ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉత్కంఠ.. నేడు ఆ నలుగురూ వచ్చేనా..!

author img

By

Published : Nov 21, 2022, 6:49 AM IST

MLAs Poaching Case Update
MLAs Poaching Case Update ()

MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోశ్​ సహా నలుగురు కీలక అనుమానితులను నేడు విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సంతోశ్​తో పాటు కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామి, కేరళలోని భారత్​ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్​ వెల్లాపల్లి, కరీంనగర్​ న్యాయవాది బూసారపు శ్రీనివాస్​కు సిట్​ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో వీరి వాంగ్మూలాలు కీలకమని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

MLAs Poaching Case Update: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారంలో సిట్ ఎదుట బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోశ్​, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్​ విచారణకు హాజరుకానున్నారు. వీరి విచారిస్తే కొత్త విషయాలేమైనా వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా సంతోశ్​ విచారణకు రావాల్సి ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నలుగురిలో ఎవరెవరు సిట్​ ముందుకు వస్తారనేది తేలాల్సి ఉంది. ఈ నెల 29లోపు కేసు దర్యాప్తులో పురోగతిని హైకోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో కీలక ఆధారాల్ని సేకరించాలని సిట్​ భావిస్తోంది.

ప్రణాళిక సిద్ధం..: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్​ రోహిత్​రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్​ రెడ్డిలను బీజేపీలో చేరాలంటూ ప్రలోభపెట్టేందుకు యత్నించారనే అభియోగాలపై గత నెల 26న రామచంద్రభారతి, సింహయాజీ, నంద కుమార్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిని విచారించిన క్రమంలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నలుగురికి నోటీసులు జారీ చేశారు. వీరికి సంధించేందుకు ప్రశ్నావళిని సిట్ ఇప్పటికే రూపొందించింది. మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో మంతనాలు సాగించిన రోజు రామచంద్రభారతి.. తన ఫోన్​ నుంచి తుషార్​తో మాట్లాడారు. పైలట్​ రోహిత్​రెడ్డితోనూ మాట్లాడించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అంశంలో తుషార్​కు గల సంబంధంపై విచారించనున్నారు.

లోతుగా ఆరా..: రామచంద్రభారతి ఫోన్​ నుంచి 'సంతోశ్​ బీజేపీ' పేరిట ఉన్న నంబర్​కు మెసేజ్​లు వెళ్లాయి. వాటిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన సమాచారం ఉంది. అయితే సంతోశ్​ తిరిగి సమాధానం ఇచ్చినట్లు లేదు. ఈ మెసేజ్​ల గురించి సంతోశ్​ను ఆరా తీయనున్నారు. సింహయాజీ తిరుపతి నుంచి హైదరాబాద్​కు వచ్చేందుకు న్యాయవాది శ్రీనివాస్​ విమాన టికెట్​ బుక్​ చేసినట్లు ఆరోపణలున్నాయి. సింహయాజీకి టికెట్​ బుక్​ చేయాల్సిన అవసరమేముంది? ఆయనతో సంబంధమేంటన్న అంశంపై ప్రశ్నించనున్నారు. రామచంద్ర భారతికి తుషార్​ను పరిచయం చేసింది డాక్టర్​ జగ్గుస్వామి అని చెబుతున్నారు. తుషార్, జగ్గుస్వామి ఇద్దరూ కేరళవాసులే కావడంతో కుట్రలో వీరి ప్రమేయంపై విచారించనున్నారు. రామచంద్ర భారతి సంభాషణల్లో నంబర్ 1, నంబర్ 2 అంటూ ప్రస్తావన ఉంది. వారెవరనే స్పష్టత కోసం సిట్ ఆరా తీస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.