ETV Bharat / state

హస్తినలో కార్యకలాపాలకు 'బీఆర్​ఎస్'​ రంగం సిద్ధం

author img

By

Published : Dec 13, 2022, 3:22 PM IST

Updated : Dec 13, 2022, 10:55 PM IST

CM KCR Delhi Tour Updates
CM KCR Delhi Tour Updates

CM KCR Delhi Tour Updates: హైదరాబాద్‌ వేదికగా జాతీయ పార్టీగా అవతరించిన "భారత్‌ రాష్ట్ర సమితి" దేశరాజధాని నుంచి కార్యకలాపాలకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు దిల్లీలో ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్ కార్యాలయం ముస్తాబైంది. హస్తినలో రేపు రాజశ్యామల యాగంతో క్రియాశీలకంగా జాతీయ రాజకీయాల్లోకి గులాబీదళపతి అడుగుపెట్టనున్నారు. రెండ్రోజులపాటు జాతీయ కార్యాలయంలో యాగాలు, పూజాకార్యక్రమాలు జరగనుండగా.. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించిన కేసీఆర్‌.. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

హస్తినలో కార్యకలాపాలకు 'బీఆర్​ఎస్'​ రంగం సిద్ధం.. రేపే ప్రారంభోత్సవం

CM KCR Delhi Tour Updates: తెలంగాణ రాష్ట్ర సమితి.. జాతీయ పార్టీగా అవతరించిన అనంతరం దిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. రెండ్రోజుల ముందే హస్తినకు చేరుకున్న ముఖ్యమంత్రి .. సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో బుధవారం జాతీయ పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ విజయవంతం కావడం, దేశం సుభిక్షంగా ఉండేందుకు దైవకృప కోసం రెండ్రోజులపాటు చేపట్టిన రాజశ్యామల యాగానికి గణపతి పూజతో శ్రీకారం చుట్టారు.

పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు జరగుతుండగా.. బుధవారం నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. సర్దార్‌పటేల్‌ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కేకే, నామా, సంతోష్‌తోపాటు పార్టీ నేతలతో కలిసి జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు యాగం కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు

రేపు బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం: భారత్‌ రాష్ట్ర సమితి తాత్కాలిక కార్యాలయాన్ని కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 12గంటల 37నిమిషాల నుంచి 12గంటల 47నిమిషాల మధ్య ప్రారంభించనున్నారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించనున్న ఆయన.. ఆ తర్వాత కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికాయత్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ, రైతు సంఘాల నేతలు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.

బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం వేళ దిల్లీలోని సర్దార్‌పటేల్‌ మార్గంలో పార్టీ శ్రేణులు జెండాలు, ఫ్లెక్సీలు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రధానమార్గం కావడంతో.. భద్రత దృష్ట్యా ఎన్‌డీఎంసీ అధికారులు హోర్డింగ్‌లు తొలగించారు. ప్రముఖులు వెళ్లే ప్రాంతం అయినందున వీటిని తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

"రేపు తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడుకు చెందిన రైతు నాయకులు హాజరవుతారు. ఇతర రాజకీయ నేతలు పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం.12.37 నుంచి 12.47 మధ్య బీఆర్ఎస్‌ కార్యాలయంను కేసీఆర్ ప్రారంభిస్తారు." - ప్రశాంత్‌రెడ్డి, మంత్రి

ఇవీ చదవండి:

Last Updated :Dec 13, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.