జీహెచ్ఎంసీ ఎన్నికలు కుటుంబ పాలనకు... ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరాటమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ అన్నారు. మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారందరికీ స్వాగత పలుకుతున్నామన్నారు. భూపేంద్ర యాదవ్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్ భాజపాలో చేరారు.
అవినీతి రహిత పాలన మోదీ సర్కారుతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. విక్రమ్ గౌడ్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. ప్రజలు తమని విశేషంగా ఆదరిస్తున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నరేంద్రమోదీ నాయకత్వానికి ఆకర్షితులై భాజపాలో విక్రమ్ గౌడ్ చేరుతున్నారని డీకే అరుణ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో అధికార పార్టీ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించటం లేదని... ప్రజలకు న్యాయం చేయడానికి భాజపా సరైన వేదిక అని అందరూ నమ్ముతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: గ్రేటర్ పోరు: సాంకేతిక మీట.. ప్రచార బాట!