ETV Bharat / state

తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు : సీఎం కేసీఆర్

author img

By

Published : Feb 3, 2023, 7:07 AM IST

KCR condolence to K Viswanath demise
KCR condolence to K Viswanath demise

KCR condolence to K Viswanath demise : కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు తీరని లోటని వ్యాఖ్యానించారు. వెండితెరపై దృశ్య కావ్యాలను ఆవిష్కరించిన అరుదైన దర్శకుడని కొనియాడారు. విశ్వనాథ్‌కు ఆరోగ్యం బాగలేదని తెలిసి గతంలో వెళ్లి పరామర్శించానన్న కేసీఆర్‌.. సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు.

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు.

భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు ఆయన తన సినిమాలో పెద్ద పీట వేశారని కేసీఆర్‌ కొనియాడారు. సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె. విశ్వనాథ్ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికితురాయిగా నిలిచాయన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కె.విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందన్నారు. కవి పండితులకు జనన, మరణాల భయం ఉండదు, వారి కీర్తి అజరామరం అని సీఎం పేర్కొన్నారు. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.