ETV Bharat / state

ఎన్నికల్లో ఓడినవారికి పదవుల్లేవ్ - ఏడాది పాటు వేచి చూడాల్సిందే

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 9:11 AM IST

Updated : Dec 13, 2023, 9:29 AM IST

Telangana Congress
Telangana Congress

Congress Decided Not To Give Posts To Defeated Leaders : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఏడాది కాలం పాటు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వరాదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 55 మందికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని అల్టిమేటమ్ ఇచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలకు పదవి ఇవ్వరాదని కాంగ్రెస్‌ నిర్ణయం

Congress Decided Not To Give Posts To Defeated Leaders : రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 118 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానం నుంచి సీపీఐ పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేసినా ఒకచోట మాత్రమే విజయం సాధించారు. 118 స్థానాల్లో 64 మంది మాత్రమే గెలుపొందగా మిగిలిన 55 స్థానాల్లో బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలు కైవసం చేసుకున్నాయి.

అయితే ఓటమి చెందిన 55 మంది నాయకులు ఏడాది పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ఏ పోస్టులనూ ఉండరాదని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు గాని ఈ 55 మందికి ఇవ్వకూడదని పేర్కొంది. అయితే మైనార్టీ ప్రజాప్రతినిధులు గెలవకపోవడంతో ఆ సామాజికవర్గంలో అర్హత కలిగిన నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తోంది.

Congress Decided Not To Give Posts To Defeated Leaders in Telangana : అదేవిధంగా ఇప్పటికిప్పుడు ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా వీరు అర్హులు కారు. 100కి పైగా నామినేటెడ్ పదవులను (Nominated Posts) భర్తీ చేసే దిశలో హస్తం పార్టీ కసరత్తు కొనసాగుతోంది. ఒకసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన ఏ నాయకుడికి తిరిగి ఏడాది వరకు ఇవ్వకూడదని, కొత్త వాళ్లను ప్రోత్సహించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఆ మూడు ఎమ్మెల్సీ పదవులను టికెట్లు త్యాగం చేసిన వారికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - 54 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

నామినేటేడ్ సీట్ల కోసం నాయకుల జాబితా చాంతాడంత : మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు, పార్టీ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల సీట్ల కోసం నేతల జాబితా చాంతాడంత ఉన్నట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నేతలతో పాటు, టికెట్లు త్యాగం చేసిన నాయకులు కూడా పదవులను ఆశిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు, మరొకటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ హస్తం పార్టీ ఖాతాలో ఉన్నాయి. సీపీఐతో పొత్తు పెట్టుకున్న సమయంలో ఒక టికెట్‌తో పాటు, ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పార్టీకి ఒక సీటు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా టికెట్లు అడగకుండా పార్టీ కోసం పని చేసిన వారు ఉన్నారు.

ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్న నేతలు : ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి కూడా సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ పదవి ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకోవాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. అయినా ఆ పదవి కోసం మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పోటీ పడుతున్నారు. మరో వైపు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ పోస్టుల కోసం కూడా, ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తొమ్మిదిన్నరేళ్ల అస్తవ్యస్త పాలనను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం : మంత్రి జూపల్లి

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు

Last Updated :Dec 13, 2023, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.