ETV Bharat / state

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు

author img

By

Published : Feb 26, 2021, 9:42 AM IST

పదో తరగతి విద్యార్థులపై కరోనా ప్రభావం ఈ విద్యాసంవత్సరంలోనూ కనిపిస్తోంది. వైరస్ ఉద్దృతి వల్ల గతేడాది పదోతరగతి పరీక్షలు నిర్వహించకపోగా.. ఈ ఏడాది సకాలంలో పూర్తికాని సిలబస్.. విద్యార్థులను భయపెడుతోంది. ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే పరీక్షలను జూన్‌కు మార్చినప్పటికీ విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

విద్యార్థులపై ఒత్తడి తగ్గంచే దిశగా చర్యలు
విద్యార్థులపై ఒత్తడి తగ్గంచే దిశగా చర్యలు

గత ఏడాది కరోనాతో అన్నిరంగాలు ప్రభావితమయ్యాయి. విద్యారంగంపైన ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఎన్నడూ లేనివిధంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి గత ఏడాది ఎదురైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదున్నర లక్షల నుంచి 6లక్షల మంది వరకు.. పదో తరగతి చదువుతున్నారు. కొన్నాళ్లు ఆన్‌లైన్ తరగతులు నడిచినప్పటికీ.. గత నవంబరు నెల నుంచి విద్యార్థులకు నేరుగా తరగతులను నిర్వహిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో.. జనవరి నాటికే సిలబస్ పూర్తిచేసి రివిజన్‌కు వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం పాఠాలు పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. ఈ దృష్ట్యా ప్రభుత్వం పరీక్షలను జూన్ 7నుంచి నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు.. 30 శాతం పాఠ్యాంశాలను తగ్గించారు. పరీక్షలకు జూన్ వరకు సమయం ఉన్నందున.. ఈ లోగా సిలబస్‌ను పూర్తి చేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

కరోనా వల్ల చాలా ప్రైవేట్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా సబ్జెక్ట్‌ నిపుణుల కొరత ఏర్పడింది. చాలా పాఠశాలల్లో మ్యాథ్స్‌, సైన్స్‌, హిందీ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాసరూపంలో ప్రశ్నలు కాకుండా బిట్ల రూపంలో ప్రశ్నాపత్రాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు కొంతమేర ఒత్తిడి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా ప్రభావంతో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడిన తరుణంలో.. పదో తరగతి విద్యార్థులపై పరీక్ష ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులపై ఒత్తడి తగ్గంచే దిశగా చర్యలు

ఇదీ చదవండి: గల్ఫ్​లో తెలంగాణ వాసుల గోడు... వంద మందికి పైగా గల్లంతు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.