ETV Bharat / state

కొవిడ్​ బాధితులను దారిలోనే నిలువుదోపిడీ చేస్తున్న అంబులెన్సులు

author img

By

Published : May 14, 2021, 5:01 PM IST

Telangana news
అంబులెన్సులు

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాల్ని రక్షించే అంబులెన్స్​ల అద్దెలు సామాన్యులకు పెనుభారంగా మారాయి. కొవిడ్​ బాధితులను తీసుకెళ్లాలంటే ఒకరేటు.. కొవిడ్​ మృతుల మృతదేహాలను తరలించాలంటే మరో రేటు చొప్పున దంటుకుంటున్నారు. విపత్కాల సమయంలోను కొందరు అంబులెన్సు నిర్వాహకులు ముక్కుపిండిమరీ వసూలు చేస్తున్నారు.

కరోనా రెండో దశ శరవేగంగా వ్యాపిస్తోంది. అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లాల్సినవారు అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా అంబులెన్సు నిర్వాహకులు నోటికొచ్చినంత అడుగుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్​కు అత్యవసర చికిత్స కోసం తరలిస్తున్నారు. నగరంలోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోను కొవిడ్​ చికిత్సలు అందిస్తున్నాయి. ఇక్కడకు చేరుకోవాలంటే దారిలోనే జేబు ఖాళీ అయిపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్​ చికిత్సకే లక్షలు అవుతున్నాయంటే... ఆస్పత్రికి రావడానికి వేలల్లో అవుతున్నాయని వాపోతున్నారు. కష్టకాలాన్ని సొమ్ము చేసుకుంటున్నట్లుగా... అంబులెన్సు డ్రైవర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎంతడిగితే అంత ఇవ్వాల్సిందే…

కొవిడ్​ బాధితులను అంబులెన్సులో తీసుకెళ్లాలంటే సుమారు 20 వేల వరకు డిమాండ్​ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తమ కుటుంబ సభ్యుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్​ నిర్వహకులు 20 వేలు అడిగారని సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని బాపూజీనగర్​కు చెందిన అజిత్ కన్నీటి పర్యంతమయ్యారు. సాధారణ సమయంలో రూ.8వేల లోపు తీసుకుంటారని... అలాంటిదిప్పుడు 20 వేలు అడుగుతున్నారని వాపోయారు. ఇక మృతదేహాలను తరలించాలంటే వాళ్లు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు.

బాధితులంతా మౌనంగా భరిస్తున్న ఈ బహిరంగ దోపిడీపై ప్రభుత్వం చొరవ తీసుకుని అంబులెన్సులు యాజమాన్యాలు వసూలు చేస్తున్న ధరలపై చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సమయంలో మరింత క్షోభ పెట్టొద్దు..

అంబులెన్స్ నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కష్టకాలంలో అండగా ఉండాల్సింది పోయి ఇలా దండుకోవడం దారుణమన్నారు. కొవిడ్​తో క్షోభలో ఉన్నవారిని మరింత ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తమ కమిషనరేట్​ పరిధిలో ఉచితంగా అంబులెన్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.