ETV Bharat / state

టీ కాంగ్రెస్‌లో సంక్షోభం.. నేడు అసంతృప్త నేతలతో దిగ్విజయ్‌ సింగ్‌ భేటీ

author img

By

Published : Dec 22, 2022, 6:44 AM IST

congress
congress

Digvijay Singh meets T Congress Seniors: రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న ఏఐసీసీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను రంగంలోకి దించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్‌లో అసంతృప్తి నేతలతో దిగ్విజయ్‌సింగ్‌ చర్చించనున్నారు. పీసీసీ, సీఎల్పీ గ్రూపుల నాయకులను సమన్వయం చేసి ఏకతాటిపై నడిచేలా చేయనున్నారు.

Digvijay Singh meets T Congress Seniors: రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తెరదించే ప్రక్రియ మొదలైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు.. సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ అసంతృప్తి నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. రాత్రి హైదరాబాద్ వచ్చిన ఆయన... ఈ ఉదయం గాంధీభవన్‌లో పీసీసీ వ్యతిరేకవర్గ సీనియర్లతో ఒక్కొక్కరితో వేర్వేరుగా సమావేశమై... సమస్యలను అడిగి తెలుసుకుంటారు. పార్టీలో ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నాయకులంతా ఏకతాటిపై నడిచేందుకు ఏం చేస్తే బాగుంటుందని వారి నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దిల్లీలో ఉండడంతో.. సీఎల్పీ నేతలు మల్లు భట్టి విక్రమార్క సహా పార్టీ ముఖ్యులతో చర్చించనున్నారు. ఇటీవల పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే సీతక్క సహా విజయరమణారావు, వేం నరేందర్‌రెడ్డి తదితరులతో కూడా దిగ్విజయ్‌ సింగ్ సమావేశం కానున్నారని సమాచారం. తర్వాత పీసీసీ అధ్యక్షుడితో, ఇన్‌ఛార్జి మాణికంఠాగూర్‌తో కూడా చర్చించి అధిష్ఠానానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది.

శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద దిగ్విజయ్‌ సింగ్‌కు కాంగ్రెస్‌ నేతలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్.. సీనియర్లను రేవంత్‌రెడ్డి అవమానపరిచేట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని.. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌తో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ట హోటల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు ఆయనను కలిశారు. ఇవాళ గాంధీభవన్‌లో జరిగే సమావేశానికి అందుబాటులో ఉండడం లేదన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... అందువల్లే ఒక రోజు ముందుగానే దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసినట్టు తెలిపారు. 2018 తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు... గత 20 నెలలుగా పార్టీ పరిస్థితులపై దిగ్విజయ్‌సింగ్‌కు వివరించానని ఆయన తెలిపారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలను చక్కదిద్దేందుకు దిల్లీలో నిన్న ఉదయమే దిగ్విజయ్‌ రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత సీనియర్లు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతోపాటు ఇటీవల నియమించిన కమిటీల గందరగోళం వరకు జరిగిన పరిణామాలపై చర్చించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.