ETV Bharat / state

పార్లమెంట్​లో అదానీ అంశంపై రగడ.. సమావేశాలు బహిష్కరించిన బీఆర్​ఎస్​, ఆప్‌

author img

By

Published : Feb 8, 2023, 12:49 PM IST

BRS MPs Boycotts Parliament Sessions: వరసగా రెండోరోజు బీఆర్​ఎస్, ఆప్ ఎంపీలు పార్లమెంటు సమావేశాలు బహిష్కరించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ, సీజేఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఉభయ సభల్లో బీఆర్​ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు తిరస్కరించడంతో నిరసన బాట పట్టారు. కేంద్రప్రభుత్వం స్పందించకపోవడంతోనే సభను బహిష్కరిస్తున్నట్లు ఎంపీలు వెల్లడించారు.

Parliament Sessions
Parliament Sessions

BRS and AAP MPs Boycotts Parliament Sessions: అదానీ వ్యవహారంపై చర్చ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ... బీఆర్​ఎస్ ఎంపీలు పార్లమెంటు వద్ద ఆందోళనకు దిగారు. వరుసగా రెండో రోజు ఆప్‌ సభ్యులతో కలిసి పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారు. అదానీ సంస్థల వ్యవహారంపై చర్చించాలంటూ లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇస్తూ వస్తున్న బీఆర్​ఎస్..... సభాపతులు చర్చను అనుమతించకపోవటంతో నిరసన బాట పడుతున్నారు.

ప్రభుత్వ తీరును నిరసిస్తూ.... పార్లమెంటు ఆవరణలో బీఆర్​ఎస్, ఆప్​ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బీఆర్​ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేకే, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఎంపీలు సురేశ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత, బీబీ పాటిల్‌ సహా మిగతా ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ లేదంటే సీజేఐతో విచారణ జరిపించాలని బీఆర్​ఎస్ పార్లమెంటు సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం స్పందించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు ఎంపీలు వెల్లడించారు.

BRS MPs boycotts President speech in parliament : బీఆర్​ఎస్​, ఆమ్​ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేసిన వైఫల్యాలకు నిరసనగానే తాము ఈ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు బీఆర్​ఎస్​ ఎంపీలు ప్రకటించారు. తెలంగాణ, దిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారాయన్న బీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు.. వీటిని దేశ ప్రజల ముందు పెట్టేందుకే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

రాష్ట్రపతి ప్రసంగంలో మహిళాబిల్లు ప్రస్తావన ఏదని బీఆర్​ఎస్ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్‌ పేరు, రైతులకు ఎంఎస్‌పీ వంటి అంశాలు ప్రస్తావనకు రాకపోవడం బాధాకరమని నామా నాగేశ్వరరావు అన్నారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ షేర్లు పడిపోవడానికి కారణాలపై ఉభయ సభల్లో చర్చించాల్సి ఉందన్నారు.

తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రధాన అంశాలను పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణపై కుట్రలను పార్లమెంట్‌లో ఎండగడతామని ఎంపీలు తెలిపారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెంపు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతుల ఆదాయం రెట్టింపుపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.