ETV Bharat / state

కేసీఆర్ లేకపోతే.. కేటీఆర్​ను ఎవరూ లెక్కచేయరు : బండి సంజయ్

author img

By

Published : Feb 25, 2023, 9:03 AM IST

Updated : Feb 25, 2023, 9:24 AM IST

BJP state president Bandi Sanjay
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

Bandi Sanjay latest comments on KTR : రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ చేపట్టిన కార్నర్‌ మీటింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా పలుచోట్ల సమావేశాల్లో బండి సంజయ్‌ పాల్గొన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో ఈ మాత్రం అభివృద్ధి జరుగుతుందన్న ఆయన అన్నారు. దీనిపై చర్చకు కేటీఆర్‌ సిద్ధమా అని ప్రశ్నించారు. వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.

ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో కేసీఆర్​పై విమర్శలు చేసిన బీజేపీ నేతలు

Bandi Sanjay latest comments on KTR : మరికొన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ సమరభేరీలో కాషాయజెండా ఎగురవేయటమే లక్ష్యంగా కమలదళం విస్తృత కార్యక్రమాలు చేపడుతోంది. వీధి సభలు, స్వశక్తికరణ్‌లాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలుచోట్ల నిర్వహించిన వీధి సభల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. హన్మకొండలోని కేయూ క్రాస్ రోడ్డుతో పాటు వర్ధన్నపేటలో జరిగిన వీధిసభలో ప్రసంగించిన బండి సంజయ్‌ అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమం: భూపాలపల్లి జిల్లా కాటారంలో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో పార్టీ నేత వివేక్‌తో కలిసి బండి సంజయ్‌ పాల్గొన్నారు. చంద్రుపట్ల సునీల్‌రెడ్డి 20 రోజులుగా చేస్తున్న ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. సింగరేణి నిధులు ఏటీఎంగా వాడుకున్నారని కాళేశ్వరంలో వేల కోట్ల దోపిడీ చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. కేసీఆర్​ పోరాటంతోనే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవొచ్చిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి భగ్గుమన్నారు.

ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమం: మద్యం దందాలో మాత్రమే తెలంగాణను కేసీఆర్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో "ప్రజా గోస - బీజేపీ భరోసా" కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం సాధ్యపడదని ఆనాడే తాను కేసీఆర్‌కు చెప్పానని ఈటల అన్నారు. ఆయన గొప్పలకు పోయినందునే నేడు పేదల కల నెరవేరని పరిస్థితి నెలకొందన్నారు. అబ్కారీ శాఖను మద్యం తాగించే శాఖగా మార్చారని ఈటల ఆరోపించారు. ఆ ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు.

మహబూబ్‌నగర్‌లో కార్నర్ సమావేశం: పాలమూరు-రంగారెడ్డి పూర్తిచేయలేక కేసీఆర్‌ కేంద్రంపై బురద జల్లుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లిలో జరిగిన కార్నర్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కాళేశ్వరం మాదిరిగా పాలమూరు ప్రాజెక్ట్‌ను చేపడుతామంటున్న కేటీఆర్‌ ఈ 9 ఏళ్లు ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీటిని అందించి తీరుతామన్నారు. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్‌ ముఖ్యమంత్రి కుమార్తె త్వరలోనే తీహార్ జైలుకు వెళ్తుందని జోస్యం చెప్పారు.

బీఆర్​ఎస్​కు ఓటమి భయం పట్టుకుంది:బండి సంజయ్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలో నిర్వహించిన 'ప్రజా గోస - భాజపా భరోసా' కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నేతల తీరును బండి సంజయ్‌ ఖండించారు. కార్యక్రమానికి హాజరైన వివేక్‌పై దాడికి యత్నించి, మీడియా సంస్థ వాహనాన్ని ధ్వంసం చేయటం అధికార పార్టీ ఆగడాలకు నిదర్శనమన్నారు. బీఆర్​ఎస్​కు ఓటమి భయం పట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

"కేటీఆర్ తన తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారు. లేదంటే ఆయణ్ను ఎవరూ లెక్కచేయరు. కేటీఆర్​లాగా కాదు.. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మావోయిష్ఠులపై మొదటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్న పార్టీ బీజేపీ పార్టీ."- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated :Feb 25, 2023, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.