ETV Bharat / state

రాష్ట్రంలో జంబో కమిటీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్​.. ఆ నేతకు దక్కని గౌరవం

author img

By

Published : Dec 10, 2022, 9:28 PM IST

Congress party
Congress party

Congress jumbo committees: తెలంగాణలో రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్​ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్రంలో జంబో కమిటీలు ఏర్పాటు చేసింది. పీసీసీ రాజకీయ, కార్యనిర్వాహక, జిల్లా కమిటీలను ప్రక్షాళన చేసి కొత్త కమిటీలు ప్రకటించింది. పైన ప్రకటించిన కమిటీల్లో దేనిలోనూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం ఇప్పడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Congress jumbo committees: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై ఆ పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు పార్టీ జంబో కమిటీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. పీసీసీ రాజకీయ, కార్య నిర్వాహక కమిటీలు, జిల్లాల కమిటీలను ప్రక్షాళన చేసింది. ఈ మేరకు ఆయా కమిటీల జాబితాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నియామించారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ, కార్యనిర్వహక కమిటీలో పీపీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వీచ్‌, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి తదితరులు మొత్తం 18 మంది సభ్యులుగా ఉన్నారు. అలాగే, ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా పీసీసీ కార్యనిర్వాక అధ్యక్షులు అజహరుద్దీన్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌ నియమితులయ్యారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పీసీసీ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు చేసిన అధిష్టానం.. కమిటీలో మల్లు భట్టివిక్రమార్క, వీహెచ్‌, రేణుకాచౌదరి, దామోదర్ సి రాజనరసింహ, పి.బలరాంనాయక్‌, నాగం జనార్థన్‌ తదితరులు మొత్తం 23 మందితో నియమించింది.

తొలి విడతలో 26 జిల్లాలో కమిటీలు ఏర్పాటు: ఆ కమిటీలతోపాటు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులను అధిష్ఠానం ప్రకటించింది. తొలి విడతలో 26 జిల్లాలకే జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా వెల్లడించింది. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడుగా సాజిద్ ఖాన్ నియమితులయ్యారు. పొడెం వీరయ్య - భద్రాద్రి కొత్తగూడెం, ఎన్.రాజేందర్‌రెడ్డి - హనుమకొండ, సమీర్ - హైదరాబాద్, ఎ.లక్ష్మణ్ కుమార్ - జగిత్యాల, పటేల్ ప్రభాకర్‌రెడ్డి - జోగులాంబ గద్వాల్, కైలాస్ శ్రీనివాస్ - కామారెడ్డి, సీ.రోహిన్‌రెడ్డి - ఖైరతాబాద్, జె.భరత్‌చంద్రారెడ్డి - మహబూబాబాద్, మధుసూదన్‌రెడ్డి - మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రకటించారు.

కె.సురేఖ - మంచిర్యాల, తిరుపతిరెడ్డి - మెదక్, నందికంటి శ్రీధర్ - మేడ్చల్ మల్కాజిగిరి, కుమారస్వామి - నాగర్‌కర్నూలు, శంకర్ నాయక్ - నల్గొండ, శ్రీహరి ముదిరాజ్‌ - నారాయణపేట, ప్రభాకర్‌రెడ్డి - నిర్మల్, మానాల మోహన్‌రెడ్డి - నిజామాబాద్, ఎంఎస్ రాజ్‌ ఠాకూర్ - పెద్దపల్లి, ఆది శ్రీనివాస్ - రాజన్న సిరిసిల్ల, టి.నర్సారెడ్డి - సిద్ధిపేట, ఎం.రాజేందర్ ప్రసాద్ యాదవ్ - వనపర్తి, కె.అనిల్ కుమార్ - యాదాద్రి భువనగిరి చొప్పున నియమితులయ్యారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కని చోటు: మరికొన్ని జిల్లాల కమిటీల ప్రకటన తాత్కాలిక పెండింగ్ పెట్టిన ఏఐసీసీ.. త్వరలో మిగతా జిల్లాల కాంగ్రెస్ కమిటీలను కూడా ప్రకటించనుంది. మరోవైపు, కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యహరించిన తీరు పట్ల అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. ఆ సమయంలో ఆయనకు షోకాజు నోటీసు కూడా జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కోమటిరెడ్డి అంటీముంటనట్లు వ్యహరిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా ఆపార్టీ అధిష్టానం నియమించిన కమిటీల్లో ఆయనకు చోటు కల్పించక పోవడంతో గట్టి షాక్ తగిలినట్లే అని చెప్పుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.