ETV Bharat / state

Congress Kolhapur Public Meeting Postponed : కాంగ్రెస్ 'కొల్లాపూర్‌' బహిరంగ సభ వాయిదా.. అదే కారణం!

author img

By

Published : Jul 16, 2023, 5:35 PM IST

Palamuru Praja Bheri Postponed : కొల్లాపూర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభ వాయిదా పడింది. ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో సభను వాయిదా వేశారు. దీంతో జూపల్లి కృష్ణారావు హస్తం పార్టీలో చేరిక మరికొంత ఆలస్యం కానుంది.

Congress
Congress

Congress Public Meeting in Kollapur Postponed : నాగర్​కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ సభ వాయిదా పడింది. ఈ నెల 20న జరగాల్సిన సభను మరొక రోజు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ఇతర పార్టీల నాయకులు ప్రియాంక గాంధీ సమక్షంలో.. హస్తం పార్టీలో చేరేందుకు పాలమూరు ప్రజాభేరి పేరున సభ నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. అయితే పాలమూరు సభకు ఆహ్వానిస్తూ.. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈ నెల మొదటి వారంలోనే పీసీసీ లేఖ రాసింది.

కానీ ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాలేదు. దీంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20న సభ నిర్వహించేందుకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో ఓ కమిటీని పీసీసీ వేసింది. అదేవిధంగా సభ నిర్వహణతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి జన సమీకరణ చేసేందుకు ఇంఛార్జ్‌లను కూడా నియమించింది.

Congress Party Meeting In Kollapur : ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో.. సభ వాయిదా పడినట్లు ఏఐసీసీ నుంచి పీసీసీకి, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 23న కానీ, 28న కానీ, 30న కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఏఐసీసీ సూచించినట్లు సమాచారం. అప్పటికి ప్రియాంక గాంధీ పర్యటన ఖరారు కాకపోయినట్లయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. తెలంగాణ పర్యటనకు రావడం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Palamuru Praja Bheri in NagarKurnool : మరోవైపు కొల్లాపూర్ వేదికగా జరిగే పాలమూరు ప్రజాభేరిలో పలువురు కీలక నేతలు.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి హస్తం పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి.. కాంగ్రెస్‌లో చేరాలనుకే నేతలంతా.. కొల్లాపూర్ సభలోనే అగ్రనేతల సమక్షంలో హస్తం పార్టీలోకి రానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించి.. అధికారంలోకి వస్తే అర్హులైన ఆసరా లబ్దిదారులందరికీ పింఛన్లు రూ.4,000 చేస్తామని హామీ ఇచ్చింది. ఇదే తరహాలో పాలమూరు ప్రజాభేరిలోనూ ప్రజాకర్షక ఎన్నికల హమీలను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి : Khammam Congress Meeting : 'BRSకు భయం పుట్టింది.. అందుకే ఈ అడ్డగింత'

Political Heat in Khammam : ఖమ్మం గుమ్మంలో రాజుకుంటున్న రాజకీయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.