ETV Bharat / state

'మా నౌకరీలు మాగ్గావాలే'.. కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే: బండి సంజయ్

author img

By

Published : Mar 25, 2023, 5:11 PM IST

Updated : Mar 25, 2023, 7:36 PM IST

Bandi Sanjay Fires on cm kcr బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి కేసీఆర్‌పై మండిపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద చేపట్టిన బీజేపీ దీక్ష ముగిసింది. ఈ ధర్నాలో పాల్గొన్న బండి.. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లపై మండిపడ్డారు.

Bjp
Bjp

'మా నౌకరీలు మాగ్గావాలే'.. కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే: బండి సంజయ్

Bandi Sanjay Fires on cm kcr ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన నిరుద్యోగుల మహా ధర్నాలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ.. 'మా నౌకరీలు మాగ్గావాలే' నినాదంతో ఇందిరా పార్కు ధర్నాచౌక్ వేదికగా ధర్నా నిర్వహించారు.

'' యూనివర్సిటీలు పశువుల కొట్టాలలాగా మారిపోయాయి. 30 లక్షల మంది యువకుల గురించి మాట్లాడని కేసీఆర్... రాహుల్ గాంధీ కోసం బ్లాక్ డే అంటాడా? రెండు నెలల నుండి బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయింది. అన్ని యూనివర్సిటీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడండి. ఎన్నికలు దగ్గర పడితేనే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తామని అంటారు. నాకు, రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. కేటీఆర్‌కి నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత వరకు సిట్ దర్యాప్తు చేసిన కేసులు ఏమయ్యాయి? '' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ధైర్యం సిట్‌కు లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. నయీం కేసులో వేసిన సిట్‌ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌ కేసు, మియాపూర్‌ భూములపై వేసిన సిట్‌ ఏమైందో సీఎం కేసీఆర్‌ చెప్పాలని ధ్వజమెత్తారు. లీకేజ్‌ కేసులో పెద్దపెద్ద వాళ్లను వదిలేసి చిన్నవాళ్లను అరెస్టు చేశారని మండిపడ్డారు.

''టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ సభ్యులకు నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? కేసీఆర్ 30 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు. ఏ శాఖలో ఏం జరిగినా కేటీఆర్ ఎందుకు స్పందిస్తారు? కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి లాగా తయారయ్యారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని కాపాడడం కోసమే కేబినెట్ పనిచేస్తోంది. 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకమై కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమివేయాలి. బీజేపీ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం. కేసీఆర్‌కి ఎందుకు భయపడుతున్నాం?'' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

లీకేజ్‌లు సర్వసాధారణమే అన్న మంత్రికి నోటీసు ఎందుకు ఇవ్వటం లేదని ఫైర్ అయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజ్‌కు కారణం మంత్రి కేటీఆర్‌ నిర్వాకమే కారణమని ఆరోపించారు. అన్నింటిపైనా సీఎం స్పందించట్లేదు, సీఎం కుమారుడు మాత్రమే స్పందిస్తారని ఎద్దేవా చేశారు. లిక్కర్‌ కేసు నుంచి కవితను కాపాడేందుకే మంత్రివర్గం పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావటం ఖాయమన్న బండి సంజయ్... ఏప్రిల్‌ 2 నుంచి 6 వరకు ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తామన్నారు.

''అన్ని యూనివర్సిటీల్లో బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ పర్యటిస్తుంది. పది ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. ఏప్రిల్ 2 నుంచి నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. తెలంగాణ బందుతో కేసీఆర్‌కి సెగ తలిగిస్తాం. టీఎస్‌పీఎస్సీ విషయంలో ఎవరు ఉద్యమించినా భాజపా సహకరిస్తుంది. అర్ధరాత్రి నా కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. లీకేజీ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేద్దాం రండి.'' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా... కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. నిజాయితీగా చదువుకుంటే ఉద్యోగం రాదనే స్థితికి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ప్రశ్నపత్రం లీకేజీతో నిరుద్యోగ యువత ఆర్నెళ్ల సమయం, శ్రమవృథా అయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు విమర్శించారు. ప్రభుత్వం ఒక్కొక్క నిరుద్యోగికి లక్ష లేదంటే నాలుగేళ్ల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిట్‌తో కాకుండా నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని భాజపా నేతలు కోరారు.

ఇవీ చూడండి:

Last Updated :Mar 25, 2023, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.