర్చుకోవడం, కరోనా పరీక్ష కేంద్రాలను పెంచడంపై దృష్టి పెట్టింది. ఔషధాల నిల్వలపై లెక్కలు తీస్తోంది. ప్రజలంతా మాస్కులు ధరించటం, భౌతికదూరం వంటి కొవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలని, లేకపోతే రానున్న రోజుల్లో మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఔషదాల నిల్వలు

‘మనమంతా ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి భయపడుతున్నాం కానీ మన దగ్గర ఇంకా డెల్టా వేరియంట్‌ పోనేలేదు. డెల్టాలో వ్యాధి లక్షణాలు మూడురోజుల్లోనే పెరిగిపోతాయి కాబట్టి ఎవరికివారు తీవ్రతను గమనించుకోవాలి’ అని ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఔషధ గిడ్డండిలో మందుల నిల్వలు

రెండోదశ చేదు జ్ఞాపకాలను మరవొద్దు

2021 మార్చిలో కరోనా రెండోదశ ఉద్ధృతి మొదలైంది. ఈ దశలో డెల్టా వేరియంట్‌ ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో భారీ నష్టాన్ని కలగజేసింది. ఒక్కరోజులో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు లభ్యంకాని దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు టీకాల వల్ల భరోసా ఏర్పడింది. మాస్కు ధరిస్తే వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చనే స్పష్టమైన అవగాహన వచ్చింది. స్వీయ నియంత్రణతోనే కొవిడ్‌ నుంచి చాలావరకు తప్పించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మూడోదశ కూడా సుమారు 2 నెలలపాటు తీవ్ర ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు.

టీకాలు, పడకల వివరాలు

పడకలు, ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచాం..

ప్రజారోగ్య సంచాలకులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 27,996 పడకలకు గాను ఇప్పటికే 25,390 పడకలకు ప్రభుత్వం ప్రాణవాయువు సౌకర్యం కల్పించింది. ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పింది. గతంలో రోజుకు 137 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా.. దాన్ని 327 టన్నులకు పెంచింది. 27 కంటెయినర్ల ద్వారా 540 టన్నుల సామర్థ్యమున్న ప్రాణవాయువును సిద్ధం చేసింది. అన్ని సర్కారు దవాఖానాల్లోనూ పిల్లల కోసం ప్రత్యేకంగా 5,200 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో కేసుల ఉధ్ధృతిని దృష్టిలో పెట్టుకొని.. ఇక్కడి 6 ఆసుపత్రుల్లో అదనంగా 792 పడకలను నెలకొల్పి, వాటికి ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించింది.

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

సమృద్ధిగా కిట్లు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా.. కోటి ఐసొలేషన్‌ చికిత్స కిట్లు, 2 కోట్ల యాంటీజెన్‌ నిర్ధారణ పరీక్ష కిట్లు కొనడానికి ఆదేశాలిచ్చాం. 10-15 రోజుల్లో ఇవి సమకూరుతాయి. ఎన్‌ 95 మాస్కులు సహా అన్ని రకాల కిట్లు, నిర్ధారణ పరీక్ష పరికరాలు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. మరో 25 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ కిట్లను కొంటున్నాం. ప్రస్తుతం 32 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష కేంద్రాలుండగా.. ఇంకో 8 కేంద్రాలను సిద్ధంచేస్తున్నాం.

-కె.చంద్రశేఖరరెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ

ఇదీ చూడండి: Dr. Nageshwar Reddy Special Interview: 'ఒమిక్రాన్‌తో థర్డ్​వేవ్.. బూస్టర్​డోస్​తో 70 శాతం రక్షణ..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.