ETV Bharat / state

'రజాకార్ల వారసులు, నిజాం వారసులు.. తెలంగాణను ముంచుతున్నారు..'

author img

By

Published : May 27, 2022, 7:09 PM IST

Updated : May 28, 2022, 6:00 AM IST

Kishan Reddy on KCR: గ్రామపంచాయతీలకు కేంద్రం ఎంత.. రాష్ట్రం ఎంత ఇచ్చిందో సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్​ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బెంగళూరుకు వెళ్లి దేశ మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి రెండు నెలల్లో సంచలనం సృష్టిస్తామని వ్యాఖ్యలు చేశారని.. ఇలా గతంలో కూడా చేశారని ఆయన ఎద్దేవా చేశారు. రజాకార్ల వారసులు, నిజాం వారసులు కలిసి తెలంగాణను ముంచుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని పేర్కొన్నారు.

'రజాకార్ల వారసులు, నిజాం వారసులు.. తెలంగాణను ముంచుతున్నారు..'
'రజాకార్ల వారసులు, నిజాం వారసులు.. తెలంగాణను ముంచుతున్నారు..'

Kishan Reddy on KCR: తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్న వారినే గెలిపించారని.. వందల కోట్లు ఖర్చు చేసినా సరే ప్రజలు అనుకున్న వారికే ఓట్లు వేశారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని.. భాజపాపై తెరాస ఎంత విషం చిమ్మినా ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరన్నారు. ఎస్సీ సమాజానికి కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం వారిని సీఎం చేస్తారా అంటూ ప్రశ్నించారు. సిద్ధాంతపరంగా కుటుంబ రాజకీయాలకు భాజపా వ్యతిరేకమని.. ప్రధానంగా కుటుంబ పార్టీలను వ్యతిరేకిస్తున్నామన్నారు. కుటుంబ పార్టీలు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి మండిపడ్డారు.

గతంలో కూడా ఇలాగే: ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బెంగళూరుకు వెళ్లి దేశ మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి రెండు నెలల్లో సంచలనం సృష్టిస్తామని వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వెల్లడించారు. ఇలా సీఎం గతంలో కూడా ప్రళయం సృష్టిస్తా, భూకంపం సృష్టిస్తా, భాజపాని బంగాళాఖాతంలో కలపాలి అని ఎన్నో వ్యాఖ్యలు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. గుణాత్మక మార్పు అన్నారు.. ముందు వారి పార్టీలో గుణాత్మక మార్పు రావాలని కిషన్​రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు.. అదే కేసీఆర్ నెలకు 18 గంటలు పని చేస్తారని విమర్శలు గుప్పించారు.

"తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. 8 ఏండ్లలో తెలంగాణను దోచుకుంది సరిపోదా?.మీలో గుణాత్మకమైన మార్పు లేకుండా మార్పు సాధ్యమా. మీలో మార్పు రాకపోవచ్చు.. కానీ ప్రజలు దాన్ని మారుస్తారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకి పట్టం కడతారు. కేసీఆర్ భాజపాపై ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్​కు సంబంధించిన మీడియా భాజపాపై బూటకపు వార్తలు రాస్తోంది. మాది గుజరాత్ పార్టీ అంటారా?. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ మాది. భాజపాలో అధ్యక్షుడికి 2 దఫాలుగా మాత్రమే అవకాశం ఉంటుంది.. కానీ మీ పార్టీలో సర్వం మీరే. జేపీ నడ్డా, ప్రధాని మోదీ తరువాత వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఉండరు. ఇలా మీకు చెప్పే దమ్ముందా?. ఇదేమైనా రాజుల రాజ్యమా?. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు జీపీఏ రాసిచ్చారా. కల్వకుంట్ల కుటుంబానికి శాపం ఉన్నట్లుంది. నిజం చెబితే 1000 ముక్కలు అవుతుందనే శాపం ఉంది అనుకుంటా. అందుకే వారు నిజం చెప్పడానికి భయపడుతున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇవ్వకుండానే ఇంత అభివృద్ధి సాధ్యమైందా." -కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి

చర్చకు సిద్ధమా?: కేసీఆర్ కొడుకు అమెరికా వెళ్లి డబ్బు సంపాదించి తెలంగాణ ప్రజలకు ఖర్చు పెడుతున్నట్లుగా భావిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. గ్రామపంచాయతీలకు కేంద్రం ఎంత.. రాష్ట్రం ఎంత ఇచ్చిందో సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సవాల్​ విసిరారు. రాష్ట్రంలో బస్తీ దవాఖానాకు ఇస్తున్న నిధుల్లో కేంద్ర వాటా లేదా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చింది నిజం కాదా అని ఆయన అన్నారు. గుణాత్మకమైన మార్పు మీ ప్రభుత్వానిదా.. మా ప్రభుత్వానిదా అంటూ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్​పై ఒక్క రూపాయి కూడా తగ్గించని మీరు.. మాపై విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. కేసీఆర్ కూతలకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. ఒకరు రజాకార్ల వారసులు.. ఇంకొకరు నిజాం వారసులు.. ఇద్దరూ కలిసి తెలంగాణను ముంచుతున్నారు. మజ్లీస్ నేతలు రజాకార్ల వారసులు. కాంగ్రెస్ ప్రభుత్వం 7 మండలాలను ఏపీలో కలిపితే ఎందుకు అడ్డుకోలేదు. కేసీఆర్ వెళ్లి కుటుంబ సభ్యులతో సహా సోనియా గాంధీ కాళ్లు ఎందుకు మొక్కారు. ఎరువుల కర్మాగారం తెలంగాణకు ఇచ్చింది కేంద్రం కాదా.. శంకుస్థాపన చేసింది మోదీ.. ప్రారంభించింది కూడా మోదీనే. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారో చెప్పండి.. ఉన్నవాటి పేర్లు మార్చడం తప్పా ఏమీ చేయలేదు. మెట్రో మీరు కట్టించారా." -కిషన్​ రెడ్డి, కేంద్రమంత్రి

కేసీఆర్​కు భయం పట్టుకుంది: రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ వేగంగా చేస్తే రైల్వే లైన్ల అభివృద్ధి, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్​ అభివృద్ధి, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. తెరాస పార్టీకి చెందిన నేతలు కోట్ల రూపాయలు దాచుకుంటారు.. కానీ ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు భూమి మాత్రం కేటాయించరని ఆయన ఆరోపించారు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతి నుంచి జారిపోతుందేమోనని కేసీఆర్​కు భయం పట్టుకుందన్నారు. ఆ భయంతోనే ప్రళయాలు, సంచలనాలు, భూకంపాలు సృష్టిస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం వల్లే వచ్చినట్లు ఫీల్ అవుతున్నారని ఆయన విమర్శించారు.

ప్రజా సమస్యలను చెప్పుకుందామన్నా జేఏసీ, మేధావులు, ప్రజలను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కిషన్​రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలోనే సచివాలయం లేని రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రం అంటూ ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్​కు రాని వ్యక్తి ఎందుకు కూలగొట్టారో సమాధానం చెప్పాలన్నారు. తాము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదన్న ఆయన.. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని వెల్లడించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు తెచ్చినట్లు చెబుతున్నారని.. వాస్తవానికి స్విట్జర్లాండ్ అధికారులతో తాము ముందుగానే చర్చలు కూడా జరిపామన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 28, 2022, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.