ETV Bharat / state

Telugu Akademi FD Scam Updates: తెలుగు అకాడమీ కుంభకోణంపై ఆడిట్‌ శాఖ విచారణ

author img

By

Published : Oct 27, 2021, 10:06 AM IST

Telugu Akademi FD Scam Updates, Telugu Akademi FD Scam news
తెలుగు అకాడమీ కుంభకోణంపై ఆడిట్‌ శాఖ విచారణ, తెలుగు అకాడమీ కుంభకోణం వార్తలు

తెలుగు అకాడమీ కుంభకోణంపై ఆడిట్‌ శాఖ విచారణ జరపనుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన రూ.64.5 కోట్ల ఎఫ్‌డీల కుంభకోణంలో ఇప్పటికే పది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆడిట్‌శాఖను ఆదేశించింది.

తెలుగు అకాడమీలో ఫిక్సెడ్‌ డిపాజిట్ల(FD) కుంభకోణంపై సమగ్ర విచారణ బాధ్యతను ప్రభుత్వం రాష్ట్ర ఆడిట్‌ శాఖకు అప్పగించింది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన రూ.64.5 కోట్ల ఎఫ్‌డీల కుంభకోణంలో ఇప్పటికే పది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కుంభకోణానికి దారితీసిన పరిస్థితులు, తెలుగు అకాడమీలో సంస్థాగతంగా ఉన్న లోపాలతో పాటు వివిధ అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆడిట్‌శాఖను ఆదేశించింది. డిపాజిట్లను స్వాహా చేసేందుకు అనుకూలించిన పరిస్థితులతో పాటు తనిఖీ విభాగాల వైఫల్యాలు, ఆర్థిక అంశాలను ఆడిట్‌ శాఖ సమగ్రంగా పరిశీలించనుంది. సంస్థలో గత కొన్నేళ్లుగా జరిగిన ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్‌ చేయనున్నారని తెలిసింది.

పోలీసుల విచారణ

బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తెలుగు అకాడమీ డిపాజిట్లను దొంగదారిన విత్ డ్రా చేసుకున్న నిందితులు ఆ డబ్బును పప్పు, బెల్లాల్లా పంచుకున్నారు. యూబీఐ కార్వాన్, సంతోష్ నగర్ ఖాతాల్లో రూ.54.5 కోట్లు.. చందానగర్​లోని కెనరా బ్యాంకులో ఉన్న రూ.10 కోట్లను కొల్లగొట్టిన ముఠా సభ్యులు మొత్తం రూ.64.5 కోట్లు వాటాలుగా పంచుకున్నారు. ఇందులో అధిక వాటా తీసుకున్న వెంకటసాయి కుమార్ హైదరాబాద్ బాహ్యవలయ రహదారికి పక్కన 35 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. దుబాయి నుంచి తక్కువ ధరకు డీజిల్ వచ్చేలా ఏజెన్సీ ఇప్పిస్తానంటే ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు సీసీఎస్ పోలీసులకు తెలిపారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీకి వచ్చిన రూ.2.5 కోట్ల డబ్బులతో ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన కూడా 2 కోట్ల రూపాయలు తీసుకొని ఫ్లాట్లు కొనుగోలు చేసింది. కొంత నగదు ఉందని దాన్ని వెనక్కి తిరిగిచ్చేస్తామని పోలీసులకు తెలిపారు. మరో నిందితుడు వెంకటేశ్వర్ రావు రూ.3 కోట్లు తీసుకొని సత్తుపల్లిలో బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ శాఖల్లోని డబ్బులను డిపాజిట్ల పేరుతో కొల్లగొట్టేందుకు కృష్ణారెడ్డి, సాయికుమార్ కలిసి ముఠా ఏర్పాటు చేసి కథ నడిపించినట్లు పోలీసులు తేల్చారు.

అంజనీకుమార్‌ ప్రెస్​మీట్

సంచలనం రేపిన తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల స్వాహా (TELUGU ACADEMY FD SCAM )కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు జరిపిన సీసీఎస్‌ పోలీసులు పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బ్యాంకు ఏజెంట్లతో కుమ్మకై అకాడమీ అకౌంట్స్‌ ఇంఛార్జి రమేశ్​, బ్యాంకు అధికారులు కోట్ల రూపాయల అకాడమీ నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. స్వాహా చేసిన నిధులతో కొందరు ఆస్తులు కొనుగోలు చేయగా.. మరికొందరు వడ్డీ వ్యాపారం మొదలు పెట్టారు. పాత నేరస్తుడు సాయికుమార్​ ఈ వ్యవహారంలో తెర వెనుక ఉండి మొత్తం కథ నడిపించాడు. కొల్లగొట్టిన నగదులోనూ అధిక శాతం ఇతనే తీసుకున్నట్టు పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఈ కేసులో మొత్తం 64.5 కోట్లు నిధులు గోల్​మాల్​ అయినట్లు గుర్తించామని సీపీ తెలిపారు.

ఇదీ చదవండి: KTR Tour in France: పోలండ్‌ పెట్టుబడులకు ప్రోత్సాహం.. నేటి నుంచి ఫ్రాన్స్​లో కేటీఆర్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.