ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు 'కేంద్రం' కితాబు

author img

By

Published : May 1, 2020, 7:33 AM IST

central team report submitted to central homedepartment on corona
కరోనా నివారణ చర్యలు భేష్​: కేంద్ర బృందం కితాబు

కొవిడ్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్ర అంతర్‌ మంత్రిత్వ శాఖ బృందం (ఐఎంసీటీ) సంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆ బృందం కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, కొన్ని లోపాల గురించి అందులో పేర్కొంది. మొత్తంగా పరిస్థితులు బాగానే ఉన్నట్లు బృందం నివేదిక పంపిందని హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వైరస్​ నిర్మూలనకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరింది. రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పంచింది.

‘కేంద్ర బృందం ఆసుపత్రులు, సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌, షెల్టర్‌హోమ్స్‌, మండీ తదితరాలు పరిశీలించింది. రాష్ట్రం వద్ద తగిన సంఖ్యలో టెస్ట్‌కిట్లు, పీపీఈలు ఉన్నట్లు ఈ బృందం గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వం ఎండ్‌ టు ఎండ్‌ ఐటీ డ్యాష్‌ బోర్డు ఉపయోగించి రోగుల పరీక్షల దగ్గర నుంచి డిశ్ఛార్జి వరకు అన్నింటినీ ట్రాకింగ్‌ చేస్తోంది. కొవిడ్‌ స్టేట్‌ నోడల్‌ సెంటర్‌ అయిన గాంధీ ఆసుపత్రిని బృందం సందర్శించింది. అక్కడ చికిత్స, డిశ్ఛార్జికి సంబంధించిన ప్రొటోకాల్స్‌ అన్నీ క్రమబద్ధంగా పాటిస్తున్నారు. ఆ ఆసుపత్రిలో 93%కి పైగా కేసులకు చికిత్స జరిపినట్లు, అక్కడ రోజుకు 300 పరీక్షలు చేసే లేబొరేటరీ కూడా ఉన్నట్లు గుర్తించింది.

ఆసుపత్రిలో ప్రొటోకాల్స్

కోలుకున్న రోగులను ఆసుపత్రి వాహనంలోనే ఇంటికి తీసుకెళ్తున్నారు. అలాగే 14 రోజుల పాటు మొబైల్‌ ద్వారా హోంక్వారెంటైన్‌లో పాటించాల్సిన సూచనలు అందజేస్తున్నారు. కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో కూడా అన్ని ప్రొటోకాల్స్‌ అనుసరిస్తున్నట్లు, నమూనాల సేకరణ సౌకర్యం ఉన్నట్లు బృందం గుర్తించింది. అయితే అక్కడ సిబ్బందికి, రోగులకు వేర్వేరు కారిడార్లు ఉండాలని సిఫార్సు చేసింది. వైద్యసిబ్బంది దుస్తులు ధరించే, వాటిని విడిచే ప్రాంతాలు వేర్వేరుగా ఉండాలని సూచించింది. హుమాయూన్‌నగర్‌ కంటెయిన్‌మెంట్‌జోన్‌లో బ్యారికేడ్లు నిర్మించి, ఇంటింటి నిఘా ఉంచినట్లు, అత్యవసర వస్తువులు, సేవలను ఇంటిదగ్గరికే అందిస్తున్నట్లు బృందం గమనించింది.

డ్రోన్‌లతో నిఘా

ఇందుకోసం అక్కడి మున్సిపల్‌ సిబ్బంది, కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని ప్రజలతో కలిపి ఒక వాట్సప్‌ గ్రూప్‌ రూపొందించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. కొన్ని చోట్ల పోలీసుల సాయంతో డ్రోన్‌లతో నిఘా కూడా పెట్టినట్లు గమనించింది. క్వారంటైన్‌ కేంద్రంలో పరిస్థితి బాగున్నట్లు నివేదికలో పేర్కొంది. సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లో స్టాక్‌ మానిటరింగ్‌ సిస్టంనూ కేంద్ర బృందం పరిశీలించింది. దాని ద్వారా అన్ని జిల్లాల ఆసుపత్రుల్లోని ఔషధాల నిల్వలను రియల్‌టైంలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది.

మాస్కులు లేకుండా పనిచేస్తున్నట్లు

షెల్టర్‌హోంను సందర్శించినప్పుడు అక్కడ ప్రభుత్వం ద్వారా భోజనం, ఇతర రోజువారీ వస్తువుల పంపిణీ జరుగుతున్నట్లు గమనించింది. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా ఫుడ్‌ కియోస్క్‌ల వివరాలు తెలుసుకొనే వెసులుబాటు ఉన్నట్లు గుర్తించింది. చాలాచోట్ల లాక్‌డౌన్‌ మంచి ఫలితాలు చూపినట్లు వివరించింది. అందులో కమ్యూనిటీ లీడర్ల పాత్ర కూడా ఉన్నట్లు పేర్కొంది. చాలా ప్రదేశాల్లో వ్యక్తిగత దూరం పాటిస్తున్నారు. అయితే కొన్ని నిర్మాణ స్థలాల్లో కార్మికులు మాస్కులు లేకుండా పనిచేస్తున్నట్లు కేంద్ర బృందం గమనించింది. దానిపై వెంటనే దృష్టిసారించాలని స్థానిక అధికారులను ఆదేశించింది. కార్మికులందరికీ నిర్ణీత సమయంలో వైద్యపరీక్షలు జరిపించాలని కూడా కేంద్ర బృందం నిర్దేశించింది’ అని ఆమె పేర్కొన్నారు.

నగరంలో విస్తృత పర్యటన

సుల్తాన్‌బజార్‌, వనస్థలిపురం, నల్లకుంట, న్యూస్‌టుడే: కేంద్ర బృందం నగరంలో ఆరో రోజైన గురువారం విస్తృతంగా పర్యటించింది. జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్‌ బరోకా ఆధ్వర్యంలో సభ్యులు కోఠి మెటర్నటీ ఆసుపత్రి, నల్లకుంట ఫీవరాసుపత్రిని, ఎల్బీనగర్‌ జోన్‌లోని ఉప్పల్‌ నైట్‌ షెల్టర్‌, మార్కెట్‌ను సందర్శించారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలను ఆరా తీశారు. చింతల్‌కుంట, వనస్థలిపురం ఇంజినీర్స్‌ కాలనీల్లోని కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వలస కూలీలతోనూ మాట్లాడారు. తమను సొంతూళ్లకు పంపాలని ఈ సందర్భంగా కూలీలు కోరారు. బృందంలో కేంద్ర ప్రజారోగ్యశాఖ సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ చంద్రశేఖర్‌ గెడం, జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ చతుర్వేది ఉన్నారు.

రాజధానిలో కార్పొరేషన్‌ వారు మొబైల్‌ క్యాంటీన్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమాలు, నైట్‌షెల్టర్లలో ఉండే వారితో పాటు అనాథలు, ట్రాన్స్‌జెండర్లకూ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో రోగులకు ఉచిత వైఫై కూడా అందుబాటులో ఉంచారు. కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలోని కొన్నివార్డుల్లో అటాచ్‌డ్‌ మరుగుదొడ్లు లేవు. అందువల్ల అలాంటి వార్డుల్లో రోగులను ఉంచొద్దు.

- కేంద్ర బృందం

ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.