ETV Bharat / state

కాళేశ్వరానికి అసలేమైంది, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 8:54 AM IST

Annaram Saraswati Barrage Leakage
Annaram Saraswati Barrage Leakage

Annaram Saraswati Barrage Leakage : అన్నారం బ్యారేజీలో రెండు చోట్ల బుంగలు ఏర్పడ్డాయి. వీటిని గుర్తించిన ఇంజినీర్లు.. ఆ ప్రాంతంలో రింగ్‌బండ్ వెేస్తున్నారు. ఈ సీపేజీ వల్ల బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని బ్యారేజీ ఈఈ యాదగిరి తెలిపారు. మరోవైపు ఈ విషయంపై కేంద్ర జలసంఘం వివరాలు కోరింది.

Annaram Saraswati Barrage Leakage : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజీ దిగువన సీపేజీ(బుంగలు) ఏర్పడ్డినట్లు అధికారులు గుర్తించారు. ఎండ్‌సీల్‌ ప్రాంతంలో పలు చోట్ల నీటి బుంగలు వచ్చాయని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యారేజీకి సంబంధించి బ్లాక్‌ బి-4లోని 38, 42 పియర్‌ల వద్ద వెంట్‌ ప్రదేశాలలో రెండు రోజుల క్రితం అవి ప్రారంభం అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

రెండు చోట్ల అవి ఎక్కువగా ఉండటంతో ఇంజినీర్లు తగిన చర్యలు చేపట్టారు. వాటిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా రింగ్‌బండ్‌ వేస్తున్నామని చెప్పారు. రెండు చోట్ల రెండు మూడు అంగుళాల మేర సీపేజీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇసుక తేలకపోవడంతో ప్రమాదం లేదని వారు వివరించారు. నాటు పడవల ద్వారా సీపేజీ ఏర్పడిన ప్రాంతాలకు చేరుకొని ఇసుక సంచులు, రాళ్లతో అడ్డుకట్ట వేశారు. సుమారుగా 2,000 బస్తాలను అలా వేసినా ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. అధికారులు పనులను కొనసాగిస్తున్నారు.

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు.. నెల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తాం'

రెండు సంవత్సరాల క్రితం కూడా...

Seepage at Two Places in Annaram Barrage : ఇది పైపింగ్‌ ప్రారంభ దశని.. దీనిని గుర్తించకపోతే దిగువన ఇసుక క్రమంగా తరలి వెళ్తుందని డిజైన్లలో అనుభవం ఉన్న సీనియర్ ఇంజినీర్ తెలిపారు. పియర్స్‌ కుంగిపోవడం, నష్టం వాటిల్లడం జరుగుతుందని పేర్కొన్నారు. మేడిగడ్డలో ఇలాగే జరిగి ఉండొచ్చని అయితే అన్నారంలో వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం ప్రారంభించడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదని ఆయన అన్నారు.

రెండు సంవత్సరాల క్రితం కూడా అన్నారంలో ఇలాంటి సమస్య వచ్చిందని.. అప్పుడు సీపేజీ ఎక్కువ ఉండటంతో పాటు కొద్దిగా ఇసుక కదలడం కూడా గుర్తించి వెంటనే కెమికల్‌ గ్రౌటింగ్‌ చేశామని సంబంధింత ఇంజినీర్లు తెలిపారు. ఇందుకోసం కోటిన్నర రూపాయలు ఖర్చయిందని పేర్కొన్నారు. మరోవైపు నాలుగు రోజులుగా బ్యారేజీలో నీటి నిల్వను క్రమక్రమంగా తగ్గించారు.

అన్నారం బ్యారేజీ దిగువన పైపింగ్‌లాంటి పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం అందిన నేపథ్యంలో దానిపై నివేదిక పంపాలని కేంద్ర జల సంఘం.. తెలంగాణ డ్యాం సేఫ్టీ అధికారులకు తెలిపింది. అన్నారం, సుందిళ్ల కూడా మేడిగడ్డ బ్యారేజీలాంటి డిజైన్‌ అయినందున అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కూడా ఈ లేఖను పంపింది.

Opposition on Medigadda Project Issue : "మేడిగడ్డ బ్యారేజీపై సమగ్ర విచారణ జరిపించాలి"

సీపేజీ వల్ల అన్నారం బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం కానీ, నష్టం కానీ లేదని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు యాదగిరి తెలిపారు. నీటితో పాటు ఇసుక వస్తే ప్రమాదమని, అలాంటి పరిస్థితులు లేవని పేర్కొన్నారు. బ్యారేజీ నిర్వహణలో భాగంగానే పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అనంతరం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. పరిమితికి లోబడే సీపేజీ ఉందని ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని ఈఈ యాదగిరి వివరించారు.

ప్రతి సంవత్సరం సహజంగానే నిర్వహణ పనులు చేపడతామని యాదగిరి తెలిపారు. బ్యారేజీలో రెండు చోట్ల సీపేజీ ఉందని.. కానీ ఎక్కడా ఇసుక రావడం లేదని చెప్పారు. దీని నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థ ఆప్కాన్స్‌దే అని స్పష్టం చేశారు. సీపేజీ ఉన్నచోట నీళ్లు తగ్గినప్పుడు కంకర, ఇసుక, ఫిల్టర్‌ మీడియా వేస్తున్నామని, ఇసుకతో రింగ్‌బండ్‌ కూడా వేస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైతే కెమికల్‌ గ్రౌటింగ్‌ కూడా చేస్తామని ప్రకటనలో ఈఈ యాదగిరి వెల్లడించారు.

Political Parties on Medigadda Barrage Issue : 'మేడిగడ్డ'పై రాజకీయ రగడ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విపక్షాల ఫైర్‌

"చిన్న విషయానికే ట్విటర్​లో స్పందించే కేసీఆర్​ కుటుంబం.. మేడిగడ్డ విషయంలో ఎందుకు స్పందించదు?"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.