ETV Bharat / state

నేడు కాంగ్రెస్‌ అభ్యర్థుల మూడో జాబితా! కొడంగల్‌, కామారెడ్డి స్థానాల నుంచి బరిలో రేవంత్‌రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 7:25 AM IST

Updated : Nov 5, 2023, 10:27 AM IST

Congress MLA Candidates 3rd List Telangana : కాంగ్రెస్‌ అభ్యర్థుల మూడో జాబితాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కొడంగల్‌, కామారెడ్డి రెండు స్థానాల నుంచి బరిలో దిగనున్నారు. సిరిసిల్ల, పటాన్‌చెరు, సూర్యాపేట, నారాయణఖేడ్‌ నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికపై పీఠముడి పడటంతో కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయానికి వదిలేసినట్లు తెలుస్తోంది. వామపక్షాల సీట్ల విషయంలో స్పష్టత వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023
Congress MLA Candidates 3rd List Telangana

కాంగ్రెస్‌ అభ్యర్ధుల మూడో జాబితాపై స్పష్టత కొడంగల్‌, కామారెడ్డి స్థానాల నుంచి బరిలోకి రేవంత్‌రెడ్డి

Congress MLA Candidates 3rd List Telangana : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ.. కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వామపక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధుల విషయంలో కూడా కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో మూడో జాబితా ప్రకటనలో జాప్యం జరుగుతూ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వామపక్షాలతో చర్చించినట్లు తెలుస్తోంది. సీపీఎం, సీపీఐలకు ఒక్కో టికెట్, ఒక ఎమ్మెల్సీ ఇచ్చేట్లు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కానీ వామపక్షాలు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనుండటంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. షబ్బీర్​ అలీని కామారెడ్డి నుంచి పోటీలో నిలపాలని పార్టీ భావించగా.. ఆయన విముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు పోటీగా నిలిచేందుకు ప్రత్యామ్నాయ నాయకులు ఎవ్వరూ లేకపోవడంతో ఏఐసీసీ అనుమతితో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డినే బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో కామారెడ్డి నుంచి దూరమవుతున్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

Telangana Assembly Elections 2023 : మిగిలిన 15 నియోజక వర్గాల్లో జుక్కల్ నుంచి లక్ష్మీకాంతం, బాన్సువాడ నుంచి ఏనుగు రవీంద్ర రెడ్డి, కామారెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కరీంనగర్ నుంచి శ్రీనివాస్‌, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌ రెడ్డి కానీ తీన్మార్‌ మల్లన్నను కానీ బరిలో దించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నారాయణఖేడ్ నుంచి సురేష్‌ షెట్కర్‌, సంజీవ్‌ రెడ్డిలు ఇద్దరు కూడా టికెట్‌ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. పటాన్‌చెరు నుంచి నీలం మధు, శ్రీనివాస్‌ గౌడ్‌ల మధ్య టికెట్ కోసం హోరాహోరీ పోటీ నెలకొంది. సూర్యాపేట నుంచి పటేల్‌ రమేష్‌ రెడ్డి, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్‌ రెడ్డిలు గట్టిగా పట్టుబడుతున్నారు.

ఈ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల ఎంపిక విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. తుంగతుర్తి నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కానీ.. అద్దంకి దయాకర్‌ కానీ బరిలో దించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వ్యక్తి రవి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లందు నుంచి బలరాం నాయక్‌, డోర్నకల్ నుంచి డాక్టర్‌ రామచంద్రనాయక్‌, సత్తుపల్లి నుంచి మానవతారాయ్‌ని లేదా ఆయన సతీమణిని బరిలో దింపే పరిస్థితులు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అశ్వారావుపేట నుంచి సున్నం నాగమణి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లులలో ఒకరిని బరిలో దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana congress MLA Tickets 2023 : ఇప్పటి వరకు ప్రకటించిన వంద స్థానాల్లో రెండు, మూడు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను మార్పు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చేవెళ్ల, నర్సాపూర్‌, మహేశ్వరం, వనపర్తి, బోథ్‌ నియోజకవర్గాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులను మార్పు చేసినట్లయితే అక్కడ అసంతృప్తి చల్లారడంతో పాటు గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఈ నియోజకవర్గాల్లో అసంతృప్తులు కలిసి రాకపోవడంతో అభ్యర్థుల గెలుపునకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే మార్పు చేయాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీకి నివేదించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ స్థాయిలో ఈ స్థానాలపై ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సి ఉంది.

పొత్తు తేలకపాయె జాబితా రాకపాయె - కాంగ్రెస్​లో మూడో జాబితా వచ్చేదెన్నడో?

ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్

Last Updated : Nov 5, 2023, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.