ETV Bharat / state

Papikondalu Boat Tourism resume : పర్యాటకులకు గుడ్​న్యూస్.. పాపికొండలు యాత్ర పునఃప్రారంభం

author img

By

Published : Dec 18, 2021, 10:10 AM IST

Papikondalu Boat Tourism resume: చుట్టూ ఎత్తైన కొండలు... కనుచూపు మేర పచ్చదనం... గోదావరిలో విహారం.... ఈ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇలాంటి సుందరమైన దృశ్యాలు పాపికొండలు విహారయాత్రలో కనిపిస్తాయి. బోటు ప్రమాదంతో నిలిపివేసిన ఈ యాత్ర.... ప్రభుత్వాల అనుమతితో పునఃప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి తెలుగురాష్ట్రాల పర్యాటకులను మరోసారి ఆనందాల్లో ముంచెత్తేందుకు పర్యాటకం సిద్ధమైంది.

Papikondalu Boat Tourism resume, papikondalu Yatra
పాపికొండలు యాత్ర పునఃప్రారంభం

పాపికొండలు యాత్ర పునఃప్రారంభం

Papikondalu Boat Tourism resume: సుదీర్ఘ విరామం తర్వాత పాపికొండలు విహారయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభమవుతోంది. కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం అ ప్రాంతాల్లో పర్యాటకాన్ని నిలిపివేయగా... కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగాపూర్తిస్థాయిలో విహారయాత్ర నిలిచిపోయింది. ఇటీవల రెండు తెలుగురాష్ట్రాలు అనుమతించడంతో యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ్టి నుంచి పరిమిత సంఖ్యలో బోటులతో యాత్ర ప్రారంభం కానుంది. భద్రాచలానికి 60కిలోమీటర్ల దూరంలో... తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం పోచవరం నుంచి పాపికొండల్లోకి యాత్ర కొనసాగుతోంది. పర్యాటకులు బోటు ద్వారా ప్రయాణిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శిస్తారు. పర్యాటకంతోపాటు పాపికొండలు టూర్‌ ఎంతోమంది ఆదివాసీలకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్కో బోటుపై దాదాపు 20 మందికిపైగా ఆధారపడి జీవిస్తుంటారు. విహారయాత్ర పునఃప్రారంభంతో అక్కడి ప్రజలు తమకు ఉపాధి దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు పరిశీలించాకే యాత్రకు అధికారులు అనుమతిచ్చారు.

ప్రస్తుతానికి ఆరు బోట్లకు పర్మిషన్ ఇచ్చారు. దానికి పరిమితంగా ఉండేవిధంగా ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు, సీసీ కెమెరాలు వంటి అన్ని హంగులతో ప్రభుత్వం ఆదేశాలతో బోర్డు యాజమాన్యం అన్ని సమకూర్చడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా ఉండేలా గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

-రాజేశ్వరరావు. తెలంగాణ టూరిజం ఏజెంట్

papikondalu Yatra : పాపికొండలు యాత్ర ప్రారంభంతో భద్రాచలానికి పర్యాటకుల రద్దీ పెరుగుతుందని అక్కడి స్థానికులు ఆశిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయామని... పర్యాటకుల రాకతో ఆలయ పరిసరాల్లోని వ్యాపారాలు పుంజుకుంటాయని అభిప్రాయపడుతున్నారు.

బోటింగ్ అందుబాటులోకి రావడం వల్ల చాలామంది రూములు బుక్ చేసుకుంటారు. అందరూ బాగుంటారు. మాకు, రామాలయానికి ఆదాయం వస్తుంది. మాలాంటి బొమ్మల కొట్ల వాళ్లు కూడా బతుకుతారు. ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ పర్మిషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

-కృష్ణ, హోటల్ మేనేజ్మెంట్

papikondalu trip : పాపికొండల్లో రాత్రిపూట బస చేసేందుకు ప్రభుత్వాలు అనుమతివ్వగా... ఇంకా పర్యాటకశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని తెలుస్తోంది.

బోట్ యాక్సిడెంట్ అయిన తర్వాత దాదాపు ఓ రెండేళ్ల నుంచి వ్యాపారాలు లేక, భద్రాచలానికి భక్తులు లేక విలవిలపోతోంది. ఈ బోటింగ్ మళ్లీ ప్రారంభం అవుతుండడం వల్ల చాలామందికి ఉపాధి లభిస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది.

-రామ కృష్ణ, దుకాణదారుడు

ఈ బోటింగ్ యాత్ర రెండు సంవత్సరాల నుంచి లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. యాత్రతో జీవనోపాధి పొందే లాంచీ ఓనర్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేటికి దీనిపై గవర్నమెంట్ స్పందించి... యాత్రను మళ్లీ ప్రారంభించింది. మాకు చాలా సంతోషంగా ఉంది.

--పరిమి సోమశేఖర్, స్థానికులు

ఇదీ చదవండి: తెరుచుకున్న శబరిమల ఆలయం- ఒక్కరోజే దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.