ETV Bharat / city

Dr. Nageshwar Reddy Special Interview: 'ఒమిక్రాన్‌తో థర్డ్​వేవ్.. బూస్టర్​డోస్​తో 70 శాతం రక్షణ..'

author img

By

Published : Jan 6, 2022, 5:36 AM IST

AIG chairmen Dr. Nageshwar Reddy Special Interview on omicron and booster dose
AIG chairmen Dr. Nageshwar Reddy Special Interview on omicron and booster dose

ప్రపంచ దేశాల్లో సరికొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. గడచిన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. మరోమారు ముప్పు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో... అనేక రాష్ట్రాలు వారాంతపు లాక్​డౌన్​ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో 15 ఏళ్లు పైబడిన వారికి సైతం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మరి బూస్టర్ డోస్​ తీసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సిన్ కాక్​టెయిల్ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి..? లాంటి ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేపట్టిన.. ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఒమిక్రాన్‌తో థర్డ్​వేవ్.. బూస్టర్​డోస్​తో 70 శాతం రక్షణ..

ప్ర. మొదటి నుంచి కొవిడ్ టీకాలపై ఏఐజీ ఆస్పత్రి అనేక అధ్యయనాలు చేశారు. కాక్ టెయిల్ విధానంలో టీకాలు ఇవ్వటం ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయంటారు?

జ. కొవిడ్​కి వ్యాక్సిన్ చాలా ముఖ్యం. ఎవరికైనా కొవిడ్ ఇన్​ఫెక్షన్ సోకితే నెల లేక మూడు నెలల తర్వాత ఒక డోస్ టీకా ఇచ్చినా యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతున్నాయి అలాంటి వారికి రెండో డోస్ తొమ్మిది నెలల తర్వాత అయినా ఇవ్వవచ్చు. ఇక చాలా మంది ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు తొలిడోస్ ఒకరకం వ్యాక్సిన్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ తర్వాత అదే వ్యాక్సిన్ దొరకటం లేదు రెండో డోస్ వేరే రకం టీకా తీసుకోవచ్చా..? అని అడుగుతున్నారు. ఇక ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా అందుబాటులోకి వస్తున్న సమయంలో ఐసీఎంఆర్ అనుమతితో ఒక స్టడీ చేశాం. దీని ప్రకారం విభిన్న రకాల టీకాలు తీసుకున్న వారిలో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో వాలంటీర్లను తీసుకున్నాం. 330 టెస్టులు చేస్తే కేవలం 40 మందికి మాత్రమే యాంటీ బాడీలు లేవు. కానీ వాళ్లు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోలేదు. అంటే వాళ్లకు తెలియకుండానే కొవిడ్ సోకింది. ఇక వాలంటీర్లను గ్రూపులుగా విభజించి పరీక్షించాము. వ్యాక్సిన్​లు మార్చి ఇచ్చిన వారిలో మంచి ఫలితాలు రావటంతో పాటు ఎలాంటి దుష్పరిణామాలు చూపలేదు. యూరప్, యూఎస్ వంటి చోట్ల గతంలో వ్యాక్సిన్​లను మార్చి ఇలాంటి పరిశోధనలు చేశారు. యూపీలో సైతం అనుకోకుండా టీకాలు మార్చి ఇచ్చారు. అయితే అలాంటి వారిలో మంచి ఫలితాలు ఉన్నాయి. త్వరలో కేంద్ర కొవిడ్ కమిటీలు ఈ అంశంపై సమావేశం కానున్నాయి. ఈ పదో తేదీ నుంచి బూస్టర్ డోస్ ఉన్న నేపథ్యంలో ఒకే రకం టీకాలు ఇవ్వాలా..? మార్చాలా..? అన్న అంశంపై చర్చించనున్నారు.

ప్ర. కొవిడ్ ప్రారంభం నుంచి ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులు కేవలం చికిత్సపై దృష్టి సారిస్తే.. ఏఐజీలో మాత్రం ఎక్కువ పరిశోధనవైపు మొగ్గు చూపారు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటి?

జ. ప్రపంచమంతా కొవిడ్​పై పరిశోధనలు సాగుతున్నాయి. చైనా, యూఎస్ , యూరప్ లలో ఎక్కువ పరిశోధనలు చేశారు. కానీ భారత్​లో ఎక్కువగా చికిత్సపైనే దృష్టి సారించాము. వాస్తవానికి ఏ వైరస్ వచ్చినా దానిపై ఎక్కువగా పరిశోధనలు సాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏఐజీలో ఎక్కువగా పరిశోధనలు చేపట్టాం. ఇక ఇందులో భాగంగా మేము ఒక్కో దేశంలో వైరస్ ఒక్కో రకం ప్రభావం చూపుతుందని గుర్తించాము. భారత్​లోనూ కొందరిలో మాత్రమే ఇది తీవ్ర ప్రభావాన్ని చూపటంపై అధ్యయనం చేసినప్పుడు భారతీయులలో హెచ్​ఎల్ఏజీ అని ఉంటుంది. ఇందులో ఓ ప్రత్యేకరకమైన జీన్ ఉన్నవారిలోనే వైరస్ తీవ్రంగా ఉంటుందని తెలుసుకున్నాము. అలాగే వ్యాక్సిన్ రెస్పాన్స్ సైతం ఒక్కో దేశం వారిలో ఒక్కో ప్రభావం ఉంటుందని గుర్తించాము.

ప్ర. కొందరిలో టీకా ఇచ్చిన తర్వాత యాంటీ బాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వటానికి కారణం ఏమిటి?

జ. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఒక్కోక్కరిలో ఒక్కో రకమైన ప్రభావం కనిపిస్తోంది. కొందరికి యాంటీ బాడీలు రావని మనం ముందే గుర్తించవచ్చు. అలాంటి వారిలో బూస్టర్ డోస్ కూడా వెంటనే వేసుకోవాలని చెబుతున్నాం. కిడ్నీ జబ్బులు, స్టీరాయిడ్​లు తీసుకునేవారికి, క్యాన్సర్ బాధితుల వంటి వారిలో ఎక్కువగా యాంటీబాడీలు రావటం లేదు. ఇక యువత, పిల్లల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే యాంటీబాడీల కంటే టీ సెల్ ఇమ్యునిటీ చాలా ముఖ్యం. శరీరంలో వైరస్ వచ్చి యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాక ఒక మెమరీ ఉంటుంది. ఈ సెల్యులార్ ఇమ్యునిటీ వల్లే వైరస్ రెండు మూడేళ్ల తర్వాత శరీరంలోకి ప్రవేశించినా రక్షణ వ్యవస్థ దానిని గుర్తించి వెంటనే స్పందిస్తుంది. ఇక ఒమిక్రాన్ విషయంలోనూ ఎక్కువ ప్రమాదకరంగా మారకపోవటానికి ఈ టీసెల్ ఇమ్యునిటీనే కారణం అవుతుందని భావిస్తున్నాము. మన దగ్గర చాలా మందికి యాంటీ బాడీలు ఉత్పత్తి కాకపోయినా .. సెల్యులార్ ఇమ్యునిటీ అభివృద్ధి అవుతోంది.

ప్ర. మీరన్నట్టు సెల్యులార్ ఇమ్యునిటీ ఇత్పత్తి అయినప్పుడు ఇక బూస్టర్ డోస్​ల అవసరం ఏమిటి?

జ. టీ సెల్ ఇమ్యునిటీకి కూడా బూస్టింగ్ అవసరం ఉంటుంది. టీకా తీసుకున్న తర్వాత తొమ్మిది నెలల నుంచి ఏడాది తర్వాత టీ సెల్ మెమరీ కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే బూస్టర్ డోస్ తీసుకుంటే టీ సెల్ మెమరీ బెటర్​గా ఉంటుంది. ఇన్ఫ్లుయంజాకి కూడా ఏటా టీకాలు ఇస్తుంటారు. ఎందుకంటే ఇన్ ఫ్లుయంజా వైరస్ ఎప్పటికప్పుడు మారుతుంది. అలాగే కొవిడ్ స్ట్రెయిన్​లకు తగిన వ్యాక్సిన్ అవసరం. భవిష్యత్తులో ఇలా కొవిడ్ స్ట్రెయిన్​కి తగిన వ్యాక్సిన్​లు వస్తాయి. ఒమిక్రాన్​కి కూడా వ్యాక్సిన్ సిద్ధంగా ఉంది. ఫైజర్ సహా పలు సంస్థలు దీనిని తయారు చేశాయి.

ప్ర. పిల్లల్లో యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం మనం 15 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నాం. అయితే సహజంగా పిల్లల్లో ఇమ్యునిటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిల్లలకు టీకా అవసరం అంటారా?

జ. కొత్త స్ట్రెయిన్​లు పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువ మంది పిల్లల్లో తీవ్ర ప్రభావం లేనప్పటికీ కొందరిలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటోంది. ఇక పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులు ఇంట్లోని పెద్దలతో ఉంటారు. పిల్లల ద్వారా వారికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనం 15 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నాం యూఎస్​లో అయితే ఐదేళ్లు పడిన వారికే టీకాలు ఇస్తున్నారు. అక్కడ పాఠశాలలు ప్రారంభించటం కాస్త ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించింది.

ప్ర. ఏఐజీలో కొవిడ్ సోకిన తొలినాళ్లలోనే మోనోక్లోనల్ యాంటీ బాడీ థెరపీని ప్రారంభించారు. ఇది మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది. రిస్క్ తీసుకున్న భావన కలగలేదా?

జ. మందులు ఒక్కొక్కరిపై ఒక్కో ప్రభావం చూపుతాయి. అయితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ప్రజలకు దానిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉంది. మేము అదే చేశాము.

ప్ర. ఒమిక్రాన్ వల్లతీవ్ర అనారోగ్య సమస్యలు కలగకపోవచ్చంటున్నారు. కానీ కొత్త వేరియంట్ పేరుచెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటి?

జ. ఒమిక్రాన్ వల్ల వాస్తవంగా కలిగే సమస్యకంటే మానసికంగా ఆందోళన కలిగించింది. గత వేవ్​ల వల్ల కలిగిన నష్టం దృష్ట్యా ఆ భయం నెలకొంది. ఒమిక్రాన్.. డెల్టా కంటే చాలా విభిన్నమైనది. ఇది డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది. డెల్టా అనేది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా తీవ్రమైన దగ్గు సమస్య ఉంది. కానీ ఒమిక్రాన్ కేవలం గొంతు, ముక్కులోనే ఎక్కువగా ఉంటోంది. ఈ రకం వైరస్ సోకిన వారిలో పొడిదగ్గు వస్తోంది. గతంలో స్పానిష్ ఫ్లూ దశాబ్దాల తర్వాత ఎండమిక్​గా మారింది. అయితే కొవిడ్ మాత్రం గడచిన రెండేళ్లలోనే క్రమంగా దాని తీవ్రతను కోల్పోతోంది. ప్రస్తుతం మనం కొవిడ్ సెకండ్ స్టేజ్​లో ఉన్నాం.

ప్ర. ఒమిక్రాన్ అనేది కొవిడ్ ప్యాండమిక్ నుంచి ఎండమిక్​గా మారే మొదటి దశగా నిపుణులు చెబుతున్నారు? ఈ కొత్త స్ట్రెయిన్​లో దాదాపు 30కి పైగా మ్యుటేషన్లు ఉన్నాయి. ఈ మ్యుటేషన్లు పెరగటాన్ని ఎలా చూడాలి?

జ. ప్రకృతిలో సహజంగా వైరస్ మ్యుటేషన్ చెందుతుంటాయి. థియరీ ఆఫ్ ఇవల్యూషన్​లో భాగంగా ఆ జీవికి ఉపయోగపడే మార్పులు దానితో పాటే ఉండిపోతాయి. అలా వైరస్ ఎక్కువకాలం ఉండేలా.... దాని వల్ల తక్కువ వ్యాధి తీవ్రత కలిగే వంటి మ్యుటేషన్లు ఉంటాయి. ప్రస్తుతం మనం ప్యాండమిక్ నుంచి ఎండమిక్​గా మారే స్టేజీలో ఉన్నాము. భవిష్యత్తులో కొత్త మ్యుటేషన్లు రాకుండా, అందరూ టీకాలు తీసుకుంటే దీనిని మనం నియంత్రించవచ్చు.

ప్ర. ప్రతి కొవిడ్ పాజిటివ్ సాంపిల్​ని జీనోం సీక్వెన్సింగ్ చేయలేము. అయితే సీక్వెన్సింగ్ చేయకుండానే ఒమిక్రాన్​ని గుర్తించే అవకాశం ఉందా?

జ. డబ్ల్యూహెచ్​ఓ 30 శాతం సాంపిళ్లను జీనోం సీక్వెన్స్ చేయాలని చెబుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే పది శాతం సాంపిళ్లను సీక్వెన్స్ చేస్తుండగా మన దేశంలో ఐదు శాతం కంటే తక్కువగానే సీక్వెన్సింగ్ చేస్తున్నాము. ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఒక్క సాంపిల్​ని సీక్వెన్స్ చేయటానికి ఐదు వేల వరకు ఖర్చవుతుంది. అందుకే సాధారణ ఆర్టీపీసీఆర్ ద్వారా కొంతవరకు వేరియంట్​ని గుర్తించవచ్చు. పీసీఆర్ టెస్టుల్లో మూడు జీన్​ఎస్, ఎన్, ఓఆర్ఎఫ్​ అని ఉంటాయి. ఒమిక్రాన్ ఉంటే పీసీఆర్ టెస్టుల్లో ఎస్​జీన్ ఉండదు. అలాంటి సాంపిళ్లను మనం ఒమిక్రాన్​గా నిర్ధరించవచ్చు.

ప్ర. గత వారం రోజులుగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కొవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. దీనికి ఒమిక్రాన్ కారణం అనుకోవచ్చా?

జ. అవును. గత వారం రోజులుగా కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వల్ల ఈ కేసులు పెరుగుతున్నాయని మనం అనుకోవచ్చు. హైదరాబాద్, ముంబయి, దిల్లీ వంటి ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. లండన్, దుబాయ్, యూఎస్ నుంచి వచ్చిన వారి ద్వారా ఇది వ్యాప్తి చెందింది. అయితే ఇది ఇప్పటికే సమాజంలోకి వెళ్లిన నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయటం సాధ్యం కాకపోవచ్చు.

ప్ర. కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఎక్కువ మందికి తీవ్ర లక్షణాలు లేకపోయినా ఒకటి రెండు శాతం మందికి తీవ్ర లక్షణాలతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా అంత మందికి చికిత్స చేసే సామర్థ్యం మన దగ్గర ఉందా?

జ. డెల్టా వేరియంట్ సోకిన వారిలో 5 శాతం మందికి తీవ్రమయ్యేది. 0.5 శాతం మంది మరణించేవారు. అయితే ఒమిక్రాన్​లో 0.5 శాతం మందికి మాత్రమే తీవ్ర లక్షణాలు సోకే అవకాశం ఉంది. డెల్టాతో పోలిస్తే వందరెట్లు కేసులు పెరిగితేనే ఆస్పత్రుల్లో బెడ్స్ చాలని పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పటికే చాలా వరకు టీకాలు తీసుకున్న నేపథ్యంలో ఆ పరిస్థితి రాకపోవచ్చు. మూడో వేవ్ దేశంలో ఇప్పటికే ప్రారంభమైంది అనుకోవచ్చు. ఈ మూడోవేవ్ ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుంది. అయితే ఈ వేవ్​లో మరణాలు దాదాపు ఉండవని భావిస్తున్నాము. అయితే ఎక్కువ మందికి కొవిడ్ సోకే అవకాశం ఉంది. మూడో వేవ్​లో తీవ్రత లేకుండా బయటపడితే మనం ప్యాండమిక్ నుంచి ఎండామిక్ స్టేజ్​కి వచ్చినట్టే.

ప్ర. హాస్పిటలైజేషన్ అవసరం లేకపోయినా ఓపీ సేవల అవసరం పెరిగే అవకాశంఉంది. ఆ స్థాయిలో మన వద్ద తగినంత మంది వైద్యులు అందుబాటులో ఉన్నారంటారా?

జ. కేసులు సంఖ్య భారీగా పెరిగినప్పుడు ఈ సమస్య రావచ్చు. అయితే టెలీ మెడిసిన్​తో మనం ఈ సమస్యని ఎదుర్కోవచ్చు. ఇక మోల్నుఫిర్ వంటి మందులు అందుబాటులోకి వచ్చాయి. పైజర్ సైతం కొన్ని మందులను తయారు చేస్తోంది. ఇలాంటి మందులు వీడియో కన్సల్టేషన్ ద్వారా రోగులకు ఈ మందులు ఇచ్చి వారిని కాపాడుకోవచ్చు.

ప్ర. కొవిడ్ కేసులు పెరిగిన ప్రతి సారి లాక్​డౌన్​లు, ప్రయాణాలపై ఆంక్షలు పెడతాము. ఇవి ఎంతవరకు కొవిడ్ వ్యాప్తిని అరికట్టగలవంటారు?

జ. నా ఉద్దేశంలో ఈ ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపవు. గతంలో వైరస్ వ్యాప్తి కొంత నెమ్మదిగా ఉండేది. దీంతో లాక్​డౌన్ ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని మరింత నెమ్మదించేలా చేసే వాళ్లం ఆ సమయంలో వైద్యులు , ఆస్పత్రుల్లో వసతులు పెంచుకునే వాళ్లం. అయితే ఇప్పుడు లాక్​డౌన్ వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికే మనకి ఆస్పత్రులు సన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో లాక్​డౌన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు లాక్​డౌన్ లు పెట్టడం వల్ల ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయే తప్ప ప్రయోజనం లేదు. వ్యాక్సిన్ వల్ల ఒమిక్రాన్ పూర్తిగా నియంత్రణ కాకపోవచ్చు కానీ తీవ్రతను తగ్గిస్తుంది. కొన్ని దేశాల్లో జరిగిన అధ్యయనాలు బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో 70 శాతం ఒమిక్రన్ నుంచి రక్షణ కల్పిస్తుందని గుర్తించారు. ఫిబ్రవరి ప్రారంభం లోనే ఈ ప్యాండమిక్ తగ్గే అవకాశం ఉంది.

ప్ర. ఏ వ్యాక్సిన్ ఏ వేరియంట్ మీద ప్రభావవంతంగా పనిచేస్తుందన్న విషయాన్ని ఎలా గుర్తించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్​లు ఏ మేరకు పనిచేస్తున్నాయి?

జ. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు చేస్తున్నాం. ఒమిక్రాన్​ని ల్యాబ్​లో అభివృద్ధి చేయటం సరైనపద్ధతి కాదు. అందుకే సూడో వైరస్​ని ల్యాబ్​లో అభివృద్ధి చేస్తున్నాం. ఈ సూడో వైరస్​పై వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి నుంచి యాంటీ బాడీలు సేకరించి ఆ యాంటీ బాడీలు సూడో వైరస్​పై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అంశాన్ని పరిశోధిస్తున్నాము.

ప్ర. ఇప్పటికే పలు దేశాలు కొవిడ్ సోకిన తర్వాత ఐసోలేషన్ సమయాన్ని తగ్గించాయి. ఇది ఎంతవరకు సరైన మార్గం అంటారు. భారత్​లో ఇలాంటి చర్యలు ఏ మేరకు ఉపయోగకరం అంటారు?

జ. అమెరికా వంటి దేశాల్లో ఈ కొత్త వేవ్​లో వైరస్ భారిన పడిన వారిలో స్వల్ప లక్షణాలు ఉండటంతో పాటు.. వివిధ రంగాల్లో పనిచేసే వారి సంఖ్య తగ్గి సంస్థలను నిర్వహించటం ఇబ్బంది కరంగా మారినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారు ఐసోలేషన్ సమయాన్ని తగ్గించారు. సాధారణ కొవిడ్​లో 14 రోజులకు వైరస్ తీవ్రంగా మారితే ఒమిక్రాన్ లో 2 రోజులకే వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఐదు రోజుల తర్వాత వైరస్ వ్యాప్తి కూడా తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఐసోలేషన్​ని తగ్గించారు. భారత్​లోనూ వారం రోజులు ఐసోలేషన్​లో ఉంటే చాలు. అయితే కొవిడ్ సోకిన వారు తిరిగి కార్యాలయాలకు వచ్చే ముందు టెస్టు చేయించుకోవటం మంచిది.

ప్ర. పోస్ట్ కొవిడ్ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. భవిష్యత్తులో ఇవి ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు?

జ. సీరియస్ కొవిడ్ వచ్చిన 30 శాతం మందిలో పోస్ట్ కొవిడ్ సమస్యలు ఉంటున్నాయి. చాలా మందిలో కీళ్ల నొప్పులు, తలనొప్పి, హైబీపీ, పక్షవాతం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే అన్నింటికంటే ముఖ్యంగా పేగుల్లో ఉండే బ్యాక్టీరియా దెబ్బతింటున్నాయి. మనం తిన్న ఆహారాన్ని అరిగించటంలో ఈ వైరస్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే కొవిడ్ సోకిన సమయంలో ఈ బ్యాక్టిరియాలో మార్పు వచ్చి డిస్ బయోసిస్ అనే సమస్య ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి వారిలో ప్రో బయోటిక్స్ ఇచ్చి మంచి బ్యాక్టీరియా వృద్ధి జరిగేలా చేస్తున్నాము. వచ్చే రెండు మూడేళ్లలో పోస్ట్ కొవిడ్ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ప్ర. సీసీఎంబీతో కలిసి ప్రస్తుతం ఏఐజీలో ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ?

జ. ఇప్పుడు బూస్టర్ డోస్​కి సంబంధించిన వ్యాక్సిన్ గురించి స్టడీ చేస్తున్నాము. బూస్టర్ డోస్ ఇవ్వటం వల్లమంచి ఫలితాలు ఉంటాయని 2000మందిపై స్టడీ చేస్తున్నాము. సూడో వైరస్​పై ఇన్ వెట్రో స్టడీ చేస్తున్నాము. ఇక ఇప్పటి వరకు మైల్డ్ కొవిడ్ ఉన్నవారికే కాక్ టెయిల్ చికిత్స అందిస్తున్నాము. అయితే డోస్ పెంచటం ద్వారా సీరియస్ కొవిడ్ ఉన్నవారిలోనూ కాక్ టెయిల్ చికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని అధ్యయనం చేస్తున్నాము.

ప్ర. చివరిగా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలకి మీరేం చెబుతారు?

జ. ఒమిక్రాన్ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. దీని వల్ల మూడో వేవ్ వస్తుంది. అయితే దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు రావు కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. బూస్టర్ డోస్ మరింత ప్రయోజనం కలిగిస్తుంది. మార్చి వరకు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం ద్వారా వైరస్​ని కొంత వరకు కట్టిడి చేయొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.