ETV Bharat / state

ఈసారి బాలాపూర్ లడ్డూ ధరెంత..?

author img

By

Published : Sep 11, 2019, 3:42 PM IST

బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటకు పాతికేళ్లుగా ప్రత్యేకత ఉంది. గతేడాది రికార్డు స్థాయిలో 16 లక్షల 60 వేల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూకు.. ఈసారి కూడా పోటీ ఎక్కువగా ఉంటుందని ఉత్సవ సమితి భావిస్తోంది. స్థానికులతో పాటు రైతులు, వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు ఈ వేలం పాటలో పోటీపడుతున్నారు.

ఈసారి బాలాపూర్ లడ్డూ ధరెంత..?

ఈసారి బాలాపూర్ లడ్డూ ధరెంత..?

హైదరాబాద్​లో వినాయక ఉత్సవాల్లో ఎప్పుడు హాట్​ టాపిక్​గా ఉండేవి రెండు అంశాలు. ఒకటి ఖైరతాబాద్ గణేష్ ఎత్తుపై అయితే మరొకటి బాలాపూర్ లడ్డు ధర. ఎంతో పేరున్న బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఉత్సవ సమితి సర్వం సిద్ధం చేస్తోంది.

పోటా పోటీ
బాలాపూర్ లడ్డూ వేలం ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం కానుంది. ఈ ఏడాది వేలం పాట కోసం ఇప్పటికే 18 మంది శాశ్వత సభ్యులతో పాటు ఐదుగురు స్థానికులు, మరో 5 మంది స్థానికేతరులు పేర్లు నమోదు చేసుకున్నారు. రేపు ఉదయం ఐదున్నర గంటలకు చివరి పూజ పూర్తైన అనంతరం బాలాపూర్ గణేశుడు గ్రామ ఊరేగింపునకు బయల్దేరుతాడు. ఆ తర్వాత బొజ్జగణపయ్య గ్రామ ముఖ్యకూడలిలోని బొడ్రాయి వద్దకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చేరుకుంటాడు. అప్పుడు లంబోదరుడి చేతిలో ఉన్న లడ్డూ వేలంపాట ప్రారంభిస్తారు.

1994లో మొదలైన లడ్డూ వేలం పాట
గ్రామాభివృద్ధి కోసం మొదలు పెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ గ్రామ రూపురేఖలను మార్చివేసింది. మొదట 1994లో 450 రూపాయలతో వేలం పాట ప్రారంభమైంది. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను అందుకున్నారు. గతేడాది స్థానికేతరుడైన తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందల, వేలు దాటి రికార్డు స్థాయికి చేరింది.

బాగా కలిసి వస్తుండటమే కారణం..
లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతో పాటు వ్యాపారం బాగా కలిసి వస్తుండటం వల్ల ప్రతి ఏటా తీవ్రమైన పోటీ నెలకొంటోంది. గతేడాది 16 లక్షలు దాటిన బాలపూర్ లడ్డూ.. ఈసారి 20 లక్షల్లోపే పలకవచ్చని ఉత్సవ సమితి సభ్యులు భావిస్తున్నారు. స్థానికులు, స్థానికేతరులకు మధ్య జరుగుతున్న పోటీల్లో గత మూడేళ్లుగా లడ్డూ స్థానికేతరులకు దక్కుతుండటంతో ఈసారి అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

దేశ విదేశాల్లోనూ బాలాపూర్ లడ్డూ వేలం పాటకు విశేషమైన ఆదరణ ఉంది. ఈసారి కూడా వేల సంఖ్యలో వేలంపాటను వీక్షించేందుకు భక్తులు తరలిరానున్నారు. లడ్డూ వేలంపాట పూర్తైన ఆనంతరం భక్తులు ఆనందోత్సాహాలతో బాలాపూర్ గణేశుడి శోభయాత్ర 18 కిలోమీటర్ల పొడవునా ట్యాంక్ బండ్ వైపునకు సాగనుంది.

ఇదీ చూడండి : 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.